క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్ మరో సీజన్ కు కసరత్తు ప్రారంభమైంది. 14 ఎడిషన్ కోసం ఇప్పటినుంచి బీసీసీఐ కసరత్తులు మెుదలుపెట్టింది. ఐపీఎల్ కు సంబంధించి త్వరలోనే రోడ్ మ్యాప్ సిద్ధం కాబోతోంది. కాగా, ఫిబ్రవరి మూడో వారంలో మినీ వేలంపాట జరగనుంది. అయితే ఈ ఆక్షన్లో సంబంధిత ఫ్రాంచైజీలు.. ఆటగాళ్లను కొనుగోలు చేసే విషయమై రూ.85 కోట్లు మించి ధర వెచ్చించరాదని సదరు ఫ్రాంచైజీలకు సూచించారు లీగ్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్.
ఫ్రాంచైజీలకు తుది గడువు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021కు సంబంధించిన సన్నాహాలు అప్పుడే మొదలయ్యాయి. ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు ఈ నెల 21 వరకు ఫ్రాంచైజీలకు గడువు ఇచ్చినట్టు లీగ్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ తెలిపారు. అలాగే, ట్రేడింగ్ విండోను ఫిబ్రవరి 4న మూసివేయనున్నట్టు చెప్పారు. ఆటగాళ్ల వేలానికి సంబంధించిన తేదీని త్వరలోనే వెల్లడించనున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న 8 జట్ల కోసం ఈ ఏడాది జరగాల్సిన మినీ వేలం వచ్చే నెల రెండు లేదంటే మూడో వారంలో నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.
చెన్నై సూపర్ కింగ్స్ మాత్రమే..
ఐపీఎల్ ఆటగాళ్ల కొనుగోలుకు సంబంధించి కీలక సూచనలు చేసింది. ఐపీఎల్లోని 8 జట్లు ఆటగాళ్ల కొనుగోలు కోసం గరిష్టంగా రూ. 85 కోట్లు వెచ్చించేందుకు అనుమతి ఉన్న విషయం తెలిసిందే, ఈసారి కూడా అంతేనని, ఆ మొత్తాన్ని పెంచేది లేదని బ్రిజేష్ పటేల్ తేల్చి చెప్పారు. చెన్నై సూపర్ కింగ్స్ వద్ద మాత్రం గత వేలం తర్వాత రూ. 15 లక్షలు మిగిలి ఉన్నాయి. కాబట్టి ఇద్దరు పెద్ద ఆటగాళ్లను రిలీజ్ చేయడం ద్వారా ఆ మొత్తాన్ని పెంచుకోవాలని యోచిస్తున్నట్టు సమాచారం.
ముంబై జట్టు అదేనా?.
ముంబై ఇండియన్స్ మాత్రం ఆటగాళ్లందరినీ దాదాపు ఉంచుకోవాలని యోచిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఉన్న రూ. 1.95 కోట్లను మరింత పెంచుకునేందుకు కొంతమందిని మాత్రమే రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రాజస్థాన్ రాయల్స్ వద్ద మాత్రం రూ. 14.75 కోట్లు మిగిలి ఉండగా, సన్రైజర్స్ హైదరాబాద్ వద్ద రూ. 10.1 కోట్లు, ఢిల్లీ కేపిటల్స్ వద్ద రూ. 9కోట్లు, కోల్కతా నైట్రైడర్స్ వద్ద రూ. 8.5 కోట్లు, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వద్ద రూ. 6.4 కోట్లు మిగిలి ఉన్నాయి.
ఐపీఎల్-14ను ఇండియాలోనేనా.. లేక!
ఐపీఎల్-14ను ఇండియాలోనే నిర్వహించాలా? లేక, మరెక్కడైనానా? అన్న విషయాన్ని తేల్చేందుకు మరిన్ని నెలల సమయం తీసుకోనుందని తెలుస్తోంది. ‘‘ఐపీఎల్ షెడ్యూలుకు తుదిరూపు ఇచ్చేందుకు బీసీసీఐ మరో నెల రోజులపాటు వేచి చూడొచ్చు. ఆ తర్వాత కొవిడ్ -19 పరిస్థితిని అంచనా వేసి ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటుంది. ఐపీఎల్-14 ఇక్కడే జరగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కాబట్టి ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకునేందుకు మరికొంత కాలం వేచి చూడక తప్పదు’’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన క్రికెట్ లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది ఐపీఎల్. ఈ పొట్టి క్రికెట్ అనతికాలంలోనే.. చెప్పలేనంత కీర్తిని సొంతం చేసుకుంది. అటువంటి పండుగకు ఏర్పాట్లు షురూ కావడంతో క్రికెట్ ప్రేమికుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఏఏ జట్టుల్లో ఎటువంటి మార్పులు జరుగుతాయనే చర్చ జోరుగా సాగుతోంది.











