జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లారు. ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్తో కలసి ఢిల్లీ వెళ్లిన పవన్కు మంగళవారం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అపాయింట్మెంట్ ఖరారైంది. అమిత్ షా అపాయింట్మెంట్ పెండింగ్లో ఉంది. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటనకు సంబంధించి ఆ పార్టీ ఇప్పటికే ప్రకటన చేసింది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం జేయడంపై ప్రజల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయాలపై బీజేపీ నేతలతో మాట్లాడేందుకు వెళ్తున్నట్లు పార్టీ వెల్లడించింది. కాగా ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజషన్ను జనసేన వ్యతిరేకించింది. రాష్ట్ర బీజేపీ కూడా వ్యతిరేకించిన విషయం తెలిసిందే.
అజెండాలో మరికొన్ని..
పవన్ కల్యాణ్ జనసేన పర్యటనలో మరికొన్ని అంశాలు చర్చలు రానున్నట్లు సమాచారం. ఆ పార్టీ నాయకులు చెబుతున్న ప్రకారం..తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక విషయంపైనా చర్చ జరగనుంది. కొంత కాలం క్రితం పవన్ ఢిల్లీకి వెళ్లివచ్చిన తరవాత రాష్ట్రంలో పలు పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర బీజేపీ వైఖరిపై పవన్ కల్యాణ్ పరోక్షంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. సమన్వయం ఉంటేనే కలిసి ఉంటామని హెచ్చరించారు. దీంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు హైదరాబాద్ వచ్చి పవన్ను కలిశారు. దీంతో అంతా సద్దుమణిగిందనుకున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశంలోనూ ఆ పార్టీలు విడివిడిగానే వ్యవహరించాయి. ఇక మూడురోజుల క్రితం సోమువీర్రాజు ఓ మీటింగ్లో మాట్లాడుతూ..ఏపీలో బీసీని సీఎం చేసే సత్తా బీజేపీకి ఉందని, వేరే పార్టీలు చేయగలవా అని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తే..బీసీని సీఎం చేస్తుందని వ్యాఖ్యానించారు. ఇది బీజేపీతో పాటు జనసేనలోనూ సంచలనం రేపింది. తరువాత బీజేపీ అధిష్టానం ఎలా స్పందించిందనే విషయం బయటకు రాకపోయినా.. సోము వీర్రాజు మాట 24 గంటల వ్యవధిలో మారింది. తాను సదుద్దేశంతో అన్నానని, బీసీ సీఎం కావాలని ఉద్దేశపూర్వకంగా అనలేదని ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఆ వివరణలోనూ పలు వ్యంగ్యాలు కూడా ఉండడాన్ని బట్టి అధిష్టానం కొంచెం ఘాటుగానే స్పందించిందేమోమోనన్న చర్చ నడుస్తోంది. అదే సమయంలో సోము వీర్రాజు క్రెడిబిలిటీ మరింత దిగ జారింది. రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్నా.. చంద్రబాబునే ప్రశ్నించే సోము వీర్రాజుపై అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లిన విషయం తెలిసిందే. వైసీపీ కోవర్టు అని కూడా సోషల్ మీడియాలో కామెంట్లూ వెల్లువెత్తాయి. ఇక తాజాగా బీసీ సీఎం అని వ్యాఖ్యానించి మళ్లీ మాట మార్చడంతో ఆయన క్రెడిబిలిటీ మరింత దిగజారిందని చెప్పవచ్చు.
సోము వీర్రాజుని నమ్ముకుంటే..నష్టమే
ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజును నమ్ముకుంటే తాము ముందుకు వెళ్లినా ఉపయోగం ఉండదని, రోజుకో ప్రకటన, గందరగోళ వైఖరితో సోము వీర్రాజు అటు బీజేపీతోపాటు ఇటు తమకూ నష్టం తెస్తున్నారని చెప్పే అంశం కూడా అజెండాలో ఉందని తెలుస్తోంది. అయితే ఈ ఫిర్యాదులు డిమాండ్గా కాకుండా విన్నపంగా ఉండనున్నాయి. ఇక వైజాగ్ స్టీల్ విషయంలో పార్టీకి వచ్చే నష్టంపైనా పవన్ వివరించనున్నారు. తిరుపతి ఉప ఎన్నిక అభ్యర్థి విషయం ఇక కామన్ అజెండాగా మారనుంది.