(మచిలీపట్నం నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
మాజీ మంత్రి, తెలుగుదేశానికి చెందిన కొల్లు రవీంద్ర చుట్టూ మరింతగా ఉచ్చు బిగుస్తోంది. జులై 30 వ తేదీన మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్, వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మోకా భాస్కరరావు మచిలీపట్నంలో హత్య చేయబడ్డారు. అనంతరం ఈ హత్య కేసులో ముద్దాలతో పాటు మాజీమంత్రి కొల్లు రవీంద్రను ఏ4 గా పేర్కొంటూ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇందులో రాజకీయకొణం ఉన్నదని, వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావాలనే కొల్లు రవీంద్రను ఈ కేసు లో ఇరికించారంటూ తెలుగుదేశం నాయకులు ఆరోపించారు.
అయితే ఈ కేసు లో రవీంద్ర అరెస్ట్ కాబడి 45 రోజులు ఐనప్పటికీ నేటి వరకు బెయిల్ రాలేదు. అలా అనడం కంటె ఆయనకు బెయిల్ రాకుండా చేయటంలో ఆయన ప్రత్యర్థులు సఫలీకృతులయ్యారనే మాటే నియోజకవర్గంలో ఎక్కువగా వినిపిస్తోంది. రకరకాల కారణాలతో ఆయన బెయిల్ పిటిషన్ కు ఆటంకాలు సృష్టిస్తున్నారు.
ఒక సారి ఈ కేసుకు సంబందించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్- గతంలో కొల్లు రవీంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అపాయింట్ అయిన వ్యకి అయినందున ఆయనను ఈ కేసు నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. అలాగే రవీంద్రకు బెయిల్ ఇస్తే సాక్షులను భయపెడతారంటూ మరొక సారి అడ్డుకున్నారు. ఈ విధంగా రవీంద్రకు బెయిల్ రాకుండా ఆయన రాజకీయ ప్రత్యర్ధులు వ్యూహాత్మకంగా వ్యహరిస్తుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం ఏదో మొక్కుబడిగా బెయిల్ ప్రయత్నాలు చేస్తున్నారు.
రాష్ట్రంలో వైస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటినుండి తెలుగుదేశం నాయకులపై ఏదోఒక కేసులు బనాయిస్తూ వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తున్నారనేది తెలుగుదేశం వారి వాదన. ఈక్రమంలో మాజీమంత్రి అచ్చెన్నాయుడు, మాజీ శాసనసభ్యుడు జె.సి.ప్రభాకరరెడ్డి తొలుత అరెస్ట్ కాగా పిదప కొల్లు రవీంద్ర అరెస్ట్ అయ్యారు.
అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు అచ్చెన్నాయుడు, ప్రభాకరరెడ్డి విషయంలో చూపించిన శ్రద్ద రవీంద్ర విషయంలో చూపించలేదనే వాదన ఆపార్టీకి చెందిన నాయకులలో కొందరు వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గాని, ప్రధానకార్యదర్శి లోకేష్ కానీ కొల్లు రవీంద్ర అరెస్ట్ అనంతరం మచిలీపట్నం వచ్చి వారి కుటుంబాన్ని పరామర్శించలేకపోయారని కేవలం ఫోన్లో మాత్రమే పరామర్శించారు కానీ స్వయంగా రాకపోవటం పట్ల కార్యకర్తలలో అసంతృప్తి ఉన్నది.
అచ్చెన్నాయుడు, జె.సి.లది రాజకీయ నేపధ్యం గల కుటుంబాలు కావటంతో వారి పట్ల పార్టీ చూపించినంత శ్రద్ద రవీంద్ర విషయంలో చూపెట్టలేదని మరికొందరు కార్యకర్తలు అంటున్నారు. అంతే కాక జిల్లాలోను మచిలీపట్నంలోను పార్టీలో నెలకొనివున్న గ్రూపుల వల్ల రవీంద్ర విషయంలో పార్టీ నాయకులు ప్రత్యేక శ్రద్ధచూపించలేదనే వాదన కూడా ఉన్నది. అందుచేతనే ఏదో మొక్కుబడిగా అరెస్టును ఖండిస్తూ పత్రికలలో ప్రకటనలు ఇచ్చారే కానీ ఏవిధమైన ఆందోళన, నిరసనలు పార్టీ నాయకులు పెద్దగా చేపట్టలేదని కార్యకర్తలు వాపోతున్నారు.
ఏది ఏమైనప్పటికీ ఐదు ఏళ్లు మంత్రిగా పనిచేసిన వ్యక్తి కష్టాలలో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత పార్టీ పైన ఉంది. తన ప్రత్యర్ధులు పన్నిన వ్యూహం లో చిక్కుకుని బయట పడలేక పోతున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్రను ఆదుకోవాల్సిన ఆవశ్యకత తెలుగుదేశం పార్టీ నాయకుల బాధ్యత అని, ఈ విషయంలో పార్టీ మరింతలోతుగా పరిశీలించాలని రాజకీయపరిశీలకులు భావిస్తున్నారు.