వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్కు అత్యంత సమీప బంధువు అర్జున్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్పోర్టులో అరెస్టు చేశారు గుడివాడ పోలీసులు. గతంలో అర్జున్ రెడ్డి వైసీపీ సోషల్మీడియా విభాగంలో సజ్జల భార్గవ్ రెడ్డితో కలిసి కీలకంగా పని చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్కల్యాణ్, నారా లోకేష్తో పాటు వారి కుటుంబసభ్యుల ఫోటోలను మార్ఫింగ్ చేసి..సోషల్మీడియాలో వికృతమైన ప్రచారం చేశారు. దీంతో గతేడాది నవంబర్లో అర్జున్ రెడ్డిపై గుడివాడలో కేసు నమోదైంది. అర్జున్ రెడ్డి అరెస్టు కోసం పోలీసులు ప్రయత్నించగా..అప్పటికే విదేశాలకు పారిపోయాడు. దీంతో పోలీసులు లుకౌట్ సర్క్యూలర్ జారీ చేశారు..
ఐతే సోమవారం రాత్రి అర్జున్ రెడ్డి విదేశాల నుంచి తిరిగి రావడంతో శంషాబాద్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకుని గుడివాడ పోలీసులకు సమాచారమిచ్చారు. ఏపీ నుంచి వెళ్లిన బృందాలు అర్జున్ రెడ్డిని అదుపులోకి తీసుకుని CRPC సెక్షన్ 41ఏ నోటీసులు అందజేశాయి. అయితే, అర్జున్రెడ్డి అప్పటికే తన న్యాయవాదుల్ని ఎయిర్పోర్టుకు రప్పించుకున్నారు..
అర్జున్ రెడ్డి ఎవరో కాదు..జగన్కు బాబాయి వరసయ్యే వై.ఎస్. ప్రకాశ్ రెడ్డి మనవడే అర్జున్ రెడ్డి. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హ*త్య కేసులో రెండో నిందితుడైన సునీల్యాదవ్ సోదరుడు కిరణ్యాదవ్, అర్జున్రెడ్డిల మధ్య వివేకా హత్య జరిగిన రోజు రాత్రి ఫోన్ సంభాషణలు జరిగినట్లు అభియోగాలున్నాయి. వై.ఎస్.వివేకా కూతురు సునీత సైతం ఈ అంశంపై పూర్తి స్థాయి దర్యాప్తు జరగలేదని సీబీఐ కోర్టును ఆశ్రయించారు. దీంతో దీనిపై దర్యాప్తు చేసి, అనుబంధ ఛార్జిషీట్ వేయాలని హైదరాబాద్లోని నాంపల్లి సీబీఐ కోర్టు ఇటీవల సీబీఐని ఆదేశించింది..
కడప ఎయిర్పోర్టులో మరో వ్యక్తి..
ఎన్నికల టైంలో సామాజిక మాధ్యమాల్లో చంద్రబాబు, లోకేష్పై అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వైసీపీ కార్యకర్త బత్తల శ్రీనివాసులు రెడ్డిని కడప ఎయిర్పోర్టులో అరెస్టు చేశారు. బద్వేలుకు చెందిన శ్రీనివాసులురెడ్డి..గతంలో వైసీపీ సోషల్మీడియాలో పని చేసేవారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గల్ఫ్ దేశాలకు పారిపోయాడు. ఐతే సోమవారం ఇండియాకు తిరిగిరాగా..కడప ఎయిర్పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..











