వరల్డ్ వైడ్ గా ఐపీఎల్ లీగ్ కు ఎంత క్రేజీ ఉందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఐపీఎల్ లీగ్ కు అంత క్రేజీ ఎందుకు ఉందో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ రుజువు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణిత 20 ఓవర్లు ముగిసేసరికి 201 పరుగులు చేసింది. ఒకానొక దశలో బెంగళూరు స్కోరు 150 పరుగులు కూడా దాటడం కష్టమేనని భావిస్తున్న వేళ డీవిలియర్స్, శివమ్ దూబే చెలరేగి ఆడి జట్టు స్కోరును 201 పరుగులు చేర్చారు. దీంతో ఈ మ్యాచ్ లో గెలుపొందాలంటే ముంబై ఇండియన్స్ 202 పరుగులు చేయవలసి వచ్చింది.
కిషన్ క్లాస్ + పోలార్డ్ మెరుపులు
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ వరుస విరామాలలో వికెట్లను నష్టపోయింది. ‘హిట్’ మాన్ రోహిత్ శర్మ(8), డీకాక్(14), సూర్యకుమార్ యాదవ్(0), హార్దిక్ పాండ్య(15) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరడంతో 78 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనించింది. ఈ దశలో ఇషాన్ కిషన్-పోలార్డ్ జోడి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఇషాన్ కిషన్ చెలరేగి ఆడటంతో జట్టు స్కోరు జెట్ స్పీడ్ తో దూసుకుపోయింది. మొదట పోలార్డ్ నిదానంగా ఆడినా ఆ తరువాత గేర్ మార్చాడు. వీరిద్దరూ హాఫ్ సెంచరీలతో సత్తా చాటడంతో ముంబై పుంజుకుంది. చివరి ఓవర్ లో 19 పరుగులు చేయవలసిన దశలో ఒత్తిడికి గురైన కిషన్ 99 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. చివరి బాల్ కు 5 పరుగులు చేయవలసిన దశలో పోలార్డ్ ఫోరు కొట్టడంతో ముంబై 201 పరుగులకు చేరింది. రెండు జట్ల స్కోరు సమం కావడంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కు చేరుకుంది.
రాత మార్చిన సూపర్ ఓవర్
సూపర్ ఓవర్ లో ముంబై ఇండియన్స్ తప్పు చేసింది. రెగ్యులర్ ఓపెనర్స్ అయిన రోహిత్ శర్మ, డీకాక్ లు కాకుండా పోలార్డ్, హార్దిక్ పాండ్యలను పంపింది. వీరిద్దరూ భారీ షాట్లు ఆడటంలో విఫలం కావడంతో కేవలం 7 పరుగులు మాత్రమే చేయగలిగింది. 8 పరుగుల లక్ష్యంతో అడుగుపెట్టిన బెంగళూరు ఈజీగా విజయాన్ని సాధించగలిగింది. దీంతో ఇషాన్ ‘కిషన్’ కష్టం వృధా అయిందని చెప్పక తప్పదు. ఒత్తిడిని తట్టుకొని ఆడటంలో అనుభవం లేకపోవడంతో కిషన్(99) చివరి ఓవర్ లో పెవిలియన్ చేరడంతో ముంబై ఈ మ్యాచ్ ఓడిపోయిందని చెప్పక తప్పదు.











