పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి కుప్పంలో ఘోర పరాభవం ఎదురైందనే చెప్పాలి. కారణాలు ఏవైనా.. అది నాయకుల, కార్యకర్తల సమన్వయ లోపం కావచ్చు.. అధికార పార్టీతో డబ్బులో పోటీ పడలేక కావచ్చు.. దాడులు, బెదిరింపులు.. ఇలా ఏవైనా కావచ్చు.. టీడీపీకి కంచుకోట లాంటి కుప్పంలో ఇలాంటి పరాభవం ఎదురు కావడంతో.. అక్కడ కేడర్ పరిస్ధితిని అర్ధం చేసుకున్న చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగారు. టీడీపీ శ్రేణుల్లో ధైర్యం నింపడంతోపాటు.. ఎక్కడ లోపం జరిగిందో తెలుసుకుని సరిదిద్దడానికి పూనుకున్నారు. అంతేకాదు.. రోడ్ షోలో వైసీపీ శ్రేణులపై తీవ్ర స్ధాయితో విరుచుకుపడ్డారు. పుంగనూరు ఎమ్మెల్యేకు నేరుగా వార్నంగ్ ఇచ్చారు.
కుప్పంలో పర్యటిస్తున్న చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. పర్యటన అనంతరం చంద్రబాబు ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. అక్కడ బస చేస్తున్న సమయంలో హఠాత్తుగా కరెంటు పోయింది. ఇలా మునుపెన్నడూ జరగలేదని శ్రేణులు చెబుతున్నాయి. ఈ ఘటనపై మాజీ మంత్రి, టీడీపీ నేత అమర్నాథ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ కావాలనే ఇలాంటి చౌకబారు పనులు చేస్తుందని ఆరోపించారు. కనీసం ఇన్ వెర్టర్.. జనరేటర్ లాంటి ఏర్పాట్లు కూడా లేకుండా చేశారని మంత్రి చెప్పారు. ఇక్కడితో ఇది ఆగిపోలేదని.. రాబోవు రోజులు ఉన్నాయని.. అప్పుడు ఇంతకు మించిన షాక్ ట్రీట్ మెంట్ ఇస్తామని అమర్నాథ్ రెడ్డి అన్నారు.