వైసీపీ అధినేత జగన్రెడ్డిపై అనేక కేసులున్నాయి. పుష్కర కాలంపైగా ఆ కేసులు సాగుతూనే ఉన్నాయి. 2019లో ముఖ్యమంత్రి పదవి చేపట్టాక.. ఆయన మళ్లీ కోర్టు మెట్లెక్కలేదు. 2024లో అధికారం పోయిన తర్వాతా.. జగన్ కోర్టు మొహం చూడలేదు. విదేశాలకు వెళ్లడానికి పాస్పోర్టు కోసం న్యాయ స్థానంలో స్వయంగా హాజరు కావాలని జడ్జి ఆదేశించినా వెళ్లలేదు. జగన్ తగ్గకపోవడంతో న్యాయ వ్యవస్థే సర్దుకుపోయి.. ఆయన లాయర్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే కోర్టుకు వెళ్లేది లేదని జగన్ ఎందుకంత పట్టుదలగా ఉన్నారు అని చాలా మందికి వస్తున్న డౌట్.
2013లో బెయిల్పై జైలు నుంచి విడులైన రోజు నుంచి 2019 వరకు ప్రతి శుక్రవారం జగన్ వ్యక్తిగతంగా కోర్టులో హాజరయ్యే వారు. ఆయన కోర్టుకు వెళ్లిన రోజు.. ఆ ముందు రోజు.. తర్వాత రోజు కూడా మీడియా ఫోకస్ అంతా జగన్ అవినీతి, అక్రమాస్తులు.. కేసులపైనే ఉండేది. ముఖ్యమంత్రి పదవి చేపట్టాక అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాననే సాకుతో కోర్టు వెళ్లడం మానేశారు. అప్పటి నుంచి జగన్ కేసులపై మీడియా ఫోకస్ క్రమంగా ఫేడ్ అవుట్ అయిపోయింది. ప్రతిపక్షాలు పనిగట్టుకొని విమర్శలు చేస్తే తప్ప.. జగన్ అక్రమాస్తుల కేసులపై మీడియాలో వార్తలు రావడం లేదు.
ఇప్పుడు జగన్ మళ్లీ కోర్టుకు వెళ్లడం ప్రారంభిస్తే.. మళ్లీ కథ మొదటకు వస్తుంది. ఒక్కసారి న్యాయస్థానంలో హాజరైతై.. వారం వారం వాయిదాలకు తిరగాల్సిందే. అదే జరిగితే.. మళ్లీ మీడియా మొత్తం జగన్ అక్రమాలు, అవినీతి సంపద చుట్టూ కథలు, కథలుగా కథనాలు ప్రచారం చేస్తుంది. ఒక్కసారి ఈ ప్రచారం స్టార్ట్ అయితే.. జగన్ని ఆకాశానికెత్తేసి.. దేవుడి తర్వాత దేవుడంతటి వాడని వైసీపీ మీడియా చేసిన పబ్లిసిటీ అంతా డ్రైనేజీలో కొట్టుకుపోతుంది. జగన్ అంటే ఒక ఆర్ధిక నేరస్తుడు, ఉన్మాది అంటూ ఆయన ప్రత్యర్ధులు చేస్తున్న ప్రచారానికి వారం, వారం కోర్టు వాయిదాలు ఊతం ఇస్తాయి. వారానికోసారి తాడేపల్లి ప్యాలెస్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే స్కిట్ల స్థానాన్ని జగన్ కోర్టు సీన్ భర్తీ చేస్తుంది. జగన్ అజెండా పక్కకు పోయి.. ఆయన ప్రత్యర్ధుల విమర్శలే హైలైట్ అవుతాయి.
ఈ నెగిటివ్ పబ్లిసిటీ, బ్యాడ్ ఇమేజ్ నుంచి తప్పించుకోవడానికే జగన్రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ కోర్టు మెట్లు ఎక్కేందుకు ఇష్టం పడటం లేదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అందుకోసం ఢిల్లీ పెద్దలకు కప్పం కట్టాల్సి వచ్చినా.. బీజేపీతో అంటకాగుతున్నాడనే కారణంతో రాజకీయంగా నష్టం జరుగుతున్నా.. జగన్ కోర్టు వైపు చూడాల్సిన అవసరం లేకుండా ఏర్పాట్లు చేసుకున్నారని చెప్పుకోవచ్చు











