ఏపీలో విద్య నాణ్యత పడిపోతోందా ? పదో తరగతి ఫలితాలు అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయా ? పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం పడిపోవడానికి కారణం ఏమిటి ? ఈ వైఫల్యానికి వెనుక ఉన్న మర్మమేంటి ? కరోనాను బూచిగా చూపిస్తున్న జగన్ ప్రభుత్వం విద్యా ప్రణాళికలను పాటించకపోవడమే ఉత్తీర్ణత శాతం దిగజారడానికి కారణమా ? ఈ అంశంలో నిజంగా నష్టపోయింది ఎవరు ?
ఆంధ్ర ప్రదేశ్ లో పదో తరగతి పరీక్షల నిర్వహణ మొదలు ఫలితాల వెల్లడి వరకు అంతా అస్తవ్యస్తంగా సాగింది.వాయిదాలు, గందరగోళాల నడుమ ఎట్టకేలకు విడుదలైన టెన్త్ రిజల్ట్స్ విద్యార్ధులను, వారి తల్లిదండ్రులను షాక్ కి గురి చేశాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది నమోదైన పదో తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం పై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.వైసీపీ ప్రభుత్వ కుట్రలకు విద్యార్ధులు బలైపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నిజానికి గత నాలుగేళ్ళ ఫలితాలతో పోలిస్తే ఈ సంవత్సరం పదో తరగతి ఫలితాలు దిగజారుడు స్థాయికి పడిపోయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.2019 వరకు 10 th పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం ఎన్నడూ 90 పర్సంటేజ్ కి తగ్గింది లేదు. 2018లో 94.4 శాతం ఉత్తీర్ణత శాతం నమోదవగా, 2019లో 94.8 శాతం పాస్ పర్సంటేజ్ నమోదయ్యింది. తర్వాత రెండేళ్ళ పాటు కరోనా ఉండడంతో ఏపీలో అసలు పరీక్షయలే జరగలేదు. కాగా 2022లో నిర్వహించిన 10 th పరీక్షల్లో కేవలం 67.26 మంది విద్యార్ధులు మాత్రమే ఉత్తీర్ణులు అయ్యారు. అంటే దాదాపు 28 శాతం ఫలితాలు తగ్గాయి. ఇప్పుడు ఇదే అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా, దీనిపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పదో తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం పడిపోవడానికి ప్రధానంగా కరోనానే కారణమని జగన్ సర్కార్ చెబుతోంది.కానీ అసలు మర్మం వేరే ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మూడేళ్లుగా విద్యా వ్యవస్థలో రాజకీయ జోక్యం ఎక్కువైపోవడం వల్లనే నాణ్యత పడిపోయిందని దాని కారణంగానే ఫలితాలు ఈ విధంగా వచ్చాయని టాక్.ఈ క్రమంలోనే రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు ఇంత దారుణంగా పడిపోవడం పై విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా విద్యావేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వైసీపీ ప్రభుత్వం వచ్చాక విద్యా ఏపీలో ప్రమాణాలు దారుణంగా పడిపోయాయనై బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అదేసమయంలో జగన్ ప్రభుత్వం చెబుతున్నట్లు ఉత్తీర్ణత శాతం పడిపోవడానికి కరోనాను బూచిగా చూపడం పై మండిపడుతున్నారు.
వాస్తవానికి గడిచిన మూడేళ్ళలో రెండేళ్ళపాటు కరోనా ఇబ్బందులు వచ్చినప్పటికీ 2020 మార్చి వరకు రాష్ట్రంలో పాఠశాలలు బాగానే నడిచాయి. 2021 విద్య సంవత్సరంలో కూడా క్లాసులు పూర్తిస్తాయిలోనే నడిచాయి. అంటే ఇబ్బంది వచ్చిందల్లా మధ్యలో ఒక్క సంవత్సరం మాత్రమే. ఇక ఆ సమయంలో కూడా ఆన్ లైన్ క్లాసులు నడిచాయి.దీంతో ఉత్తీర్ణత శాతం తగ్గడానికి కరోనా కారణమని ప్రభుత్వం ఎలా చెబుతుందని, ఒకవేళ అదే నిజమైతే పక్క రాష్ట్రంలో ఫలితాలు భిన్నంగా ఎలా వచ్చాయనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.ఈ నేపధ్యంలోనే ఫలితాలు ఎందుకు తగ్గాయో ప్రభుత్వమే చెప్పాలనే డిమాండ్ లు తెరపైకి వస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఏపీలో 10 th పరీక్షల్లో పాస్ పర్సెంటేజ్ తగ్గడం వెనుక జగన్ ప్రభుత్వం కుట్ర దాగుందనే చర్చ జోరుగా సాగుతోంది.ముఖ్యంగా కార్పొరేట్ మూలాలను అణగదొక్కాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించుకుందని, అందులో భాగంగా ప్రభుత్వానికి, ఉపాధ్యాయులకి మధ్య జరిగిన సంఘర్షణలో విద్యార్ధులు నష్టపోయారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పదో తరగతి ఉత్తీర్ణత శాతం తగ్గించిందనే విమర్శలు నిపుణుల నుంచి వినిపిస్తున్నాయి. ప్రధానంగా అమ్మ ఓడి ఇచ్చేందుకు జగన్ సర్కార్ వద్ద నిధులు లేవని, ఎక్కడా అప్పులు దొరకకపోవడంతో అవస్థలు పడుతున్న ప్రభుత్వం లబ్ధిదారులను తగ్గించే కుట్రలో భాగంగానే పరీక్షల్లో ఎక్కువమంది విద్యార్ధులను ఫెయిల్ చేసిందని అభిప్రాయపడుతున్నారు.ఒకవేళ పదో తరగతి విద్యార్ధులలో ఎక్కువమంది ఉత్తీర్ణులు అయితే అమ్మఓడి తోపాటు ఇంటర్, పాలిటెక్నిక్ లో ఫీజు రీఅంబర్స్ మెంట్ ఇవ్వాలనే భయంతోనే ఇటువంటి కుట్రలకు తెరలేపారని, అంతేకాకుండా పేపర్ వాల్యువేషన్ కి కూడా అతితక్కువ సమయం ఇవ్వడం కూడా ఇందులో భాగమే అని.. అందుకే ఫలితాలు దిగజారడానికి కారణమని చర్చించుకుంటున్నారు.











