కరోనా వస్తే పారాసిటమాల్ మాత్రలు వేసుకోవాలని చెప్పిన సీఎం కేసీఆర్, తనకు కరోనా వస్తే యశోదా ఆసుపత్రిలో ఎందుకు చేరారని బీజేపీ మహిళా నాయకురాలు విజయశాంతి అన్నారు. కరోనా సోకినప్పుడు సీఎం కేసీఆర్ యశోదాలో కాకుండా ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొంది ఉంటే బాగుండేదని ఆమె వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ బాధ్యతగా తాను కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని, కేసీఆర్ బాధ్యతగా వ్యవహరించి ఉంటే రాష్ట్రంలో కరోనాతో ఇంత మంది చనిపోయేవారు కాదని ఆమె అన్నారు.
ప్రభుత్వం సిరంజిలు కూడ ఇవ్వలేదా?
విజయశాంతి ఈ రోజు హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని శ్రీరాంనగర్లో ఏర్పాటు చేసిన కరోనా వ్యాక్సినేషన్ సెంటర్ను సందర్శించారు. వ్యాక్సినేషన్ తీరుతెన్నులను పరిశీలించిన ఆమె మాట్లాడుతూ రోజుకు 200 మంది వరకు ఇక్కడ వ్యాక్సిన్ పొందుతున్నట్టు అధికారులు తెలిపారని, కొవిషీల్డ్ ఇస్తున్నట్టు వెల్లడించారని విజయశాంతి చెప్పారు. అయితే, సిరంజిలు ప్రజలే స్వయంగా తెచ్చుకోవాలని వ్యాక్సిన్ సిబ్బంది చెప్పడం సరికాదని, ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేసి ఉంటే బాగుండేదని అన్నారు. సిరంజిలు కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదా అని ఆమె ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్లు ఉచితంగా అందిస్తామని ప్రధాని మోదీ ప్రకటించారని, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని, తమవంతు బాధ్యత సక్రమంగా నిర్వహించాలని ఆమె పేర్కొన్నారు.