తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ కన్నుమూశారు. కొన్నాళ్లుగా కరోనాతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఒక ప్రెవేటు ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు. 2019 ఎన్నికలకు ముందే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన దుర్గాప్రసాద్.. తిరుపతి నుంచి ఎంపీగా గెలిచారు.
బల్లి దుర్గాప్రసాద్.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సన్నిహితుడు. యూనివర్సిటీలో చదువుతున్నప్పుడే వారిద్దరూ మిత్రులు. చంద్రబాబు కు సన్నిహితుడిగా ఆయన సుదీర్ఘకాలం తెలుగుదేశం రాజకీయాల్లోనే ఉన్నారు. కాగా 2019లోనే పార్టీ మారారు.
కరోనా మహమ్మారి రాష్ట్రంలో తొలిసారిగా ఒక ఒక ప్రజా ప్రతినిధిని బలిగొంది. నెల్లూరు జిల్లా వెంకటగిరి కి చెందిన బల్లి దుర్గాప్రసాద్ ఇదివరకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత ఎన్నికల్లో తిరుపతి నుంచి వైకాపా ఎంపీగా పోటీ చేసి రెండు లక్షలు పైగా మెజారిటీతో విజయం సాధించారు.
కరోనా సౌకడంతో చెన్నైలో లో చికిత్స పొందుతున్న క్రమంలో బుధవారం సాయంత్రం గుండె పోటు రావడంతో మృతి చెందారు. ఆయనకు భార్య సరళమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన అకాల మృతికి పలువురు సంతాపం తెలిపారు.
ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి
నెల్లూరు జిల్లా వెంకటగిరి కి చెందిన బల్లి దుర్గాప్రసాదరావు న్యాయవాద వృత్తిలో ఉంటూ సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే వారు. తెలుగుదేశం పార్టీ స్థాపనతో ఎన్టీఆర్ పిలుపుమేరకు ఆ పార్టీలో చేరి క్రియాశీలకంగా పని చేశారు. దీంతో 1985 లో గూడూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశాన్ని తెలుగుదేశం కల్పించింది. కేవలం 28 సంవత్సరాల వయసులోనే శాసనసభకు ఆయన ఎన్నిక అయ్యారు. అందరితోనూ ఎంత స్నేహభావంతో మెలిగేవారు. తర్వాత 1994-99, 1999-04,2009-14 కాలం లో ఎమ్మెల్యేగా పని చేశారు. చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో 1996 నుంచి రెండేళ్లపాటు ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా సేవలు అందించారు.