తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత.. 13 జిల్లాలతో కనీసం రాజధాని కూడా లేకుండా.. రూ.16 వేల కోట్ల పైచిలుకు లోటు బడ్జెట్ తో నవ్యంధ్రప్రదేశ్ కొత్త ప్రస్థానం ప్రారంభించిన సంగతి తెలిసిందే. లోటు బడ్జెట్ ఉన్నా.. కొత్త రాజధానిని ఎంపిక చేసుకుని పలు కీలక పారిశ్రామిక సంస్థలను రాష్ట్రానికి ఆహ్వానించడం ద్వారా రాష్ట్ర ప్రగతిని గత టీడీపీ సర్కారు బాగానే మొదలుపెట్టిందని చెప్పాలి. భూ సేకరణకు సింగిల్ పైసా ఖర్చు లేకుండానే అమరావతిలో రైతుల నుంచి భూములను సేకరించిన చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త ప్రగతిని ప్రారంభించింది. అయితే అదే ఒరవడి ఇంకో ఐదేళ్లు కొనసాగి ఉంటే.. దేశంలోని ఏ ఒక్క రాష్ట్రానికి కూడా తీసిపోని విధంగా ఏపీ తయారై ఉండేది. చంద్రబాబు సర్కారు నమోదు చేసిన స్పీడుతో రాష్ట్రంలో కొత్త కార్యక్రమాలు కూడా ప్రారంభమైపోయాయి. పెద్ద పెద్ద పారిశ్రామిక సంస్థలు రాష్ట్రం వైపు చూడటం మొదలెట్టాయి. ఏపీకి రాకపోకలు ప్రారంభించాయి. ఈ క్రమంలో రాష్ట్రానికి ఎయిర్ ట్రాఫిక్ కూడా పెరిగింది. ఫలితంగా విజయవాడ సమీపంలోని గన్నవరం, విశాఖ, తిరుపతి సమీపంలోని రేణిగుంట, రాజమహేంద్రవరం ఎయిర్ పోర్టులతో పాటు నాటి విపక్ష నేత, ప్రస్తుతం ఏపీ సీఎంగా ఉన్న జగన్ సొంత జిల్లా కడపలోని విమానాశ్రయానికి కూడా కొత్తగా విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఇక కర్నూలులో ఏకంగా కొత్తగా ఎయిర్ పోర్టే ఏర్పాటైపోయింది.
ఎయిర్ ట్రాఫిక్ ఒక్కసారిగా తగ్గిపోయింది
ఎప్పుడైతే చంద్రబాబు సీఎంగా దిగిపోయారో.. అప్పుడే ఈ స్పీడు ఠపీమని పడిపోయింది. అప్పటిదాకా రాష్ట్రం వైపు ఆసక్తిగా చూసిన పారిశ్రామికవేత్తలు.. జగన్ సీఎం అయ్యాక ఎందుకనో గానీ వెనకడుగు వేశారు. లులూ గ్రూపుతో పాటు జగన్ తో కొత్తగా స్నేహం ప్రారంభించిన రిలయన్స్ కూడా రాష్ట్రం నుంచి వెళ్లిపోయింది. ఇదే దారిలో ఇంకా చాలా సంస్థలే నడిచాయి. వెరసి రాష్ట్రం వైపు చూసే నాథుడే కరువయ్యాడు. ఫలితంగా రాష్ట్రానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి సంఖ్య వేగంగా తగ్గిపోయింది. వెరసి అప్పటికే నష్టాల్లో నడుస్తూ.. టీడీపీ సర్కారు చేపట్టిన చర్యలతో కొంతకొంతగా ఆ నష్టాలను పూడ్చుకుంటూ వచ్చిన ఎయిర్పోర్టులు.. జగన్ రాకతో మళ్లీ భారీ నష్టాల్లోకి జారుకుంటున్నాయి. ఇదేదో జగన్ అంటే గిట్టనట్టుగా వ్యహరించే టీడీపీ చెబుతున్న మాట కాదు. సాక్షాత్తు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు చెబుతున్న మాట. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో భాగంగా ఏపీలోని ఎయిర్పోర్టుల పరిస్థితిపై పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్ అంకెలతో సహా ఈ విషయాన్ని బయటపెట్టారు.
నష్టాలు పెరిగిన తీరు ఇది..
కేంద్రం లెక్కల ప్రకారం.. గన్నవరం, రేణిగుంట, రాజమహేంద్రవరం.. చివరకు కడప ఎయిర్ పోర్టుల నష్టాలు ఏటికేడు పెరిగిపోతున్న వైనం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. నవ్యాంధ్ర నూతన రాజధానికి చేరువగా ఉన్న గన్నవరం ఎయిర్ పోర్టు విషయానికి వస్తే.. 2018-19 ఏడాదిలో రూ.41.7 కోట్ల నష్టాల్లో ఉన్న ఈ ఎయిర్ పోర్టు 2019-20 ఏడాదికి రూ.60.22 కోట్లు, 2020-21 ఏడాదికి 63.95 కోట్ల నష్టాలకు చేరిపోయింది. అదే సమయంలో రాజమహేంద్రవరం ఎయిర్ పోర్టు విషయానికి వస్తే.. 2018-19లో రూ.32.84 కోట్ల నష్టాల్లో ఉండగా, 2019-20 ఎడాదికి రూ.45.27 కోట్లకు చేరాయి. ఇక 2020-21 ఏడాదికి ఆ నష్టాలు కాస్తంత తగ్గి రూ.44.19 కోట్లకు చేరినా.. నష్టాల నుంచి అది ఇప్పుడప్పుడే బయటపడేలా కనిపించడం లేదు. ఇక జగన్ సొంత జిల్లా కడపలోని ఎయిర్ పోర్టు కూడా నష్టాల బాటలోనే ఉంది. 2018-19లో రూ.9.81 కోట్ల మేర ఉన్న నష్టాలు జగన్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది (2019-20)లో రూ.10.51 కోట్లకు చేరాయి. 2020-21లో ఈ నష్టాలు కాస్తంత తగ్గి రూ. 8.93 కోట్లకు చేరినా.. నష్టాలు మాత్రం తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ఇక రేణిగుంట పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఒక్క విశాఖ ఎయిర్ పోర్టు మాత్రమే పెద్దగా నష్టాలు లేకుండా.. ఉన్నా అవి పెరగకుండా నెట్టుకు వస్తోంది.
Must Read ;- దిమాక్ ఉన్నోడు జగన్ వద్ద ఒక్కడూ లేడు