నరేంద్ర మోదీ.. ఈ పేరు ఓ ప్రభంజనం.. వివాదాల మయం. అభివృద్ధికి తారక మంత్రం.. అంతులేని పట్టుదలకు పర్యాయపదం. వైరుధ్యాల సమాహారం.. స్థిరమైన నాయకత్వానికి రూపం. ఓ మారుమూల పల్లెటూళ్లో వెనుకబడిన కుటుంబంలో పుట్టిన నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి నాయకుడిగా ఎదిగిన వైనం ఓ వ్యక్తిత్వ వికాస పాఠం. నేడు 70వ జన్మదినోత్సవం జరుపుకుంటున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవిత విశేషాల సమాహారం..
మే 16, 2014.. వందల ఏళ్ల చరిత్ర ఉన్న భారత జాతీయ కాంగ్రెస్పై ఓ చాయ్వాలా చిరస్మరణీయ విజయం సాధించిన రోజు. పదేళ్ల కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడుతూ ఓ బడుగు నేత చారిత్రక విజయం సాధించిన రోజు. కాంగ్రెస్ పార్టీకి, నరేంద్ర మోదీకి మధ్య జరిగిన ఎన్నికల యుద్ధం ఫలితం వచ్చిన రోజు. సాధారణ కార్యకర్త కూడా ప్రధాని స్థాయికి ఎదగొచ్చనే భారత ప్రజాస్వామ్య గొప్పదనం ప్రపంచానికి తెలిసిన రోజు.. నరేంద్ర దామోదర్దాస్ మోదీ.. ఆ రోజు సాధించిన విజయం వెనుక ఎంతో కృషి ఉంది.. కష్టం ఉంది.. అవమానాలున్నాయి.. తిరస్కారాలున్నాయి. వాటిని అధిగమించుకుంటూ పైకెదిగిన ధీరోదాత్తత ఉంది.
సెప్టెంబర్ 17, 1950.. స్వాతంత్ర్యం వచ్చిన మూడేళ్లకు బొంబాయి రాష్ట్రంలోని (ప్రస్తుత గుజరాత్) మెహ్సానా జిల్లాలోని వాద్నగర్లో ఒక ఓ వెనుకబడిన కుటుంబంలో నరేంద్ర మోదీ జన్మించారు. మూల్చంద్ మోదీ, హీరాబెన్ మోదీకి మూడో సంతానమైన మోదీ చిన్నతనం నుంచే తండ్రికి సహాయపడుతూ ఉండేవారు. వాద్నగర్ రైల్వేస్టేషన్లో తండ్రితో కలిసి టీ అమ్మేవారు. అనంతరం తన సోదరుడితో కలిసి ఓ టీస్టాల్ను కూడా నడిపారు. ఎనిమిదేళ్ల వయసులో మోదీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) వైపు ఆకర్షితులయ్యారు. స్థానికంగా జరిగే శిక్షణ కార్యక్రమాలకు హాజరయ్యేవారు. అక్కడే తన రాజకీయ మార్గనిర్దేశకుడు లక్ష్మణరావు ఇనామ్దార్ను కలిశారు. 80వ దశకంలో గుజరాత్లో బీజేపీకి పునాదులు వేసిన నాతాలాల్ జగ్దా, వసంత్ తదితరులతో అక్కడే పరిచయాలు పెంచుకున్నారు. చిన్నవయసులోనే మోదీకి తన కులానికే చెందిన యశోదా బెన్తో వివాహం జరిగింది. అయితే ఆరెస్సెస్ విధానాల పట్ల ఆకర్షితుడైన మోదీ ఆమెతో కలిసి జీవించలేదు. 2014 ఎన్నికలకు ముందు మోదీ స్వయంగా తను వివాహితుడినని చెప్పేవరకు ఆ విషయం బయటకు రాలేదు.
25 జూన్, 1975.. ఇందిరా గాంధీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించిన రోజు. దాదాపు 21 నెలలపాటు కొనసాగిన ఎమర్జెన్సీ సమయంలోనే నరేంద్ర మోదీ గుజరాత్లో రాజకీయంగా ఎదిగారు. ప్రత్యర్థి పార్టీ నాయకులందరినీ నిర్బంధిస్తున్న ఆ సమయంలో మోదీ `గుజరాత్ లోక్ సంగ్రాహ సమితి` ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేశారు. మారు వేషాల్లో రాష్ట్రమంతటా పర్యటిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కరపత్రాలను పంచేవారు. ఆ సమయంలోనే మోదీ `సంఘర్ష్ మా గుజరాత్` పుస్తకాన్ని రాశారు. ఎమర్జెన్సీ ముగిశాక ఆరెస్సెస్ తరఫున పనిచేసేందుకు ఢిల్లీ వెళ్లారు. అనంతరం గుజరాత్ తిరిగి వచ్చి ఆరెస్సెస్ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. 1987 అహ్మదాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలవడంలో కీలక పాత్ర పోషించి ప్రధాన నాయకుల దృష్టిలో పడ్డారు. గుజరాత్ బీజేపీ యూనిట్కు కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎంపికయ్యారు.
అక్టోబర్ 7, 2001.. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కేశూభాయ్ పటేల్ అనారోగ్యం పాలవడం మోదీకి కలిసి వచ్చింది. కేశూభాయ్ అధికార దుర్వినియోగం, అవినీతి, భుజ్ భూపంకం అనంతరం సరిగ్గా స్పందించకపోవడం వంటి కారణాలతో 2001లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ కొన్ని సీట్లు కోల్పోయింది. దాంతో కొత్త అభ్యర్థి కోసం బీజేపీ నాయకత్వం అన్వేషణ మొదలుపెట్టింది. బీజేపీ జాతీయ నాయకులుగా ఉన్న ఎల్కే అద్వాని, వాజ్పేయి దృష్టిని మోదీ ఆకర్షించారు. 2002 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని విజయ తీరాలకు చేర్చే బాధ్యతను అప్పగిస్తూ మోదీని ముఖ్యమంత్రిని చేశారు.
ఫిబ్రవరి 27, 2002.. అయోధ్య నుంచి తిరిగి వస్తున్న హిందూ భక్తులతో కూడిన రైలు గోద్రా వద్ద తగలబడింది. దాదాపు 60 మంది హిందువులు ఆ ప్రమాదంలో ప్రాణాలు విడిచారు. బాబ్రీ మసీదు కూల్చివేతకు నిరసనగా స్థానిక ముస్లింలు చేసిన తీవ్రచర్యగా ముఖ్యమంత్రి మోదీ అభివర్ణించారు. ఆ తర్వాతి రోజు విశ్వహిందూ పరిషత్ రాష్ట్రవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చింది. బంద్ ముసుగులో ముస్లింలపై దాడులు జరిగాయి. గోద్రాలో మరణించిన వారి శరీరాలను అహ్మదాబాద్కు తరలించాలనే ప్రభుత్వం నిర్ణయం ఆగ్నికి మరింత ఆజ్యం పోసింది. ముస్లింలపై దారుణ మారణ కాండకు కారణమైంది. ఎందరో చిన్న పిల్లలు మరణించారు. మరెందరో మహిళలు అత్యాచారానికి గురయ్యారు. ఆ ఘటనలో 790 మంది ముస్లింలు, 254 మంది హిందువులు మరణించారని ప్రభుత్వం ప్రకటించింది. అయితే 2000 మంది వరకు మరణించి ఉంటారని, 1.50 లక్షల మంది బాధితులుగా మారారని అనధికారిక సమాచారం. ఆ ఘటన మోదీపై తీవ్ర వ్యతిరేకతకు కారణమైంది. జాతీయ, అంతర్జాతీయ వ్యాప్తంగా మోదీపై విమర్శలు వెల్లువెత్తాయి. మోదీని ముఖ్యమంత్రిగా కొనసాగించవద్దని డీఎంకే, టీడీపీ వంటి ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నుంచి డిమాండ్లు వచ్చాయి. అయితే బీజేపీ అగ్ర నాయకత్వం మాత్రం మోదీ వైపే నిలబడింది. వారి అంచనాలను నిజం చేస్తూ 2002 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మోదీ మరోసారి అధికారంలోకి తీసుకొచ్చారు. డిసెంబర్ 22, 2002న రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి 2014 వరకు అప్రతిహతంగా గుజరాత్ను పాలించారు. గుజరాత్ను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి దేశం దృష్టిని ఆకర్షించారు.
పదేళ్ల కాంగ్రెస్ అవినీతి, కుంభకోణాలతో విసిగిన దేశ ప్రజలు నరేంద్ర మోదీ వైపు ఆకర్షితులయ్యారు. అద్భుతమైన వక్త అయిన మోదీ తన వాక్చాతుర్యంతో ప్రజలను తన వైపు తిప్పుకున్నారు. అనుకున్నట్టుగానే 2014 ఎన్నికల్లో భారీ విజయం సాధించి ప్రధాని పదవిని అధిష్టించారు. అయితే అభివృద్ధి జపం చేసి అధికారంలోకి వచ్చిన మోదీ ఆ తర్వాత హిందుత్వను ప్రోత్సహించారు. `హిందీ, హిందూ, హిందూస్తాన్` అనే ఆరెస్సెస్ విధానంతోనే ముందు కెళుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సహచరుడు అమిత్ షాకు కీలక బాధ్యతలు అప్పగించారు. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండాను రెపరెపలాడించారు. మోదీ అమలు పరిచిన పెద్ద నోట్ల రద్దు తీవ్ర వైఫల్యాన్ని చవిచూసింది. తీవ్ర ఆర్థిక సంక్షోభానికి కారణమైంది. ఇక, లౌకిక వాదులపై దేశవ్యాప్తంగా జరిగిన దాడులు తీవ్ర భయాందోళనలకు కారణమయ్యాయి. అయితే మోదీ తొలి ఐదేళ్ల పాలనలో కుంభకోణాలు లేకపోవడం, తీవ్రవాద దాడులు వంటివి జరగకపోవడం, విదేశాల్లో భారత్ పరపతి పెరగడం, అతుకుల బొంత ప్రభుత్వం కాకుండా బలమైన నాయకత్వం ఏర్పడడం ప్రజల దృష్టిని ఆకర్షించారు.
మోదీ-షా ద్వయం..
సమాజాన్ని కులపరంగా విడగొట్టి కొన్ని పార్టీలు లాభపడితే, మోదీ-షా ద్వయం మతపరంగా విడగొట్టి ప్రయోజనం పొందింది. 2014 ఎన్నికల్లో అభివృద్ధి మంత్రం, గుజరాత్ మోడల్, నల్లధనం వెనక్కి రప్పించడం గురించి మాట్లాడిన మోదీ.. 2019 ఎన్నికలకు వచ్చేసరికి స్వరం మార్చేశారు. జాతీయవాదాన్ని ముందుకు తెచ్చారు. దాని ముందు మిగిలిన వైఫల్యాలన్నీ పక్కకు పోయాయి. ప్రతిపక్షం బలంగా ఉండి ఉంటే 2019 ఎన్నికల్లో బిజేపీని ఓ మేరకు అడ్డుకోగలిగేవారేమో. రాహుల్ గాంధీ నాయకత్వం మోదీకి వరంగా మారింది. బీజేపీకున్న సంస్థాగత నిర్మాణం, ఆరెస్సెస్ కార్యకర్తలు, మోదీ నాయకత్వం 2019 ఎన్నికల్లో బీజేపీకి చరిత్రలో కనీవినీ ఎరుగని విజయాన్ని కట్టబెట్టాయి. ప్రత్యర్థుల విమర్శలనే తన విజయసోపానాలుగా మార్చుకోవడం మోదీకి వెన్నతోపెట్టిన విద్య. దిగ్విజయ్ సింగ్ `చాయ్వాలా` విమర్శను కూడా మోదీ తన గెలుపునకు చక్కగా ఉపయోగించుకున్నారు. ఆ పేరుతో ఓ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. సైనిక విజయాలను చాకచక్యంగా తన ఖాతాలో వేసుకుని వాటిని పదేపదే ప్రస్తావించడం కూడా మోదీ తరచుగా చేస్తున్నారు.
ఏదేమైనా ఇందిరా గాంధీ తర్వాత ఆ స్థాయి బలమైన నాయకుడు మోదీనే. ఏళ్ల తరబడి వివాదాస్పదంగా మారిన ఆయోధ్య విషయంలో అందరినీ ఒక తాటిపైకి తెచ్చిన మేధావి. ఆర్టికల్ 370ని సునాయాసంగా రద్దు చేసిన మొండి ఘటం. కరోనా కారణంగా లాక్డౌన్ విధించాల్సి వచ్చినపుడు మోదీ మాట మీద దేశం మొత్తం నిలడింది. దాని వల్ల ఉపయోగం ఉందా, లేదా అనే సంగతి పక్కన పెడితే వంద కోట్ల మందిని ప్రభావితం చేయగల సమ్మోహన శక్తి మోదీ సొంతం అనేది స్పష్టమైంది. ఇంతటి బలమైన నాయకత్వం, బలమైన ప్రభుత్వం ఆధ్వర్యంలో భారత్ మరింత బలమైన దేశంగా ఎదిగే వైపుగా అడుగులు వేస్తే ఎంతో మంచిది. నేడు 70వ జన్మదినోత్సవం జరుపుకుంటున్న మోదీ ఆ దిశగా ఆలోచిస్తారని ఆశిద్దాం.