గుంటూరులో గుట్కా మాఫియా చెలరేగిపోతోంది. గుంటూరు పట్టణ సమీపంలోని గిడ్డంగులు అద్దెకు తీసుకుని మసాలా పేరుతో లైసెన్సులు తీసుకుని మరీ అత్యాధునిక యంత్రాలతో కోట్లాది విలువైన గుట్కాలు తయారు చేస్తున్నారు. గుంటూరు నగరంలో అనేక పొగాకు కంపెనీలు ఉన్నాయి. వాటి నుంచి గుట్కా తయారీకి అవసరమైన తక్కువ గ్రేడ్ పొగాకు అతి తక్కువ ధరకు దొరకడంతో గుంటూరు నగరం, దాని సమీప ప్రాంతాల్లో గుట్కా మాఫియా చెలరేగిపోతోంది. గుంటూరు చుట్టుపక్కల భారీ ఎత్తున గుట్కా తయారు చేస్తున్న మాఫియా నాలుగు రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా వారి అండదండలతో గుట్కా మాఫియా చెలరేగిపోతోంది.
ఏటా రూ.1200 కోట్ల వ్యాపారం…
అవును మీరు చదివింది నిజం. ఒక్క గుంటూరు సమీప ప్రాంతాల నుంచే నాలుగు రాష్ట్రాలకు ఏటా రూ.1200 కోట్ల విలువైన గుట్కా అక్రమంగా ఎగుమతి చేస్తున్న కొన్ని మాఫియాలు కోట్లకు పడగలెత్తాయి. ఎవరు అధికారంలోకి వస్తే వారితో వెంటనే చేతులు కలపడం వారికి ప్రతి నెలా ముడుపులు చెల్లించడం ఈ మాఫియా ప్రత్యేకత. రాజకీయ నేతలే కాదు, పోలీసు, ఎక్జైజ్ అధికారులకు కూడా ప్రతి నెలా క్రమం తప్పకుండా గుట్కా మాఫియా పెద్ద మొత్తంలో ముడుపులు చెల్లిస్తోందనేది బహిరంగ రహస్యమే. అధికారంలో ఉన్న పెద్దలకు నెలకు రూ.2 కోట్లు, సహకరించే అధికారులకు మరో రూ.2 కోట్ల దాకా చేతులు మారుతున్నాయని సమాచారం.
రెండు మాఫియాల మధ్య గొడవలతో రచ్చకెక్కారా?
గుంటూరులో ప్రధానంగా రెండు గుట్కా మాఫియాలు పనిచేస్తున్నాయి. తాజాగా పోలీసులు ఓ గుట్కా మాఫియా అధినేతను అరెస్టు చేసి గంట సేపు స్టేషన్లో ఉంచగలిగారు. ఈ మాఫియా డాన్ ను అనేక సార్లు అరెస్టు చేసిన పోలీసులు ఒక్కసారి కూడా జైలుకు పంపలేకపోయారు. రాజకీయ ఒత్తిడులే ఇందుకు ప్రధాన కారణం. ఒక గుట్కా డాన్ ఎక్కడా కనిపించరు. తయారు చేసే వద్ద కానీ, పంపిణీ వ్యవస్థలో కానీ ప్రత్యక్షంగా ప్రమేయం లేకుండా ఆ ఢాన్ జాగ్రత్త పడతారట. అతని వద్ద పనిచేసే వారికే అతని దర్శనం దక్కదట. అంత గోప్యంగా నాలుగు రాష్ట్రాల గుట్కా డాన్ ఎదిగిన ఈ మాఫియా నేతను మరో గుట్కా డాన్ ఈ మధ్య స్వయంగా గుంటూరు అర్భన్ ఎస్పీ అమ్మిరెడ్డికి కంప్లయింట్ చేసి మరీ పట్టించాడు. దీంతో గుంటూరులో గుట్కా తయారీ ముఠాల మధ్య పోరు రచ్చకెక్కింది.
ఇదేపనిలో ఓ వైసీపీ ఎమ్మెల్యే, మరో వైసీపీ సీనియర్ నేత!?
ఇటీవల గుంటూరు సమీపంలోకి నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా ఓ గిడ్డంగిలో అక్రమంగా గుట్కా తయారీ యూనిట్ పై దాడి చేసి పోలీసులు సీజ్ చేశారు. దీనిపై ఆరా తీసిన పోలీసులకు దిమ్మతిరిగినంత పనైంది. గుట్కా తయారీకి వాడుతున్న గిడ్డంగి గుంటూరు తూర్పు వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫాది కావడంతో పోలీసులు కంగుతిన్నారు. ఎమ్మెల్యే వివరణ అడగ్గా ఆ గిడ్డంగి నాదే. కానీ దానికి మసాలా తయారు చేయడానికి అద్దెకు ఇచ్చానని చెప్పారు. దీంతో పోలీసులు చేసేది లేక తయారీలో పాల్గొన్న కూలీలను అరెస్టు చూపించారు.
గుట్కా మాఫియాకు తెరపడుతుందా?
గుట్కా మాఫియాను ఎన్నిసార్లు అరెస్టు చేసినా వారు అక్రమ దందా మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ అక్రమ వ్యాపారంలో ఆరితేరిన మాఫియా ఒక్క ప్రాంతంలో కాకుండా అనేక గిడ్డంగుల్లో తయారీ చేస్తున్నారు. ఒక చోట పోలీసులు సీజ్ చేసినా వారి వ్యాపారం దెబ్బతినకుండా మరో గిడ్డంగి నుంచి సరఫరా చేస్తూ ఉంటారు. గుట్కా మాఫియా ద్వారా అధికార పార్టీ పెద్దలకు, పోలీసు ఉన్నత అధికారులకు ఊహించని మొత్తాలు అందుతూ ఉండటంతో వారు కూడా చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఏదో ఒక గిడ్డంగిలో గుట్కా తయారు చేస్తున్నారనే సమాచారంతో, దాడి చేసి ఆ గిడ్డంగిని సీజ్ చేస్తున్నా పోలీసులు అసలు డాన్ ల జోలికి వెళ్లడం లేదు. ఏదో తయారీలో పాల్గొనే కూలీలను అరెస్టు చేయడం తప్ప ఇందులో సాధించిందేమీ లేదు. ఈ తంతు ఇంతటితో ఆగుతుందని కూడా చెప్పలేం. ఎందుకంటే ఒక్క రూపాయి ఖర్చుతో తయారయ్యే గుట్కా ప్యాకెట్ ను లాక్ డౌన్ సమయంలో రూ. 50 రూపాయలకు కూడా విక్రయించారు. మరి ఇంత లాభం ఉన్నప్పుడు ఎవరు మాత్రం వదులుతారు.
తాజాగా అక్రమ సిగరెట్ట దందా
చైనా, బీహారులో తయారయ్యే అనుమతి లేని సిగరెట్లను గుంటూరు కేంద్రంగా నాలుగు రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. వీరి దెబ్బకు ప్రముఖ బ్రాండ్ల అమ్మకాలు సైతం పడకేశాయి. వీరి ఆగడాలు తట్టుకోలేక ఐటీసీ డీలర్లు గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డికి ఫిర్యాదు చేశారు. ఏటా అక్రమ సిగరెట్ల ద్వారా ప్రభుత్వం రూ.300 కోట్ల ఆదాయం కోల్పోతోందని, తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని ఐటీసీ డీలర్లు వాపోతున్నారు. పోలీసులు ఎంత మందిని అరెస్టు చేసినా ఏపీలో గుట్కా మాఫియాకు, నకిలీ సిగరెట్ల అమ్మకాలు, తాజాగా తెలంగాణ మద్యం కూడా తోడైంది. ఈ మాఫియాలను ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తుందా? లేదా వేచిచూడాల్సిందే?











