ఉత్తరప్రదేశ్లో జరిగిన హత్రాస్ దారుణం కమల పాలకులకు గట్టిగానే అంటుకుంటోంది. దుర్ఘటన జరిగిన తీరు, తదనంతర పరిణామాల్లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఎంత నీతిబాహ్యమైనదో ప్రపంచం మొత్తం చూసింది. అసహ్యించుకుంది. స్వయంగా రాహుల్ గాంధీ.. పర్యటనకు వెళ్లినప్పుడు పోలీసులు ఆయన పట్ల వ్యవహరించిన తీరును కూడా ప్రపంచమంతా నిరసించింది. అందరూ పోలీసుల దుడుకుతనాన్ని ఖండించారు.
ఇప్పుడు ఆందోళనలు, నిరసనలు హస్తినకు పాకాయి. ఇండియా గేట్ వద్ద హత్రాస్ ఘటనకు నిరసన తెలువుతామన్న భీమ్ ఆర్మీ ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు రాజ్ పథ్ మూసివేసారు. ప్రతిఘటనను నిలువరించడం అసాధ్యం అని భావించారేమో గానీ.. అసలు రాజ్ పథ్ నే మూసివేయడం గమనార్హం. సెంట్రల్ ఢిల్లీలో హై అలెర్ట్ ప్రకటించారు. ఇండియా గేట్ పరిసరాల్లో పూర్తిగా 144 సెక్షన్ విధించారు.
హత్రాస్ ఘటనకు నిరసనగా ఢిల్లీలో విపక్షాలు,దళిత సంఘాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. వాల్మీకి మందిర్ వద్ద నిరసన కార్యక్రమంలో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. జంతర్ మంతర్ వద్ద విపక్షాల ఆందోళనలు నడుస్తున్నాయి. నిరసనకారులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించనున్నారు.
హత్రాస్ ఘటన దోషులను కఠినంగా శిక్షించాలని, యూపీలో మహిళలకు భద్రత కల్పించాలని, యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇంత ఘోరమైన దుర్ఘటన జరిగినప్పటికీ.. తదనంతర పరిణామాల్లో పోలీసులు, ప్రభుత్వం పూర్తిగా విఫలమైనప్పటికీ.. కమలదళాలు మాత్రం.. ఈ విషయంపై నోరు మెదపడం లేదు.










