గ్రేటర్ లో భారీ వర్షాలు పాలకులకు కొత్త పాఠాలు నేర్పుతున్నాయి. దశాబ్దాల కాలంగా ఏ తప్పులు జరిగాయో వెల్లడిస్తున్నాయి. ఒక్కో రోజు ఒక్కో చోట కొత్త సమస్య బయట పడుతుండటంతో ప్రభుత్వాలు చేసిన తప్పులో లేక రియల్ గద్దలు చేసిన ఆక్రమణలో తెలియవు కాని వాటి ఫలితాన్ని మాత్రం నేడు ప్రజలు అనుభవిస్తున్నారు. నాలాలను యథేచ్ఛగా కబ్జా చేయడంతో వరద నీటికి సామాన్యులు బలవుతున్నారు. ఎక్కడ నాలా ఉందో.. ఎక్కడ చెరువులు ఉన్నాయో కూడా తెలియని స్థితిలో బౌగోళిక స్వరూపాలు మార్చేసి ప్లాట్లు వేసిన అక్రమార్కులు ప్రజలను ఇప్పుడు నిండా ముంచేస్తున్నారు. నీట మునిగిన ప్రాంతాల్లో ప్రజలను ఖాళీ చేయించే పరిస్థితి లేక ప్రత్యామ్నాయాలు వెతికారు. వరద నీరు రాకుండా చూసేందుకు ప్రయత్నించారు. నేడు అవే చర్యలు ప్రజల పాలిట శాపంగా మారాయి. పాలకులు చేసిన పాపాలు ప్రస్తుతం సరూర్ నగర్ చెరువును వెంటాడుతున్నాయి. పైనుండి వస్తున్న వరద నీరు పూర్తిగా సరూర్ నగర్ చెరువు లోకే మళ్ళించడంతో ఇప్పుడు సరూర్ నగర్ చెరువు కింది కాలనీల ప్రజలు నిద్రలేని రాత్రులు గడుతున్నారు.
ఐదు చెరువుల నుంచి నీరు.. ఆపై ఆక్రమణలు
సరూర్ నగర్ కు పైన మీర్ పే ట్ , జిల్లెల గూడ , బైరామల్ గూడ, లెనిన్ నగర్ ఇలా దాదాపు ఐదు కు పైగా చెరువులు ఉన్నాయి. ఎన్ని వర్షాలు కురిసినా గతంలో ఇంత పెద్ద ఎత్తున కాలనీలు ప్రభావితం అయ్యేవి కావు. ఎందుకంటే గతంలో ఈ చెరువలు నుండి వచ్చే నీరును ఇతర ప్రాంతాలకు మళ్ళించే వారని చెబుతారు. అయితే ప్రస్తుతం సూరర్ నగర్ పైన ఉన్న చెరువల వరద నీరుతో పాటు స్థానికంగా ఉన్న కాలనీల్లో మురుగునీరు కూడా ఈ చెరువులోనే కలుస్తున్నాయి. అంతే కాకుండా ఈ చెరువు ప్రభుత్వ పెద్దల చలువతో సగానికి పైగా కుంచించుకు పోయింది. దీంతో నీటి నిల్వ కెపాసిటీ సైతం పూర్తి స్థాయిలో తగ్గిపోయింది. నీరు బయటకు పోయే పరిస్థితి లేక పోవడం, ఎల్లప్పుడు కొంత నీరు ఉండటంతో చెరువులో పూడిక తీత కూడా చేయలేక పోయారు. దీంతో ఏ చిన్న వర్షం కురిసినా కాలనీలు వరద ప్రవాహంలో చిక్కుకుంటున్నాయి. అయితే వరద ఒక రోజు లేదా రెండు రోజులు ఉండి వెళ్ళి పోయేది . కాని ఈ సారి అలా కాలేదు. సుమారు వారం రోజులుగా నీరు ఇళ్ల ముందు పారుతూనే ఉంది. సుమారు ఏడు ఫీట్ల ఎత్తులో నీరు ప్రవహిస్తుండటంతో కాలనీల వాసులు ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు.
భారీ వర్షాలతో అతలాకుతలం
ఈ సారే ఎందుకు ఇంతలా నీరొచ్చిందంటే తుఫాను కారణంగా సరూర్ నగర్ పై ప్రాంతాల్లో భారీ వర్షలు కురిసాయి. పైన ఉన్న చెరువులు మొత్తం మత్తడి పారుతున్నాయి. ఎక్కడ చూసిన భారీగా నీరు వస్తోంది. ఇవన్నీ నేరుగా సరూర్ నగర్ చెరువులోకి చేరుతోంది. వరద తగ్గుముఖం పట్టే లోపే మరో భారీ వర్షం ఆ చెరువులను ముంచెత్తుతోంది. దీంతో అప్పటికే సరూర్ నగర్ చెరువులో చేరిన నీరు పూర్తిగా వెళ్ళిపోక ముందే అదనపు నీరు వచ్చి చేరుతుండటంతో పరిస్థితి మరింత ఇబ్బంది కరంగా మారింది. నాయకులు చేసిన పాపాలకు తామెందుకు బలికావాలంటూ చెరువు కింద ఉన్న కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని చెరువలు నీరు ఒకే చెరువులోకి ఎలా కలుపుతారని.. ఇప్పుడు తమ సమస్యలు ఎవరు తీరుస్తారంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పదెవరో… కాలనీల వాసుల సమస్యలకు శాశ్వత పరిష్కారం ఎవరూ చూపుతారో వేచి చూడాలి.