AP Fiber Net Chairman Goutham Reddy Announces Will Protect Visakhapatnam Steel :
వైసీపీలో వివాదాస్పద నేతగా పేరు పడిపోయిన పూనూరు గౌతం రెడ్డి.. చాలా కాలం పాటు పార్టీ అధిష్ఠానం ముందుకు కూాడా వెళ్లలేకపోయిన వైనం గతంలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాపు నేత వంగవీటి మోహన రంగపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయన పార్టీ నుంచి ఏకంగా సస్సెన్షన్ కే గురయ్యారు. ఆ తర్వాత ఎలాగోలా తనకు తెలిసిన చాలా మంది రెడ్లను పట్టుకుని తిరిగి పార్టీలో చేరిన ఆయన.. పార్టీ అధిష్ఠానానికి తనపై కోపం తగ్గేదాకా వెయిట్ చేశారు. అధిష్ఠానం కోపం తగ్గిందని గ్రహించిన వెంటనే రంగంలోకి దిగిపోయిన గౌతం రెడ్డి.. తనదైన మార్కు లాబీయింగ్ తో ఇప్పుడు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గిరీని దక్కించుకున్నారు. ఇటీవలే ఆ పదవిలో కూర్చున్న గౌతం రెడ్డి.. తాజాగా రాష్ట్ర పర్యటనకు బయలుదేరారు. తన తొలి పర్యటనను విశాఖతో మొదలెట్టిన ఆయన.. అక్కడ రోజుల తరబడి సాగుతున్న విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక వద్ద ప్రత్యక్షమయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
ప్రైవేట్ ను లోపలికి రానివ్వొద్దట
విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక వద్ద ఉద్యమం చేపడుతున్న కార్మిక సంఘాల నేతల నుంచి స్వాగత సత్కారాలు అందుకున్న గౌతం రెడ్డి.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. ‘‘పోరాటాల ఫలితంగా ఏర్పడిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలని చూస్తే ప్రతిఘటన తప్పదు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం,వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ పోరాడుతుంది. ప్రైవేటు వ్యక్తులను ప్లాంటు లోనికి అడుగుపెట్టనీయబోం. పోరాటాలతో సాధించుకున్న ప్లాంట్ ను పోరాటంతోనే కాపాడుకుందాం. కార్మికుల ఐక్యమత్యమే నిజమైన బలం’’ ఇలా సాగిపోయింది గౌతం రెడ్డి ప్రసంగం. మొత్తంగా విశాఖ ఉక్కును ఓ వైపు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించే దిశగా వడివడిగా అడుగులు వేస్తుంటే.. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామని గౌతం రెడ్డి చెప్పారు. గౌతం రెడ్డి ప్రకటనతో కార్మికులకు కొంత మేర భరోసా లభించినా.. జనం మాత్రం ఆయన ప్రకటనలను చూసి విస్మయం వ్యక్తం చేస్తున్నారనే చెప్పాలి.
జగన్కు అత్యంత సన్నిహితుడు
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫ్యామిలీకి గౌతం రెడ్డి అత్యంత సన్నిహితుడనే చెప్పాలి. ఎందుకంటే.. గౌతం రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడిన సమయంలో జగన్ సోదరుడు, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి విజయవాడకు వచ్చి నేరుగా ఆయన ఇంటికే చేరారు. ఈ సందర్భంగా పార్టీ సస్పెండ్ చేసిన నేత ఇంటికి వైసీపీ కీలక నేతగా, అధినేత సోదరుడు అయిన మీరు ఎలా వెళతారంటూ అవినాశ్ రెడ్డి మీడియాను ఎదురు ప్రశ్నించారు. రాజకీయం వేరు, బంధుత్వం వేరు అన్న రీతిగా కూడా అవినాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఒక్క సంఘటనతో వైఎస్ ఫ్యామిలీతో గౌతం రెడ్డికి ఎంత సాన్నిహిత్యం ఉందో ఇట్టే చెప్పేయొచ్చు. అందుకే కాబోలు.. సస్పెన్షన్ పడిన గౌతం రెడ్డిని తిరిగి పార్టీలోకి తీసుకోవడంతో పాటు ఏకంగా ఏపీ ఫైబర్ నెట్ కు చైర్మన్ ను చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- జగన్కు రిలీఫ్.. సాక్షిని బుక్ చేసిందే