ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక.. ఆ పార్టీ నేతలతో పాటు అధికారులు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు రేకెత్తుతున్నాయి. తమ ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తారా అంటూ సాధారణ ప్రజలపై వైసీపీ నేతలు జులుం ప్రదర్శిస్తుంటే.. అధికారులు కూడా తామేమీ తక్కువ తినలేదన్న రీతిలో ప్రజలను తీవ్ర అవమానాలకు గురి చేస్తున్నారు. ఈ తరహా ఘటనలు ఇప్పటికే లెక్కలేనన్ని చోటుచేసుకోగా.. తాజాగా రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా వ్యవహరిస్తున్న యువ ఐఏఎస్ ప్రవీణ్ ఆదిత్య తనదైన శైలిలో టీడీపీ మహిళా నేత, మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరితో పాటు ఆదివాసీ సంఘాల నేతలను నేలపైనే కూర్చోబెట్టి వివాదంలో చిక్కుకున్నారు.
అసలేం జరిగిందంటే..?
ఆదివాసీ హక్కుల సాధన కోసం గిరిజన ప్రాంతాల్లో నిరసనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం పరిధిలోని ఆదివాసీలు కూడా నిరసనలు చేస్తున్నారు. సోమవారం నాడు టీడీపీ మహిళా నేత, మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఆధ్వర్యంలో ఆదివాసీ సంఘాల నేతలు పీఓ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. దీంతో వారి డిమాండ్లను వినేందుకు సానుకూలత వ్యక్తం చేసిన ప్రవీణ్ ఆదిత్య.. వారిని తన చాంబర్ లోకి ఆహ్వానించారు. వారంతా తన చాంబర్ లోకి వస్తున్న విషయం తెలిసి, ఆదివాసీ సంఘాల నేతలతో మాజీ ఎమ్మెల్యే వస్తున్నారని తెలిసి కూడా వారికి ఆదిత్య సరిపడ కుర్చీలను వేయించలేదు. దీంతో రాజేశ్వరితో పాటు ఆదివాసీ సంఘాల నేతలంతా పీఓ కుర్చీకి ఎదురుగా నేలపై కూర్చున్నారు. అలా కూర్చున్న వారిలో రంపచోడవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వ్యవహరించిన వంతల రాజేశ్వరి ఉన్నారన్న విషయం తెలిసి కూడా తన కుర్చీలో కూర్చుని ప్రవీణ్ వారితో చర్చలు జరిపారు.
పీఓది దురుసు వర్తనే
ఈ సందర్భంగా ఆదివాసీల డిమాండ్లు విన్న ఆదిత్య.. వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానన్న హామీ కూడా ఇవ్వకుండా దురుసుగానే మాట్లాడారట. అప్పటికే తమకు గౌరవం ఇవ్వకుండా తమను నేలపై కూర్చోబెట్టినా ఓపిక పట్టిన రాజేశ్వరి.. పీఓ దురుసు వర్తనతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ పీఓ చాంబర్ నుంచి బయటకు వచ్చేశారు. ఆ తర్వాత పీఓ కార్యాలయం ముందే మీడియా ప్రతినిధులతో మాట్లాడిన రాజేశ్వరి.. తమను పీఓ ఎలా అవమానించారన్న విషయాన్ని వెల్లడించారు. హక్కుల కోసం ఉద్యమిస్తున్న ఆదివాసీలకు అండగా నిలవడంతో పాటు ఆయా సమస్యలపై పరిష్కారం చూపేలా వ్యవహరించకుండా పీఓ తన దమన నీతిని బయటపెట్టుకున్నారని రాజేశ్వరి ఆరోపించారు. ఈ తరహా అధికారుల తీరును ఉపేక్షించేది లేదని ఆమె హెచ్చరించారు. మరి ఈ వివాదం నుంచి ప్రవీణ్ ఆదిత్య ఎలా బయటపడతారో చూడాలి.
Must Read ;- సమ న్యాయం కేరాఫ్ టీడీపీ!