Rajanagaram YSRCP MLA Jakkampudi Raja Viral Comments On Rajamahendravaram MP Margani Bharath Ram:
ఏపీలో అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మరో కొత్త ముసలం మొదలైపోయింది. ఏపీ రాజకీయాల్లో సెంటిమెంట్ జిల్లాగా పేరుపడిపోయిన తూర్పు గోదావరి జిల్లాలో మొదలైన ఈ ముసలం.. జిల్లాలో ఆ పార్టీని తీవ్రంగానే ముంచేసే ప్రమాదం లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా.. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రామ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో పార్టీని భరత్ రామ్ నాశనం చేస్తున్నారంటూ జక్కంపూడి చేసిన వ్యాఖ్యలు నిజంగానే ఆ పార్టీలో ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. చాలా కాలం నుంచే వీరిద్దరి మధ్య విభేదాలున్నా.. తాజాగా బహిరంగంగా భరత్ రామ్ను విమర్శిస్తూ రాజా వ్యాఖ్యలు చేయడంతో వీరి మధ్య పొరపొచ్చాలు బయటకు వచ్చాయి. మరి వీరి మధ్య నెలకొన్న విభేదాలను పార్టీ అధిష్ఠానం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.
జక్కంపూడి ఏమన్నారంటే..?
రాజమహేంద్రవరం ఎంపీగా గెలిచిన నాటి నుంచి జిల్లా రాజకీయాలపై పట్టు సాధిందే దిశగా మార్గాని భరత్ రామ్ తనదైన శైలి దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో గతంలో జక్కంపూడి రాజాను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారట. ఈ వ్యాఖ్యలపై సోమవారం నాడు స్పందించిన జక్కంపూడి.. భరత్ రామ్ తీరును నిరసిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా జక్కంపూడి ఏమన్నారంటే.. ‘‘ఇప్పటికే ఓ ఆర్ఆర్ఆర్ ఉన్నాడు. మరో ఆర్ఆర్ఆర్ అవసరమా? రాజమండ్రిలో వైసీపీని భరత్ నాశనం చేశారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరితో కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారు. జగన్ ను గతంలో సీబీఐ జేడీగా ఉన్న సమయంలో లక్ష్మీనారాయణ ఇబ్బంది పెట్టారు. అలాంటి లక్ష్మీనారాయణతో కలిసి భరత్ సెల్పీలు తీసుకుంటారా? భరత్ వెంట రౌడీ షీటర్లు, కబ్జాదారులే ఉన్నారు. భరత్ తన పద్దతి మార్చుకోవాలి. నాపై వ్యాఖ్యలు చేసి ఇప్పుడు తూచ్ అంటున్నారు?’’ అంటూ భరత్ రామ్ పై జక్కంపూడి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తూర్పుగోదావరి జిల్లా పార్టీ శాఖతో పాటుగా మొత్తంగా వైసీపీలో కలకలం రేపాయి.
ఎంపీ దూకుడును తట్టుకోలేన్నారా?
మార్గాని భరత్ రామ్ తొలుత సినిమా రంగంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. భరత్ రామ్ హీరోగా ఓ సినిమా కూడా విడుదలైంది. అయితే 2019 ఎన్నికలకు ముందు ఉన్నట్లుండి భరత్ వైసీపీలో చేరిపోయారు. రాజమహేంద్రవరంలో బీసీలు మెజారిటీ సంఖ్యలో ఉన్న సంగతి తెలిసిందే. అదే సామాజిక వర్గానికి చెందిన భరత్ రామ్కు ఎంపీ టికెట్ ఇవ్వడం ద్వారా అటు ఎంపీ సీటుతో పాటు ఆ సీటు పరిధిలోని అసెంబ్లీల్లోనూ బీసీ ఓట్లను గంపగుత్తగా సాధించవచ్చన్న భావనతో భరత్ కు జగన్ ఎంపీ టికెట్ ఇచ్చారు. జగన్ అంచనాల మేరకు భరత్ గ్రాండ్ విక్టరీ కొట్టగా.. మెజారిటీ అసెంబ్లీలు కూడా వైసీపీ ఖాతాలో పడిపోయాయి. ఎంపీగా గెలిచిన నాటి నుంచి భరత్ రాజకీయంగా ఫుల్ యాక్టివేట్ అయ్యారు. అంతేకాకుండా ఎంపీ హోదాలో జగన్ కు దగ్గరయ్యారు. అయితే ఆది నుంచి వైఎస్ ఫ్యామిలీతో మంచి సంబంధాలు నెరపిన జక్కంపూడి రాజా ఈ పరిణామంతో కాస్తంత ఇబ్బంది పడ్డారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో భరత్ రామ్ తనను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయడంతో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న జక్కంపూడి.. ఎంపీపై విరుచుకుపడిపోయారు. మరి ఈ వివాదాన్ని జగన్ ఎలా పరిష్కరిస్తారో చూడాలి.
Must Read ;- ఈ సారీ వేర్వేరుగానే!.. ఇక కలవరేమో?











