సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకి వైసీపీ అధినేత జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చారా.?? ఆయనకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజ్యసభ ఎంపీ పదవి ఆఫర్ చేశారా.?? ఆయనను పార్లమెంట్కి పంపుతా అని హామీ ఇచ్చారా??? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి..
గత కొంతకాలంగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జగన్ సర్కార్పై ప్రశంసలు కురిపిస్తున్నారు.. ముఖ్యంగా జగన్ సర్కార్ చేపడుతున్న నాడు – నేడు, జగన్ అన్న ఆరోగ్య సురక్ష లాంటి పథకాలు బావున్నాయని తన అభిప్రాయం చెబుతున్నారు.. ఈ కామెంట్స్ని వైసీపీ సోషల్ మీడియాతోపాటు నీలి, కూలి మీడియా బాగా ప్రమోట్ చేస్తోంది.. అటు లోక్ సత్తా మాజీ అధినేత జేపీ, ఇటు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తమ సర్కారు నిర్ణయాలను ప్రశంసిస్తున్నారంటూ హైలైట్ చేసుకుంటున్నారు వైసీపీ నేతలు..
అయితే, ఈ ఇద్దరికీ సోషల్ మీడియాలోనే సెటైర్లు పడుతున్నాయి.. జగన్ పథకాలను ప్రశంసిస్తున్నారు సరే.. ఈ ప్రశ్నలకు బదులేదని నిలదీస్తున్నారు.. నాడు – నేడు ఓకే మరి… ఏపీ సర్కార్ హడావిడిగా ప్రారంభించిన బైజూస్ ట్యాబ్ లు, టోఫెల్ ఎగ్జామ్స్, ఐబీ సిలబస్పై విద్యా శాఖ మేధావులు, ప్రముఖ విద్యావేత్తలే విమర్శలు గుప్పిస్తుంటే అవి కళ్లకు కనిపించలేదా .?? అని నిలదీస్తున్నారు.. వాటిలో జరుగుతున్న అవినీతి మాటేమిటి.?? కనీసం అవినీతి కనిపించకపోయినా, వాటి అమలుతో విద్యార్ధుల భవిష్యత్తుకు జరుగుతున్న నష్టం సంగతేంటని ప్రశ్నిస్తున్నారు…
గతంలో చంద్రబాబు హయాంలో ప్రారంభమయిన విదేశీ విద్యార్ధులకు అందించిన విద్యాకానుక, సివిల్స్ సర్వీసెస్ లాంటి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేవారికి అందించిన పథకాలను జగన్ సర్కార్ నాలుగేళ్లు నిలిపివేస్తే అవి కళ్లకు కనిపించలేదా అని గుర్తు చేస్తున్నారు.. వీటికితోడు, ఏపీకి చంద్రబాబు తీసుకువచ్చిన వందల పరిశ్రమలు, కల్పించిన ఉపాధి అవకాశాలు, అమరావతి రాజధాని పరుగులు, పోలవరం ప్రాజెక్ట్ పనుల ఉరకలు… ఇవేవీ జేడీకి కనిపించలేదా.? అని నిలదీస్తున్నారు…
జనసేనకి దూరం అయిన సీబీఐ మాజీ జేడీ .. ఈ దఫా ఎన్నికలలో టీడీపీ టికెట్ ఆశించారు.. ఆ పార్టీ కండువా కప్పుకోవాలని భావించారట.. ఇదే విషయాన్ని ఆ పార్టీ అధినేత చంద్రబాబుకి తెలియజేయగా, ఆయన నో చెప్పారని ప్రచారం జరుగుతోంది.. దీంతో, ఆయన వైసీపీకి టచ్లోకి వెళ్లారని, ఈ ఎన్నికలలో జగన్కి బయటనుండి మేధావి వర్గం తరఫున క్యాంపెయినింగ్ చేస్తే ఎన్నికల తర్వాత రాజ్యసభ సీటు ఇస్తామని ఆఫర్ చేశారట.. ఈ గోల్డెన్ ఆఫర్కి ఆయన ఓకే అన్నారని రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతోంది.. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ, జేడీ.. వైసీపీకి దగ్గరయ్యారనేది మాత్రం వాస్తవం అంటున్నారు రాజకీయ పరిశీలకులు..