వైసీపీ విపక్షంలో ఉండగా… టీడీపీ నేతలపై నమోదైన చిన్న చిన్న కేసులను ఎత్తివేస్తేనే తెగ గగ్గోలు పెట్టింది. పోలీసులు నమోదు చేసిన కేసులను కోర్టులు కొట్టివేయాలి గానీ… ప్రభుత్వం ఎత్తివేయడమేమిటని నిలదీసేది. అయితే ఇప్పుడు వైసీపీ ఆధ్వర్యంలోని జగన్ ప్రభుత్వం ఈ విషయంలో తనను మించిన వారెవ్వరూ లేరన్న కోణంలో దూసుకుపోతోంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలపై నమోదైన కేసులను జగన్ సర్కారు ఉపసంహరించుకుంది. ఆ జాబితాలోకి ఇప్పుడు కాపు కార్పొరేషన్ చైర్మన్, తూర్పు గోదావరి జిల్లా రాజా నగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కూడా చేరిపోయారు. రాజాపై గతంలో నమోదైన రెండు కేసులను ఎత్తివేస్తూ జగన్ సర్కారు నిర్ణయం తీసుకుంది.
జగన్ పైనా కేసుల ఎత్తివేత.. హైకోర్టు సీరియస్
నేతలపై నమోదైన కేసుల ఎత్తివేత విషయంలో జగన్ సర్కారు గతంలో ఏ సర్కారు కూడా వ్యవహరించని రీతిలో దూకుడు ప్రదర్శిస్తోందని చెప్పాలి. సాక్షాత్తు సీఎం జగన్ పైనే నమోదైన తొమ్మిది కేసులను ఒక్క దెబ్బతోనే ఎత్తేసిన వైసీపీ ప్రభుత్వం… తమ పార్టీకి చెందిన నేతలపై ఉన్న కేసులను విడతలవారీగా ఎత్తివేస్తోంది. జగన్ పై కేసుల ఎత్తివేతపై ఇటీవలే హైకోర్టు తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. జగన్ పై కేసుల ఎత్తివేతను సుమోటోగా విచారణకు స్వీకరించిన హైకోర్టు.. ఆ రికార్డులన్నింటినీ తన ముందుంచాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసిన వైనం ఏపీలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇక జగన్ కంటే ముందుగానే వైసీపీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, జోగి రమేశ్ లపై కేసులను ఎత్తివేసిన జగన్ సర్కారు… మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తిరుపతి విమానాశ్రయంలో అధికారులపై తనదైన శైలి దురుసుగా వ్యవహరించిన కేసును కూడా ఎత్తివేసిన సంగతి తెలిసిందే.
జక్కంపూడిపై రెండు కేసుల ఎత్తివేత
నేతల కేసుల ఎత్తివేతపై ఓ వైపు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమయంలోనూ మరో నేతపై కేసులు ఎత్తివేస్తూ జగన్ సర్కారు నిర్ణయం తీసుకోవడం నిజంగానే ఆశ్చర్యం కలిగించేదే. ఇక జక్కంపూడిపై నమోదైన కేసు విషయానికి వస్తే… విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారులను అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా అంతు చూస్తానని బెదిరించిన ఆరోపణలపై రాజాపై గతంలో రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. విజయవాడలోని ప్రజా ప్రతినిధుల క్రిమినల్ కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థానంలో ప్రస్తుతం ఈ కేసుల విచారణ నడుస్తోంది. ఇప్పుడీ కేసులను ఎత్తివేయాలని నిర్ణయించిన ప్రభుత్వం… ప్రాసిక్యూషన్ను ఉపసంహరించుకుంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్తో పిటిషన్ దాఖలు చేయించాలని డీజీపీని ఆదేశించింది. దీంతో హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Must Read ;- జగన్లో జూలై టెన్షన్ పెరిగిపోతోంది!











