వైసీపీ శ్రేణులు ఏం మారలేదు. అధికారం ఉన్నా, లేకపోయినా అదే అరాచకాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా ఆ పార్టీ అధినేత జగన్ నెల్లూరు జిల్లా పర్యటనలోనూ అదే పంథాను కొనసాగించారు. స్వయంగా పార్టీ అధినేత జగనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే..కార్యకర్తలు ఊరుకుంటారా. రోప్పార్టీని తోసుకుని ముందుకు రావాలని జగన్ పిలవడంతో కార్యకర్తలు రచ్చ రచ్చ చేశారు. సత్తెనపల్లి, బంగారుపాళ్యం తరహాలోనే నెల్లూరు జిల్లా పర్యటన సైతం నిబంధనల ఉల్లంఘనల మధ్య కొనసాగింది. జగనే స్వయంగా చేతులు ఊపుతూ పిలవడంతో పోలీసులను తోసుకుంటూ కార్యకర్తలు వీరంగం సృష్టించారు.
నిజానికి వైసీపీ నేత జగన్ చేస్తున్న యాత్రలు పరామర్శ యాత్రల్లా కనిపించడం లేదు. ప్రతీ చోట ఆయన బలప్రదర్శన చేయాలని ఆయన భావిస్తున్నారు. రైతు పరామర్శలను సైతం ఆయన రాజకీయాల కోసమే వాడుకుంటున్నారు. ఈ పరామర్శల యాత్రల విషయంలో పార్టీ నేతలకు ప్రత్యేకంగా సూచనలు చేస్తున్నారు. పోలీసులు విధించిన ఆంక్షలను పట్టించుకోవద్దని, భారీగా జన సమీకరణ చేయాలని పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో నేతలు సైతం డబ్బులిచ్చి మరీ జనాలను తరలిస్తున్నారు. దీంతో పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా ఫలితం లేకుండా పోతుంది. స్వయంగా వైసీపీ నేతలే కార్యకర్తలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తున్నారు.
నెల్లూరు జైలులో కాకాణిని పరామర్శించిన జగన్ తర్వాత రోడ్ షో నిర్వహిస్తూ నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. జైలు నుంచి నల్లపురెడ్డి నివాసానికి దూరం దాదాపు 9 కిలోమీటర్లు. 9 కిలోమీటర్లు రోడ్ షో అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సామాన్య ప్రజలు ఎంత ఇబ్బంది పడిఉంటారో. దాదాపు నాలుగున్నర గంటల పాటు రోడ్లపై నరకం చూశారు సామాన్యులు. పలు చోట్ల ఈ రోడ్ షో ఉద్రిక్తతలకు దారి తీసింది. ఓ చోట స్వయంగా ప్రసన్నకుమార్రెడ్డి కూడా కిందపడ్డారు. పోలీసులు అప్రమత్తమై పక్కకు లాగేయడంతో ప్రమాదం తప్పింది. తోపులాటలో కావలి స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ మాలకొండయ్యపై వైసీపీ కార్యకర్తలు పడటంతో..ఆయన చెయ్యి విరిగిపోయింది.











