ఓటమి వచ్చినప్పుడు కుంగిపోతాం కానీ.. భవిష్యత్తుకు అవసరమైన బలాన్ని ఆ అపజయమే ఇస్తుందన్న వాస్తవాన్ని చాలామంది మరిచిపోతుంటారు. విజయం లోపాల్ని కనిపించకుండా అడ్డుపడితే.. ఓటమి.. లోపాల్ని అధిగమించే అవకాశాన్ని తీసుకొస్తుంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు లోకేశ్ విషయంలోనూ ఇదే జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అవకాశం ఉందని లెక్కలు వేసుకొని దిగిన మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఊహించని ఓటమిని ఎదుర్కొన్న లోకేశ్.. ఆ ఓటమిని చాలావరకు మార్చిందని చెబుతారు.
మానసికంగా..శారీరకంగానూ చాలానే మార్పులకు దోహపడినట్లు చెప్పాలి. గతానికి మించి మాటల్లో చురుకు పెరగటమే కాదు.. అలవోకగా ప్రత్యర్థులపై విరుచుకుపడే తీరు ఆయనకిప్పుడు సహజసిద్ధంగా మారింది. అన్నింటికి మించి తన గేమ్ ప్లాన్ కు తగ్గట్లే.. అధికారపక్ష నేతల్ని ఒత్తిడికి గురి చేయటంలోనూ సక్సెస్ అవుతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో వరద కారణంగా నష్టపోయిన వారిని పరామర్శించేందుకు వచ్చిన ఆయన.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
లోకేశ్ కు ఏం అధికారం ఉందని రైతుల్ని పరామర్శిస్తాడు?
ఎన్నికల్లో ఓడిన లోకేశ్ కు ప్రజల్లోకి వెళ్లే హక్కు లేదంటున్నారన్న మాటలపై స్పందిస్తూ.. ‘నిజమే.. నాకు అధికారం లేదు. జగన్ రెడ్డిలా మూర్ఖత్వం లేదు. కానీ నాకు మానత్వం ఉంది’ అంటూ ఘాటు పంచ్ వేశారు. తన మాటల్ని తప్పు పడుతూ.. తనకు అవగాహన లేదన్న మంత్రులపై సైతం లోకేశ్ చురకలు వేశారు. రైతులు గోచీతోనే ఉండాలనేంత అవగాహన.. అతితెలివి తనకు లేని మాట నిజమే అంటూ వ్యంగ్యస్త్రాల్ని సంధించారు.
గతానికి భిన్నంగా లోకేశ్ పై మాటల దాడి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు తరచూ దొరికిపోతున్నారు. మొన్నటికి మొన్న మంత్రి బొత్స మాట్లాడుతూ.. ఏదైనా విపత్తు చోటు చేసుకున్నప్పుడు.. విపత్తు మొత్తం పూర్తి అయ్యాక మాత్రమే నష్టం లెక్కలు తయారు చేస్తారంటూ చెప్పిన మాటలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
ఓవైపు విపత్తు విరుచుకుపడే వేళలోనే.. ఎంత నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నది అంచనా వేయటంతో పాటు.. ఏం చేయాలన్న దానిపై వ్యూహాలు సిద్ధం చేయటం ఎప్పటి నుంచో ఉంది. అంతేకానీ.. విపత్తు వెళ్లిపోయాక తీరిగ్గా సర్దుకొని సహాయక చర్యలు ఏం చేయాలన్న దానిపై ఆరా తీయరు. ఇంత చిన్న విషయంలో అంత సీనియర్ అయిన బొత్స మాటలు ఎందుకు తడబడ్డాయి అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
ఇదే అంశాన్ని ప్రస్తావించిన లోకేశ్..
వరద ఉంటే పంట నష్ట పరిహార అంచనా ఎలా చేస్తామని అడుగుతున్నారంటూ విరుచుకుపడ్డారు. ఇదంతా చూసినప్పుడు.. విపత్తు వేళ జగన్ సర్కారు ఆత్మరక్షణలో పడిందా? అన్నది ప్రశ్నగా మారింది. గతంలో వరదలు విరుచుకుుపడినప్పుడు సాగిన సహాయకచర్యలకు.. తాజాగా జరుగుతున్న పరిణామాల్ని ప్రజలు నిశితంగా పరిశీలించటం.. వారిలో పెరుగుతున్న ఆగ్రహాన్ని గుర్తిస్తున్న ఏపీ అధికారపక్షం ఇప్పుడు తీవ్ర ఒత్తిడికి గురి అవుతున్నారన్న మాట వినిపిస్తోంది. ఇదే సమయంలో పాయింట్ బ్లాక్ లో లోకేశ్ నోటి నుంచి వస్తున్న మాటలు తూటాలుగా మారటం వారి ఇరిటేషన్ ను మరింత పెంచుతుందన్న మాట వినిపిస్తోంది.
నిరసనలు కూడా..
వరద బాధిత రైతులను పరామర్శించడానికి వెళ్లిన నారా లోకేష్ కు ఒక వర్గం ప్రజల నుంచి ప్రతిఘటన కూడా తప్పలేదు. పేదలకు మూడు సెంట్ల భూమి ఇస్తానని చెప్పి మోసం చేసిన లోకేష్ పర్యటించడానికి రావద్దంటూ కొందరు ప్లకార్డులు ప్రదర్శించారు. లోకేష్ గో బ్యాక్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించడం విశేషం.











