వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీకి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టాక నిజంగానే.. వ్యవస్థలు దారి తప్పాయన్న వాదనలు వినిపించాయి. ఆ వాదనలు నిజమేనని ఇప్పటికే చాలా ఘటనలు నిరూపించగా.. ఇప్పుడు ఏకంగా పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి.. వారిని భావి భారత పౌరులుగా.. దేశం గర్వించదగ్గ నిష్ణాతులుగా తీర్చిదిద్దే విద్యాలయాలు కూడా ఇప్పుడు అసాంఘీక కార్యకలాపాలకు వేదికగా మారుతున్నాయి. విద్యాబోధనలో దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన విద్యా సంస్థలుగా పేరున్న జవహర్లాల్ నెమ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ)కు చెందిన కాకినాడ క్యాంపస్ లో ఏకంగా హనీమూన్ కే ఏర్పాటు చేసి పారేశారు. ఓ మహిళా ప్రొఫెసర్ పేరిట వర్సిటీలోని గెస్ట్ హౌస్ లోని మూడు గదులు బుక్ అయిన వైనంతో విద్యార్థులు ఆరా తీయగా.. ఈ హీన సంస్కృతి బయటపడింది. ఈ వ్యవహారంపై ఇప్పుడు విద్యార్థి సంఘాల నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
అధ్యాపకుల్లోనూ గ్రూపులు
జేఎన్టీయూ గొడుగు కింద ఏపీలో రెండు వర్సిటీలు కొనసాగుతున్నాయి. వాటిలో ఒకటి అనంతపురంలో ఉంటే.. మరొకటి తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో ఉంది. విద్యాబోధనలో ఈ వర్సిటీ తనదైన శైలి సత్తా చాటుతోంది. ఈ వర్సిటీలో గెస్ట్ లెక్చర్లు ఇచ్చేందుకు పలు రంగాలకు చెందిన ప్రముఖులు వస్తుంటారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఈ సంస్థకు పలువురు కేంద్ర అధికారులు, ప్రభుత్వ ప్రతినిధులు కూడా తరచూ వస్తుంటారు. వీరి విడిది కోసం వర్సిటీ ప్రాంగణంలోనే సకల హంగులతో ఓ గెస్ట్ హౌస్ ను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటిదాకా ఈ వర్సిటీలో పెద్దగా చెప్పుకోదగ్గ అసాంఘీక కార్యకలాపాలేమీ చోటుచేసుకోలేదనే చెప్పాలి. అయితే జగన్ జమానా మొదలు కాగానే.. వర్సిటీల్లోకి రాజకీయాలు ప్రవేశించాయి. విద్యార్ధి సంఘాల పేరుతతో ఉద్యమాలు చేపట్టే విద్యార్థులను పక్కనపెడితే.. అధ్యాపకుల్లోనూ వర్గాలు ఏర్పడ్డాయి. ఇక అధికార పార్టీకి చెందిన వర్గానికి చెందిన అధ్యాపకుల హంగామా అంతా ఇంతా కాదనే చెప్పాలి. ఈ తరహా విష సంస్కృతి నానాటికీ పెరిగిపోతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
అసలేం జరిగిందంటే..?
ఇక తాజా విషయానికి వస్తే.. వర్సిటీలోని గెస్ట్ హౌస్ కు చెందిన మూడు గదులను ప్రొఫెసర్ స్వర్ణకుమారి పేరిట బుక్కయ్యాయి. వర్సిటీ అధ్యాపకులకు వర్సిటీ ప్రాంగణంలోనే వర్సిటీ క్వార్టర్లు ఉంటాయి. వాటిలో ఉండేందుకు ఇష్టం లేని వారు బయట అద్దెకు ఇల్లు తీసుకోవడమో, సొంత ఇల్లు కట్టుకోవడమో చేస్తుంటారు. అంటే.. అధ్యాపకుల ఫ్యామిలీలకు చెందిన వ్యవహారాలన్నీ వారి ఇళ్లలోనే జరుగుతాయి. పెళ్లి అయినా. పేరంటమైనా వారి ఇళ్లల్లోనే జరుగుతాయి. మరి ప్రొఫెసర్ స్వర్ణకుమారి పేరిట గెస్ట్ హౌస్ లో ఏకంగా మూడు గదులు బుక్ కావడంతో కొందరికి అనుమానం వచ్చింది. దీంతో వారు ఆరా తీయగా.. ఓ కొత్తగా పెళ్లి చేసుకున్న తన మేనకోడలు హనీమూన్ కోసమే గెస్ట్ హౌస్ లోని గదులను ప్రొఫెసర్ స్వర్ణ కుమారి బుక్ చేశారని తేలింది. వర్సిటీ గెస్ట్ హౌస్ లో హనీమూన్ అన్న విషయం ఒక్కసారిగా కలకలం రేగగా.. ఈ వ్యవహారంపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇప్పుడీ విషయం ఏపీలోని జగన్ సర్కారును షేక్ చేస్తోంది.
Must Read ;- జగన్ మార్కు కోతలు షురూ!











