వైసీపీ అధిష్ఠానం విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీలక్ష్మిని ఖరారు చేసింది. లోక్సభ నియోజకవర్గ ఇన్చార్జిగా ఆమెను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లోక్సభ, 15 అసెంబ్లీ స్థానాలకు ఇన్చార్జులను నియమిస్తూ మొత్తం 21 మందితో మూడో జాబితా విడుదల చేసింది. విశాఖపట్నం వైసీపీ ఎంపీ అయిన ఎంవీవీ సత్యనారాయణ అసెంబ్లీ సీటుకు పోటీ చేయాలని ఆసక్తిగా ఉండడంతో ఆయన స్థానంలో వైసీపీ బొత్స ఝాన్సిని అభ్యర్థిగా ఖరారు చేసింది. ఇదే స్థానం నుంచి టీడీపీ తన అభ్యర్థిగా శ్రీ భరత్ ను ఖరారు చేసే అవకాశం బాగా ఉంది. గత ఎన్నికల సమయంలో కూడా శ్రీభరత్ నే టీడీపీ నిలబెట్టింది. కానీ, వైసీపీ హవాలో ఎంవీవీ సత్యనారాయణ గెలిచారు.
శ్రీభరత్.. నందమూరి బాలక్రిష్ణకు చిన్న అల్లుడు, నారా లోకేశ్ కు తోడల్లుడు. పైగా గీతం యూనివర్సిటీ అధినేత మనవడు. దీంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ మళ్లీ శ్రీ భరత్ నే ఎంపీగా నిలబెట్టే అవకాశం ఉంది. ఇదే జరిగితే వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సి లక్ష్మి.. శ్రీభరత్ కు ప్రత్యర్థి కానున్నారు. విజయనగరం జిల్లాకు చెందిన ఝాన్సీ జిల్లా పరిషత్ చైర్పర్సన్గా రెండు సార్లు, బొబ్బిలి, విజయనగరం ఎంపీగా ఒక్కోసారి పనిచేశారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి విజయనగరం ఎంపీగా పోటీ చేసి ఘోర పరాజయం పొందారు. తర్వాత ఆమె భర్త బొత్స సత్యనారాయణ వైసీపీలో చేరగా, 2019 ఎన్నికల్లో ఆమెకు పోటీ చేసే అవకాశం రాలేదు. 2024 ఎన్నికల్లో ఆమె విజయనగరం ఎంపీగా పోటీ చేసేందుకు ఇంట్రస్ట్ చూపారు. కానీ, అధిష్ఠానం విశాఖకు ఫిక్స్ చేసింది. అయితే, గత నాలుగున్నరేళ్లుగా ఝాన్సీలక్ష్మి రాజకీయంగా క్రియాశీలకంగా లేరు. అదీకాక విశాఖపట్నంలో జరిగిన ఏ ఒక్క కార్యక్రమంలో కూడా ఆమె పాల్గొన్న దాఖలాలు లేవు. అయినా కూడా ఆమెను విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీకి దింపాలని వైసీపీ నిర్ణయించింది. దీనిపై అంతర్గతంగానే అసమ్మతులు చెలరేగాయి.
అయితే, శ్రీభరత్ కు కలిసొచ్చే అంశాలు చాలా ఉన్నాయి. విద్యావేత్తగా, సామాజికవేత్తగా శ్రీభరత్ తాతయ్య ఎంవీవీఎస్ మూర్తికి మంచి పేరుంది. శ్రీభరత్ కూడా విశాఖపట్నంలో జరిగే ఎన్నో కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆయనకు విశాఖలో టీడీపీ కేడర్ చాలా బలంగా ఉంది.
గత ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ తరపున పోటీ చేసిన ఎంవీవీ సత్యనారాయణకు 4,36,906 ఓట్లు రాగా.. టీడీపీ అభ్యర్థి అయిన శ్రీభరత్ కు 4,32,492 ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో వైసీపీ హవా అంతగా ఉన్నా కూడా 4 వేల ఓట్ల తేడాతోనే భరత్ ఓటమి చెందాల్సి వచ్చింది. పైగా ఈసారి వైసీపీ మూడు రాజధానులు అంటూ ఊరించి ఉసూరుమనిపించింది. ఆ మూడు రాజధానుల అంశం కూడా అక్కడ వైసీపీకి కలిసి వచ్చే అంశంగా అస్సలు లేదు. తరచూ అక్కడి రాజకీయ నేతలు మూడు రాజధానులు ఎందుకని, అమరావతినే రాజధానిగా డెవలప్ చేయాలని అంటూ ఉంటారు. కాబట్టి, అక్కడ విశాఖ రాజధాని అనే సెంటిమెంట్ బొత్తిగా లేనేలేదు. కాబట్టి, ఈసారి వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సి పై టీడీపీ అభ్యర్థి శ్రీభరత్ సునాయసంగా గెలిచే అవకాశం ఉంది