ఏపీ లిక్కర్ స్కామ్లో సంచలనం నమోదైంది. వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్కు సంబంధించి ఇప్పటికే నిందితుల నివాసాలు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహిస్తున్నారు సిట్ అధికారులు. తాజాగా ఈ సోదాల్లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. 12 బాక్సుల్లో దాచిన రూ. 11 కోట్ల నగదును అధికారులు తాజాగా సీజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలోని సులోచన ఫార్మ్ గెస్ట్ హౌస్లో మనీ డంప్ను గుర్తించారు అధికారులు. లిక్కర్స్కామ్లో A-40 వరుణ్ పురుషోత్తం నోట సంచలన నిజాలు వెల్లడయ్యాయి. అతని వాంగ్మూలం ఆధారంగా తనిఖీలు చేపట్టిన అధికారులకు భారీగా నగదు పట్టుబడింది. నగదు సీజ్ ఘటనలో చాణక్య, వినయ్ పాత్రపైనా సిట్ బృందం విచారణ చేపట్టింది.
రాజ్ కెసిరెడ్డి, చాణక్య ఆదేశాల మేరకు జూన్ 2024లో వినయ్ సాయంతో వరుణ్ రూ.11 కోట్ల నగదు ఉన్న 12 అట్ట పెట్టెలను ఆఫీస్ ఫైళ్ల పేరుతో దాచినట్టు సిట్ అధికారులు గర్తించారు. వరుణ్ పురుషోత్తం నేరాన్ని అంగీకరించి నిజాలు బయటపెట్టడంతో లిక్కర్ స్కామ్కి చెందిన భారీ నగదు నిల్వల విషయం వెలుగులోకి వచ్చింది. ఏపీ మద్యం స్కామ్లో దాదాపు రూ.3500 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్టు సిట్ ప్రాథమికంగా గుర్తించింది. వైసీపీ ప్రభుత్వంలో ముఖ్య నేతల పాత్రపై కూడా సిట్కు కీలక సమాచారం లభ్యమైనట్టు తెలుస్తోంది. పూర్తి ఆధారాలతో త్వరలో కొందరు పెద్దతలకాయల పాత్ర కూడా బయటపడే అవకాశముందని సమాచారం.
వర్ధమాన్ కాలేజ్ దగ్గర ఉన్న సులోచన ఫార్మ్ గెస్ట్ హౌస్ యజమానిని విజయేందర్రెడ్డిగా గుర్తించారు. ఆయన తల్లి సులోచన పేరుతో ఈ ఫామ్హౌస్ ఉంది. అక్కడే వర్ధమాన్ కళాశాల క్రీడా ప్రాంగణం, వసతిగదులు ఉన్నాయి. స్టోర్ రూమ్లో బియ్యం బస్తాల మధ్య అట్టపెట్టెల్లో నగదు దాచి ఉంచారు. పక్కా సమాచారంతో వెళ్లిన ఏపీ సిట్ అధికారులు రూ.11 కోట్ల నగదు జప్తు చేశారు. పట్టుబడిన నగదుపై ఈడీ, ఐటీ దృష్టి సారించే అవకాశముంది. ఏపీ సిట్ తొలి ఛార్జిషీట్లోనే యూపీ డిస్టిలరీ పేరు ప్రస్తావించింది. 16 డిస్టిలరీల ముడుపులే రూ.1,677.68 కోట్లుగా సిట్ గుర్తించింది. రాజ్ కెసిరెడ్డి బినామీ సంస్థనే యూపీ డిస్టిలరీస్. హైదరాబాద్లోని అరేట్ ఆసుపత్రి డైరెక్టర్లుగా తీగల ఉపేందర్రెడ్డి, విజయేందర్రెడ్డి ఉన్నారు.
వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం దేశంలోనే అతిపెద్దదనే వార్తలు వినిపిస్తున్నయి. అత్యధిక మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీలు, డిస్టిలరీల నుంచి రూ.3,500 కోట్ల ముడుపులు కొల్లగొట్టారని సిట్ ప్రాథమికంగా తేల్చింది. ఈ కుంభకోణంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రూ.18,860 కోట్ల మేర నష్టం వాటిల్లిందని కూటమి ప్రభుత్వం శ్వేతపత్రంలో ప్రకటించింది. దీన్నిబట్టి ఇది ఎంత పెద్ద కుంభకోణమో అర్థం చేసుకోవచ్చు.











