అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల కోసం టీడీపీ కూడా అభ్యర్థుల ఖరారుపై ఫోకస్ చేస్తోంది. ఇప్పటికే వైసీపీ మూడు జాబితాలతో కొంత మంది పేర్లను ఖరారు చేసింది. ఆ జాబితాలతో సంతృప్తిగా ఉన్నవారి కంటే కూడా అసమ్మతి జ్వాలలు ఉన్నవారి సంఖ్యే ఎక్కువ. దీంతో కొంత మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీని వీడి.. టీడీపీ లేదా జనసేన వైపు చూస్తున్నారు. ఇంకొంత మంది వైఎస్ షర్మిల వెంట నడిచేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరాలని చూస్తున్నారు.
ఇక టీడీపీ విషయంలో అనకాపల్లి ఎంపీ స్థానం కాస్త ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఎంపీ స్థానం నుంచి 2014లో టీడీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్ గెలుపొందగా.. 2019 ఎన్నికల్లో వైసీపీ చేతిలోకి వెళ్లిపోయింది. బీసెట్టి వెంకట సత్యవతి 2019లో ఎంపీగా గెలిచారు. ఇప్పుడు వైసీపీ తన ఎంపీ అభ్యర్థిని ఇంకా అనకాపల్లిలో ప్రకటించలేదు. కానీ, టీడీపీ మాత్రం అనకాపల్లి లోక్ సభ టికెట్ ను చింతకాయల విజయ్ ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈయన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడు. అయ్యన్నపాత్రుడు కుటుంబానికి విశాఖ జిల్లాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అయ్యన్న ఎన్టీఆర్ హయాం నుంచి పార్టీలో ఉంటున్నారు. కుమారుడు చింతకాయల విజయ్ కూడా పార్టీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పార్టీ కార్యకర్తల శిక్షణా కార్యక్రమాలతో పాటుగా కీలక బాధ్యతల్ని పర్యవేక్షిస్తున్నారు.
చింతకాయల విజయ్ సోషల్ మీడియా వింగ్ నిర్వహణలోనూ చురుగ్గా ఉంటారు. అనకాపల్లి పార్లమెంట్ స్థానంలో కాపులు అధికంగా ఉండటం.. వారి తర్వాత యాదవులు కీలకంగా ఉంటారు. కానీ, ఇప్పుడున్న పరిస్ధితుల్లో కాపు అభ్యర్ధి అయితే కరెక్టని భావించినప్పటికీ.. కేవలం కులమే కాకుండా అన్ని రకాల అర్హతలు ఉన్నవారినే ఎంపిక చేయాలని టీడీపీ అధిష్ఠానం భావించినట్లు తెలిసింది. ఆ ప్రాంతంలో అయ్యన్నపాత్రుడు కీలకం కావటంతో కుమారుడు విజయ్ కు ఈసారి ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నట్లు సమాచారం.
ఆ మధ్య చింతకాయల అయ్యన్నపాత్రుడిపై అక్రమ కేసులు బనాయించి, అర్ధరాత్రి వేలాది మంది పోలీసులు ఇంట్లోకి చొరబడి కట్టుబట్టలతో దౌర్జన్యపు అరెస్టు చేసిన సందర్భంలో కూడా చింతకాయల విజయ్ బాగా పోరాడారు. తన తండ్రి అరెస్టుకు నిరసనగా బాగా గొంతెత్తారు. నర్సీపట్నం నుంచి అయ్యన్న పాత్రుడు పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తుండగా.. ఇప్పుడు పెద్ద కుమారుడు చింతకాయల విజయ్ పేరునే అనకాపల్లి ఎంపీగా బరిలోకి దింపాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. అటు సోషల్ మీడియాలో కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. చింతకాయల విజయ్కు అనకాపల్లి ఎంపీ సీటు ఖాయమైందనే ప్రచారం నడుస్తోంది