దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం మీద పెద్ద చర్చ జరుగుతోంది. గులాబీ కారు స్పీడ్కు బ్రేకులు పడటంతో ఎవరికి వారు చాలానే విశ్లేషణలు చేస్తున్నారు. ఖచ్ఛితంగా గెలిచే సీటు.. భారీ మెజార్టీ తర్వాత.. అరకొర అధిక్యతతో అయినా గెలవాలి కదా?ఎందుకు గెలవలేదు? తప్పు ఎక్కడ జరిగింది? పోల్ మేనేజ్ మెంట్లో పీహెచ్ డీ చేసిన కేసీఆర్ దర్శకత్వంలో.. మేనల్లుడు కమ్ టాస్క్ మాస్టర్ హరీశ్ రావు స్వయంగా రంగంలో ఉన్న వేళ షాకింగ్ ఫలితం రావటం ఏమిటి? భారీ మెజార్టీ తర్వాత.. ఇంత దారుణ పరిస్థితి ఎందుకు ఎదురైంది? అన్న ప్రశ్న ఇప్పుడు అందరి మెదళ్లను తొలుస్తోంది.
ఇలాంటి వేళ.. ఎన్నికల ఫలితాల విడుదల సందర్భంగా విడుదల చేసే అధికారిక పత్రాన్ని కించిత్ జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఒక కొత్త విషయం ప్రముఖంగా కనిపిస్తోంది. ప్రధాన పార్టీల మధ్య అధిక్యతలు ఎలా మారుతున్నాయి? అన్న అంశం మీదనే ప్రధాన మీడియా మొత్తం ఫోకస్ పెట్టిన వేళ, సూక్ష్మమైన అంశాలు, మొత్తం ఫలితాన్ని ప్రభావితం చేసిన విషయాల్ని పట్టించుకోని వైనం కనిపిస్తుంది. ఇంతకీ ఆ విషయం ఏమంటే దుబ్బాక ఉప ఎన్నికల బరిలో మొత్తం 23 మంది అభ్యర్థులు ఉన్నారు. నోటాతో కలిపి 24 మంది ఉన్నారు.
ఎవరూ పట్టించుకోని 17వ అభ్యర్థి
అందరి చూపులు మొదటి ముగ్గురు అభ్యర్థుల మీదనే ఉంది. కొద్ది మంది ఆసక్తి ఉన్న వారు కత్తి కార్తీక వైపు నోటామీద ఫోకస్ చేశారు. అంతేకానీ జాబితాలో 17వ అభ్యర్థిగా ఉన్న బండారు నాగరాజు అనే అభ్యర్థిని ఎవరూ పట్టించుకోలేదు. ఒక రకంగా చెప్పాలంటే టీఆర్ఎస్ అభ్యర్థికి వచ్చే ఫలితాల్ని తీవ్ర ప్రభావితం చేసిన వారిలో అతడే కీలకమంటున్నారు. ఎవరీ నాగరాజు? ఇప్పటి వరకు అతడి పేరే వినలేదంటారా? కొన్నిసార్లు లక్ మనకు దూరంగా ఉన్నప్పుడు బండారు నాగరాజు లాంటి వారే తగులుతుంటారు.
ఈవీఎంలలో పధ్నాలుగు మంది అభ్యర్థులు ఉంటారు. అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పుడు రెండు ఈవీఎంలను వినియోగిస్తారు. దుబ్బాకలో బరిలో ఉన్న అభ్యర్థులు మొత్తం 24 (నోటాతో కలిపి) మంది అభ్యర్థులు ఉండటంతో రెండు ఈవీఎంలను వినియోగించారు. ఈ విషయాన్ని ఇక్కడ కాసేపు ఆపి.. ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీశ్ పదే పదే చెప్పిన ఒక విషయాన్ని గుర్తుకు తెచ్చుకుంటే బండారు నాగరాజు కారణంగా ఎంత భారీ డ్యామేజ్ జరిగిందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.
మూడో బటన్ నొక్కుడే.. నొక్కుడు
ఓటర్లకు మరింత అవగాహన కలిగించేందుకు వీలుగా హరీశ్ ఈవీఎంల గురించి చెబుతూ మీరు మరో ఆలోచన లేకుండా మూడో బటన్ను నొక్కేయండి. మరింకేం ఆలోచించకండి. మూడో బటన్ నొక్కుడే.. నొక్కుడు అంటూ హరీశ్ తనదైన ఫ్లోలో చెప్పేశారు. హరీశ్ చెప్పిన మూడో బటన్ను గుడ్డిగా గుర్తు పెట్టుకున్న కొందరు గ్రామీణ ఓటర్లు.. మొదటి ఈవీఎంలో ఒత్తాల్సిన మూడో బటన్కు బదులుగా..రెండో ఈవీఎంలో ఉన్న మూడో బటన్ నొక్కటంతో లెక్క తేడా కొట్టేసింది. 23వ రౌండ్ పూర్తి అయ్యేసరికి బండారు నాగరాజుకు వచ్చిన మొత్తం ఓట్లు ఏకంగా 3489. తుది ఫలితం చూసినప్పుడు.. బీజేపీ అభ్యర్థి గెలుపొందిన మెజార్టీ 1470 ఓట్లు. మరి నాగరాజుకు పడిన ఓట్లు.. మొదటి ఈవీఎంలోని మూడో బటన్కు పడి ఉంటే..? కాలం అనుకూలంగా లేనప్పుడు కొన్నిసార్లు ఇలానే జరుగుతాయి మరి.