దర్శకధీరుడు రాజమౌళి ‘బాహుబలి’లో ప్రభాస్ హీరోగా నటించి పాన్ ఇండియా స్టార్ గా రూ. 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే హీరోగా మారిపోయాడు.
రాజమౌళి రూపొందిస్తున్న మరో పాన్ ఇండియా సినిమా ట్రిపుల్ ఆర్ లో నటించినందుకు ఎన్టీఆర్, రామ్ చరణ్ లు తీసుకున్న పారితోషికం ఎంత అన్నది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో డి. వి. వి. దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మొదట్లో ఈ సినిమా బడ్జెట్ రూ. 200 కోట్లే అన్నారు. ఆ తర్వాత ఆ బడ్జెట్ రూ. 300 కోట్లకు మారింది. ఇప్పుడు ఈ సినిమా నిర్మాణ ఖర్చు రూ. 400 కోట్లు దాటి పోయిందని అంటున్నారు. ఈ బడ్జెట్ మాట ఎలా ఉన్నా ఇందులో నటించినందుకు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు లభించిన పారితోషికం ఎంత అన్న సందేహం చాలా మందిలో ఉంది.
మొదట్లో తక్కువేనా?
మొదట్లో వీరి రెమ్యూనరేషన్ 25 నుంచి రూ. 35 కోట్ల వరకూ ఉంటుందన్న మాట వినిపించింది. అసలు ఇద్దరికీ సమానంగా రెమ్యూనరేషన్ ఉందా? ఎన్టీఆర్ కు ఎక్కువ, రామ్ చరణ్ కు తక్కువ ఉందా అన్న సందేహాలు కూడా ఉన్నాయి. 2018 నవంబరు 19న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. బహుశా అప్పుడు మాట్లాడుకున్న రెమ్యూనరేషన్ తక్కువే అయి ఉండవచ్చు. అప్పటికీ ఇప్పటికీ సినిమా నిర్మాణ వ్యయం బాగా పెరిగిపోయింది. రెండింతల బడ్జెట్ తయారైంది. దానికి కొంత కరోనా కూడా కారణం. సాధారణంగా నటీనటుల పారితోషికానికే ఎక్కవ ఖర్చవుతుంది.
ఈ తరహా పాన్ ఇండియా సినిమాకైతే సినిమా నిర్మాణ వ్యయంలో సగభాగం నటీనటుల రెమ్యూనరేషన్ ఉంటుంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పుడు జులై 30, 2020న సినిమాని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఇంకో రెండే తేదీలు మారి చివరికి వచ్చే ఏడాది జనవరి 7న విడుదల ఫిక్స్ అయ్యింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు కలిపి రూ. 140 కోట్ల రూపాయల వరకూ రెమ్యూనరేషన్ ఇచ్చినట్టు స్పష్టమవుతోంది. దాదాపు మూడేళ్లపాటు వీరు వేరే సినిమాలు చేయకుండా ఈ సినిమా కోసమే తమ సమయాన్ని వెచ్చించారు. వీరిద్దరిలో ఓ పది కోట్లు ఎన్టీఆర్ కు ఎక్కువ ఇచ్చి ఉండవచ్చన్న ప్రచారం కూడా ఉంది.
ఆలియాకి తక్కువేం కాదు
ఇక ఇందులో సీత పాత్రను పోషించిన ఆలియా భట్ పారితోషికం విషయం చూద్దాం. ఆమెకు రోజుకు రూ. 50 లక్షల చొప్పున రెమ్యూనరేషన్ ఫిక్స్ చేశారని అంటున్నారు. అలా ఓ ఆరు కోట్ల రూపాయల వరకూ ఆమెకు పారితోషికం రూపంలో దక్కిందని సమాచారం. ఆ తర్వాత బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గణ్. సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే కొన్ని సన్నివేశాల కోసం అజయ్ దేవ్ గణ్ ని తీసుకున్నారట. సినిమాలో 30 నిమిషాల పాటు ఈ పాత్ర ఉంటుందని అంటున్నారు. అంతకన్నా తక్కువ ఉండటానికే అవకాశం ఎక్కువ ఉంది. ఆయనకు కూడా భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారట.
ఆయన ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండా చేశారన్న వాదన ఉన్నా అందులో నిజం ఉండదు. ఇక హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ సంగతి చూద్దాం. ఆమెకు కూడా భారీగానే పారితోషికం ముట్టినట్టు తెలుస్తోంది. ఇందులో నటించిన ప్రధాన తారాగణం అందరి రెమ్యూనరేషన్లు కలిపి 200 కోట్ల రూపాయల వరకూ ఉండొచ్చని అంటున్నారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంతో రూపొందిన సినిమా ఇది. పైగా దీన్ని ఇంకా అనేక భాషల్లోకి అనువదించి విడుదల చేయనున్నారు.
రాజమౌళి గతంలో రూపొందించిన బాహుబలిగానీ, బాహుబలి 2 గానీ భారీ వసూళ్లు సాధించాయి. బాహుబలి ది కంక్లూజన్ అయితే దాదాపు 2000 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించిందన్న లెక్కలున్నాయి. అలాంటప్పుడు ఒక్కో హీరోకూ ఇచ్చే రూ. 70 కోట్లా పారితోషికం పెద్ద ఎక్కువేం కాదు. ఇంకా ఎక్కువైనా ఫరవాలేదుగానీ లెక్క తక్కువ కాకుండా ఉంటే చాలు. ఇదండీ ట్రిపుల్ ఆర్ హీరోల పారితోషికం విషయం.
– హేమసుందర్ పామర్తి
Must Read ;- జూనియర్ ఎన్టీఆర్ చేతికి గాయం అదేనా?