టీడీపీ పార్టీ అంటేనే.. బడుగు, బలహీన వర్గాల పార్టీ అని అంటారు. నాడు అగ్రవర్ణాలు భూస్వామ్యుల చేతుల్లో ఉన్న రాజ్యాధికారాన్ని స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ని స్థాపించి బీసీ, ఎస్సీలకు రాజకీయ అవకాశం కల్పించి చట్టసభలకు పంపించారు. తెలంగాణలో ఉన్న పటేల్ పట్వారీ వ్యస్థను రద్దు చేశారు. మహిళలకు ఆస్తి హక్కు ఇచ్చి మహిళల ఆత్మ గౌరవాన్ని పెంపొందించారు. అనంతరం టీడీపీ అధికారం చేపట్టిన చంద్రబాబు అదే సామాజిక దృక్పథంతో పార్టీలో గానీ, ప్రభుత్వంలో గానీ సామాజిక న్యాయం పాటిస్తూనే ఉన్నారు. అందుకు నిదర్శనంగానే పార్టీ ఏపీ అధ్యక్షుడిగా కింజరాపు అచ్చెన్నాయుడు, తెలంగాణ అధ్యక్షుడిగా బక్కని నర్సింహులు కొనసాగుతున్నారు.
అన్నింటా సామాజిక న్యాయం
టీడీపీలో అత్యున్నత విభాగంగా పేరున్న పొలిట్ బ్యూరో సభ్యులలో సామాజిక న్యాయం పాటిస్తూ, రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను అటు ఏపీ అధ్యక్ష బాధ్యత వెనకబడిన కులానికి చెందిన అచ్చెన్నాయుడికి, తెలంగాణ పార్టీ అధ్యక్ష బాధ్యత షెడ్యూలు కులానికి చెందిన బక్కని నరసింహులుకు ఇచ్చారు. పార్టీ జాతీయ, రాష్ట్ర కమిటీలలో కూడా సామాజిక న్యాయం పాటిస్తూ అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించారు. గత టీడీపీ ప్రభుత్వంలో మంత్రి పదవులు, నామినేట్ పోస్టులలో కూడా సామాజిక న్యాయం పాటించారు. ఇక ప్రభుత్వ పథకాల విషయానికి వస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా అనేక సంక్షేమ పథకాలు అందచేశారు. మహిళా సాధికారత కోసం డ్రాక్వా సంఘాలను ఏర్పాటు చేసి చరిత్రలో నిలిచిపోయారు.
వైసీపీ దాడులను ఎదురొడ్డాల్సిందే
ఇటీవలి కాలంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి దళితులు, మహిళలు, ముస్లిం మైనారిటీలు, బీసీలపై దాడులు నానాటికీ పెరిగిపోతున్నాయి. వీటికి ఎదురొడ్డి నిలుస్తున్న టీడీపీ ఎప్పటికప్పుడు జగన్ సర్కారును డిఫెన్స్ లో పడేస్తోంది. టీడీపీ పోరులో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ముందు వరుసలో నిలుచుండి.. జగన్ సర్కారు దమన నీతిపై తనదైన శైలిలో పోరు సాగిస్తున్నారు. ఇదే మాదిరిగా పార్టీకి చెందిన అన్ని వర్గాల నేతలు ముందుకు రావాలని, జగన్ సర్కారు దౌర్జన్యాలపై పోరాటం సాగించాలని.. అప్పుడే పార్టీకి చెందిన శ్రేణులపై దాడులను ఆపడంతో పాటుగా రాష్ట్రంలోని ఆయా వర్గాలపై జరుగుతున్న దుర్మార్గాలకు అడ్డుకట్ట వేయవచ్చని పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ఈ పోరులో అలుపెరగని పోరే పార్టీని బలోపేతం చేస్తుందని కూడా ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు చెప్పినట్లుగా పార్టీకి చెందిన అన్ని విభాగాలు.. ప్రత్యేకించి దాడులకు గురవుతున్న వర్గాలకు చెందిన నేతలు ముందు వరుసలో నిలుచుని పోరు సాగిస్తే జగన్ సర్కారు వెనకడుగు వేయక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- టీడీపీకి కేడరే అండ.. కేడర్కు బాబు అండ