రాజీవ్ గాంధీ హత్యకేసు ముద్దాయి పేరరివాలన్ విడుదలపై పేలుడు ఘటనలో మృతి చెందిన సంధానీబేగం అనే మహిళ కుమారుడు అబ్బాస్ స్పందించారు. ఈ అంశంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల నిర్ణయం సరికాదని, బాధిత కుటుంబ సభ్యులుగా తాము దానిని స్వాగతించలేమని అన్నారు. బాంబు దాడిలో మృతిచెందిన వారి కుటుంబాలు 31 ఏళ్లుగా చిన్నాభిన్నమై జీవిస్తున్నాయన్న అబ్బాస్..ఈ తీర్పు 16 మంది కుటుంబాలను కలచివేసిందన్నారు.
ఒక దేశ మాజీ ప్రధానితో పాటు 16 మందిని హతమార్చిన వారికి ఉరిశిక్ష విధించిన సుప్రీంకోర్టే విడుదల చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు ఆయన తెలిపారు. నిందితుడు తనకున్న రాజకీయ అధికారం ఉపయోగించుకొని విడుదలై ఉండవచ్చని, కానీ దేవుడి ముందు అతను ఎప్పుడూ దోషేనని వ్యాఖ్యానించారు. ఒక దేశ ప్రధానిని అత్యంత దారుణంగా హతమార్చిన వారిని విడుదల చేయడం ఎంతవరకు సమంజసమో అర్థం కావడం లేదని పేర్కొన్నారు.
‘‘వారు తమిళులు కావడం వల్లనే విడుదలయ్యారా? ఎవరేం చేయాలనుకున్నా చేసేస్తారా? రాజకీయ అవసరాల కోసం ఏమైనా చేయవచ్చా? దేశంపై ప్రేమ, అభిమానం ఉన్న వారు దీనిని సమర్థించలేరు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలా ఎందుకు నిర్ణయం తీసుకున్నాయో అర్ధం కావడం లేదు. ఇలాంటి సమస్య వారి ఇళ్లలో జరిగితే మంత్రి వర్గం ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందా? మేము సామాన్యులం కాబట్టి ఏం చేయలేరన్న ధైర్యంతో మాకు అన్యాయం చేశారు. ఉదయం నుండి టపాసులు కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. వారు ఏమైనా స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని జైలుకెళ్లివచ్చారా? ఒకరోజు జైలులో ఉంటే తెలుస్తుందని అన్నారు. 31 ఏళ్లుగా తల్లీతండ్రిని పోగొట్టుకొని కష్టపడుతున్న వారి కుటుంబాలు ఆమెకి గానీ, ప్రభుత్వాలకు గానీ కనిపించడం లేదా?’’ అని ప్రశ్నించారు.
అదేసమయంలో తాను ముఖ్యమంత్రిని ఒకటే అభ్యర్థిస్తున్నానని, బాంబుదాడిలో బలైన 16 కుటుంబాలను రక్షించే బాధ్యత కూడా ఆయనదేనని అబ్బాస్ తెలిపారు