Raghu Rama Krishna Raju Unknowingly Gave Relief To Jagan :
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మంజూరైన బెయిల్ ను రద్దు చేయాలంటూ నేరుగా సీబీఐ కోర్టుకెక్కిన వైసీపీ రెబల్ నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజే స్వయంగా జగన్ కు బిగ్ రిలీఫ్ ఇప్పించిన వైనం ఇప్పుడు నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. రఘురామ కావాలని జగన్ కు రిలీఫ్ ఇప్పించకున్నా.. తనదైన శైలి పోరును మరింత ఉధృతం చేసే క్రమంలోనే తనకేమాత్రం తెలియకుండానే జగన్ కు రిలీఫ్ దక్కేలా చేశారు. ఈ విషయం ఇప్పటికైనా రఘురామకు తెలిసిందో, లేదో.. గానీ ఈ వ్యవహారంపై ఇప్పుడు ఆసక్తికర చర్చకు తెర లేసింది. బుధవారం నాడు జగన్ బెయిల్ ను కొనసాగించడమా? లేదంటే రద్దు చేయడమా? అన్న విషయాన్ని తేల్చేస్తామని నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే బుధవారం నాటి విచారణ సందర్భంగా జగన్ కేసుల్లోనే నిందితుడిగా ఉన్న వైసీపీపీ నేత విజయసాయిరెడ్డి బెయిల్ ను రద్దు చేయాలన్న రఘురామ పిటిషన్ మీదా విచారణ జరిగింది. ఈ రెండు పిటిషన్లు ఒకే కేసుకు చెందినవని, రెండింటి లక్ష్యం కూడా ఒకటేనని చెప్పిన సీబీఐ కోర్టు న్యాయమూర్తి.. రెండింటిపై తన తుది తీర్పును వచ్చే నెల 15న వెల్లడించనున్నట్లుగా ప్రకటించారు.
ఆ పిటిషన్తోనే జగన్ కు రిలీఫ్
సీబీఐ కోర్టు న్యాయమూర్తి ప్రకటనలో పెద్ద వింతేమీ లేదు. రెండు పిటిషన్ల లక్ష్యం ఒకటే. ఇద్దరు నిందితులు ఒకే కేసుకు చెందిన వారే. ఈ రెండు పిటిషన్లను దాఖలు చేసిన వ్యక్తి కూడా ఒక్కరే. అయితే ఓ పిటిషన్ ముందు వచ్చింది. రెండో పిటిషన్ కాస్తంత ఆలస్యంగా వచ్చింది. తొలి పిటిషన్ పై వాదోపవాదాలు ఇప్పటికే ముగిశాయి. రెండో పిటిషన్ పై వాదోపవాదాలు ఇప్పుడే ముగిశాయి. రెండింటిపైనా తీర్పు కూడా దాదాపుగా ఒకేలా ఉంటుంది. మరి అలాంటప్పుడు రెండింటిపై రెండు తీర్పులు ఎందుకు? రెండింటిపై ఒకేసారి తీర్పు చెబితే సరిపోలా? అన్న కోణంలో సీబీఐ కోర్టు న్యాయమూర్తి ఆలోచించారు. అదే విషయాన్ని న్యాయమూర్తి వెల్లడించారు. ఇందులో తొలి పిటిషన్ జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరినదైతే.. రెండోది సాయిరెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని కోరినది. ఈ రెండింటిని కూడా రఘురామరాజే దాఖలు చేశారు. అంటే.. జగన్ బెయిల్ రద్దు అయినా, కాకున్నా.. ఈ నెల 25న జగన్ వెలువడాల్సిన తీర్పు.. సాయిరెడ్డి బెయిల్ రద్దు కోరుతూ రఘురామ దాఖలు చేసిన రెండో పిటిషన్ కారణంగానే.. వచ్చే నెల 15కు వాయిదా పడినట్టే కదా. అంటే జగన్ బెయిల్ రద్దు అయినా.. కాకున్నా.. తీర్పు రాకుండా ఓ 20 రోజుల పాటు జగన్ కు రిలీఫ్ దక్కినట్టే కదా.
రఘురామ వ్యూహంలోనే లోపం
అయినా జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ కోర్టుకెక్కిన రఘురామరాజు.. ఆ విషయంలో కోర్టు నుంచి తీర్పు వెలువడకముందే.. సాయిరెడ్డి బెయిల్ ను రద్దు చేయాలంటూ రెండో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే ఈ పిటిషన్లపై తీర్పును జాప్యం చేసిందని తేలిపోయింది. అంటే.. వైసీపీపై రఘురామరాజు అనుసరిస్తున్న వ్యూహంలో లోపం ఉన్నట్టే కదా. వైసీపీని సెల్ఫ్ డిఫెన్స్ లో పడేయాలంటే.. ఆ పార్టీని నిత్యం టెన్షన్ పెట్టేయాలి. ఒకటి తర్వాత మరొక అంశాన్ని ఎత్తుకోవాలి. రాజకీయ నేతలు ఎవరైనా ఇదే వ్యూహాన్ని అమలు చేస్తారు. అయితే వృత్తి రీత్యా వ్యాపారి అయిన రఘురామ.. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వచ్చారు కదా. అందుకే.. ఈ వ్యూహం కరెక్టేనని భావించారన్న వాదనలు వినిపిస్తున్నాయి. వైరి వర్గం టెన్షన్ లో కొనసాగుతుంటేనే.. తమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయని పొలిటీషియన్లు భావిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ వ్యూహంపై అంతగా ఆలోచించని రఘురామ.. తనపై అనర్హత వేటు కోసం సాయిరెడ్డి పదే పదే పట్టుబడుతున్నారన్న కోపంతో.. జగన్ బెయిల్ వ్యవహారం తెలియకుండానే సాయిరెడ్డి బెయిల్ పైనా పిటిషన్ వేశారు. ఈ క్రమంలోనే ఆయన తనకు తెలియకుండానే జగన్ కు కొంతకాలం పాటు రిలీఫ్ దక్కేలా చేశారు.
Must Read ;- ముందే కూసి జగన్ ను బుక్ చేసింది











