అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్న వైనం..
ఒకవైపు వివేకా హత్యకేసు, కోడికత్తి కేసు.. మరోవైపు టిడిపి-జనసేన-బిజెపి పొత్తులు.. ఇంకోవైపు బాధితులంతా ఏకమయ్యారన్న భయం..మధ్య జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. ఏ రెండు కేసులైతే తనపై సానుభూతిని పెంచి గత ఎన్నికల్లో గెలిపించాయో అవే రేపటి ఎన్నికల్లో తన మెడకు చుట్టుకున్నాయనే ఆందోళనతో నిద్రలేని రాత్రులతో సతమతం..
ఇప్పటికే రాయలసీమలో నారా లోకేశ్ ‘‘యువగళం’’ పాదయాత్ర దుమ్మురేపుతోంది.. సొంత జిల్లా కడపలో, తన నియోజకవర్గం పులివెందులలో లోకేశ్ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టడం కలిచివేస్తోంది.. ఇదిలావుంటే, వైసిపి విముక్త ఆంధ్రప్రదేశే తన లక్ష్యమంటూ పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు సిద్ధం కావడంతో దిక్కుతోచని స్థితి. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో భేటీ కావడం గోరుచుట్టు మీద రోకటిపోటే..టిడిపి, బిజెపి, జనసేన పొత్తుతో మళ్లీ 2014ఎలక్షన్ సీన్ రిపీట్ అవుతుందనే భయం మొదలైంది. ఆ మూడు పార్టీల పొత్తుగాని, లేక టిడిపి-జనసేన అలయెన్స్ గాని జరిగితే వైసిపి పని కుడితిలో పడ్డ ఎలుక చందమే.. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఈ పొత్తులకు తోడైతే వచ్చే ప్రభంజనంలో వైసిపి ఊడ్చుకుపోవడం తథ్యం..
చివరి ఏడాదిలో జగన్ గ్రాఫ్ 10% పడిపోయిందనే సర్వేలు వైసిపి నేతలను ఉలిక్కిపడేలా చేశాయి. 4ఏళ్ల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత అడుగుడుగునా పెల్లుబుకుతోంది. మంత్రులు, వైసిపి ఎమ్మెల్యేలు ‘‘గడపగడప’’కూ వెళ్తే జనం ఇళ్లకు తాళాలు వేసుకుని వెళ్లిపోవడం, ఇళ్లపై టిడిపి జెండాలు కట్టడం, వైసిపి మీటింగుల్లో ‘‘సైకో పోవాలి-సైకిల్ రావాలనే’’ పాటలు మార్మోగడం, సాక్షాత్తూ సిఎం జగన్ మాట్లాడుతుండగానే జనం సభనుంచి వెళ్లిపోవడం, జనం వెళ్లకుండా గేట్లకు తాళాలు వేయమని మంత్రులే మైకులో చెబ్తుండటం వంటివన్నీ మారిన ఏపి రాజకీయ ముఖచిత్రం అనూహ్యమార్పులకు నిదర్శనాలే..గ్రాడ్యుయేట్స్ నుంచి, ఎమ్మెల్యేల కోటా కౌన్సిల్ ఎన్నికల్లో టిడిపి 4గురు అభ్యర్ధులు ఘన విజయం సాధించడం శాంపిల్ మాత్రమే..
వివేకానందరెడ్డి హత్య కేసును టిడిపిపైకి నెట్టి, నారాసుర రక్తచరిత్ర అని సొంత మీడియాలో రాయించి, మొదట గుండెపోటని, రక్తపు వాంతులని, టిడిపివాళ్లే చంపారని, చంద్రబాబు, లోకేశ్ చంపించారనే ప్రచారం పచ్చి అబద్దమని ఇప్పటికే రాష్ట్రం మొత్తం తెలిసిపోయింది. ప్రతిపక్షంలో ఉండి సిబిఐ దర్యాప్తు అడిగిన జగన్మోహన్ రెడ్డి సిఎం కాగానే సిబిఐ వద్దని లేఖ రాయడం వెనుక మర్మమేమిటో బైటపడింది. తాడేపల్లి ప్యాలెస్ వేదికగానే మహాకుట్ర జరిగిందనేది తేటతెల్లమైంది. పాత్రధారులు,సూత్రధారుల గుట్టుమట్లన్నీ సిబిఐ బైటకు తీయడంతో ఏదోరకంగా బైటపడటానికి, నిందితులను కాపాడటానికి ఏ స్థాయికైనా తెగించడం గమనార్హం. ఒక కంటిని ఇంకో కన్ను ఎలా పొడుస్తుందని జగన్మోహన రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలెంత పసలేనివో తేలిపోయింది. సొంత బాబాయి హత్యలో వేలు విడిచిన బాబాయి భాస్కర రెడ్డి ఇప్పటికే అరెస్టు కావడం విదితమే. కడప ఎంపి అవినాశ్ రెడ్డిని కూడా అరెస్టు చేస్తామని సిబిఐ కోర్టుకు చెప్పిన నేపథ్యంలో ఏదోవిధంగా అతడు అరెస్టు కాకుండా అడ్డుకుంటున్న చర్యలను రాష్ట్రం మొత్తం చూసింది.
తల్లికి గుండెపోటు వచ్చిందని తొలుత పులివెందుల ఆస్పత్రి, తర్వాత కర్నూలు విశ్వభారతి ఆసుపత్రిలో జరిగిన నాటకీయ పరిణామాలు దేశం మొత్తాన్ని నివ్వెరపరిచాయి. అనారోగ్యంతో ఉన్న తల్లికి అండగా ఉండాలంటూ హైదరాబాద్ నుంచి అవినాశ్ రెడ్డి మందీమార్బలంతో తరలివెళ్లి కర్నూలులో ఆస్పత్రిలో తిష్టవేయడం, అరెస్టు చేయడానికి అక్కడికెళ్లిన సిబిఐ బృందాలకు అటు ఏపి ప్రభుత్వంగాని, ఇటు అవినాశ్ రెడ్డిగాని సహకరించకపోవడం, పెద్దఎత్తున వైసిపి శ్రేణులను మొహరించి సాక్షాత్తూ సిబిఐనే బెంబేలెత్తించడం వంటివన్నీ దిగ్భ్రాంతికర పరిణామాలే..సందట్లో సడేమియాగా తెలంగాణ హైకోర్టు అవినాశ్ కు ముందస్తు బెయిల్ ఇవ్వడం, ప్రతి శనివారం సిబిఐ విచారణకు హాజరవ్వాలని సాయంత్రం 5గం వరకే ఎంక్వైరీ పూర్తిచేయాలని షరతులతో కూడిన విచారణకు సిబిఐని ఆదేశించడం కొసమెరుపులే..గత శనివారం విచారణకొచ్చిన అవినాశ్ ను సిబిఐ అరెస్టు చేసిందని, షరతుల మేరకు రూ 5లక్షల పూచీకత్తుపై విడిచిపెట్టిందనేది 5రోజుల తర్వాతగాని వెలుగుచూడని మరో ఘట్టం..
కొడుక్కి ముందస్తు బెయిల్ ఇచ్చినట్లే తనకీ బెయిల్ ఇవ్వాలని భాస్కర రెడ్డి పిటిషన్ వేయడం, తండ్రీ కొడుకులిద్దరు బైటవుంటే సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని కాబట్టి అవినాశ్ ముందస్తు బెయిల్ రద్దుచేయాలని, భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇవ్వకూడదని వివేకా కుమార్తె ఇంప్లీడ్ పిటిషన్ వేయడం జరిగింది. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పందన వీటన్నింటిపై ఎలా ఉంటుందనేదానిపైనే అందరికీ ఉత్కంఠగా మారింది.
బాబాయి హత్య గురించి జగన్మోహన్ రెడ్డికి ముందే తెలుసనేది ప్రజలందరిలోకి వెళ్లిన నేపథ్యంలో, ఆరోజు వైసిపి మేనిఫెస్టో మీటింగ్ లో ఆయనతో పాల్గొన్న 4గురిలో ఒకరివద్ద ఇప్పటికే 41ఏ వాంగ్మూలం తీసుకున్న పరిస్థితుల్లో, నేడోరేపో సిబిఐ తాడేపల్లి తలుపులు తట్టడం ఖాయం. యువగళం పాదయాత్రకు కడప ప్రజానీకం బ్రహ్మరథం పట్టడం, హు కిల్డ్ బాబాయి అనే ప్రశ్నకు స్థానిక ప్రజలే వీధులు మార్మోగేలా జవాబివ్వడం చూస్తున్నాం. బాబాయిని చంపిందెవరో తేలింది, పాత్రధారులెవరో తెలిసిపోయింది, మహాకుట్ర సూత్రధారుల్లో కొందరు పట్టుబడ్డారు, ఇక పూర్తి ఆధారాలతో కేసును కొలిక్కితేవడమే తరువాయి..
రెండోది ‘‘కోడికత్తి’’ కేసులో 4ఏళ్లుగా విచారణకు రాకుండా జగన్మోహన్ రెడ్డి కుంటిసాకులతో ఎగ్గొట్టడం వెనుక గుట్టుమట్లన్నీ బైటకొచ్చాయి. ఇందులో నిందితుడు జల్లేపల్లి శ్రీనివాస రావును కనీసం బెయిల్ పై బైటకు రానీకుండా నాలుగేళ్లుగా కేసును సాగదీయడం, కనీసం శ్రీను తల్లిదండ్రులను కలుసుకోడానికి కూడా సీఎం జగన్మోహన రెడ్డి తిరస్కరించడం, విచారణకు హాజరు కాకుండా కుంటిసాకులు చెప్పడం అమానవీయమే గాకుండా, అనేక అనుమానాలను ప్రజల్లో పెంచింది.
జగన్మోహన రెడ్డి అభిమానినైన తాను వైసిపికి 160సీట్లుపైగా రావడానికి, ఆయనపై సానుభూతి పెంచడం కోసమే కోడికత్తికి స్టెరిలైజ్ చేసి, అదేవిషయాన్ని ముందే చెప్పి మరీ వాడానని జల్లేపల్లి శ్రీను చెప్పడం గమనార్హం. ఈ కేసులో కోర్టు విచారణకు హాజరైతే ట్రాఫిక్ సమస్యలు వస్తాయని, సిఎం షెడ్యూల్ దెబ్బతింటుందని, సంక్షేమ పథకాల అమలుకు ఆటంకం ఏర్పడుతుందని జగన్మోహన రెడ్డి పేర్కొనడం లోగుట్టు రాష్ట్ర ప్రజలందరికీ ఎరుకే. ఏదోవిధంగా రాబోయే ఎలక్షన్స్ దాకా ఈ రెండు కేసుల్నిలాగే ఏమీ తేలకుండా నానబెట్టి, గతంలో చేసినట్లే మళ్లీ టిడిపిపైనే ఆరోపణలు చేసి ఎన్నికల్లో లాభాలు పొందే తాపత్రయంతో గత నాలుగేళ్లుగా చేయని కుట్రలేదు..
ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ మహానాడు దిగ్విజయం కావడం, ఇందులో చంద్రబాబు ప్రకటించిన టిడిపి ముందస్తు మేనిఫెస్టో ‘‘భవిష్యత్తుకు గ్యారంటీ’’ 6 వజ్రాలు సూపర్ సిక్స్ గా ప్రజల్లోకి బలంగా వెళ్లడం కొరుకుపడని అంశమైంది. ఈ ఏడాదే ‘‘శకపురుషుడు ఎన్టీఆర్ శతజయంతి’’ ఉత్సవాలు, తెలుగుదేశం 41వ ఆవిర్భావ వేడుకలతో టిడిపి శ్రేణులన్నింటిలో జోష్ పెరిగి కదనానికి కాలుదువ్వడం వైసిపికి ఆశనిపాతమే.
‘‘యువగళం’’ పాదయాత్ర 120రోజుల్లో 1550కిమీ పాదయాత్ర సీమలో ప్రభంజనమైంది. నారా లోకేశ్ ప్రకటించిన ‘‘రాయలసీమ డిక్లరేషన్’’ పై 4జిల్లాల్లో విస్తృత చర్చకు తెరదీసింది. వ్యవసాయం లాభసాటి చేస్తామని, నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తిచేస్తామని, ప్రతి ఎకరాకు సాగునీరు ఇస్తామని, వలసలు అరికడ్తామని, కంపెనీలను రప్పించి యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని, హార్టీకల్చర్ హబ్ గా రాయలసీమను మారుస్తామన్న లోకేశ్ డిక్లరేషన్ తో రాయలసీమ తెలుగుదేశంకు డిక్లేర్ అయినట్లే..
వైసిపి విధ్వంస పాలననుంచి ఆంధ్రప్రదేశ్ ను విముక్తం చేయడం కోసం ఎంతకైనా తెగిస్తానని, ఎవరితోనైనా పొత్తుపెట్టుకుంటామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటలు వైసిపి గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. వారాహి రథయాత్ర కింద వైసిపి రాక్షస పాలన అంతంకాక తప్పదనే భయాందోళనల్లో మునిగారు.
కర్ణుడి చావుకు కారణాలు కొల్లలన్నట్లుగా వైసిపి ప్రస్తుత పరిస్థితికి జగన్ స్వయం కృతాపరాధాలే కారణాలు..ఒక వర్గమని కాకుండా బిసి,ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీ అన్నివర్గాలపై వైసిపి దమనకాండ.. ఒక పార్టీ అని కాకుండా టిడిపి, జనసేన, కమ్యూనిస్టులు, బిజెపి, అన్ని విపక్షాలపైనా తప్పుడు కేసులు-అక్రమ నిర్బంధాలు, హింసా విధ్వంసాలతో జనం విసిగిపోయారు..
నాలుగేళ్ల క్రితం దేశంలో అగ్రస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ను ఇలా అధోగతి పాల్జేయడంపై మండిపడుతున్నారు.. ఎప్పుడెప్పుడీ మాఫియా మూకల అరాచక పాలనను భూస్థాపితం చేద్దామా, రాక్షసుల కబంధ హస్తాలనుంచి రాష్ట్రాన్ని విముక్తం చేద్దామా అని ఎదురెదురు చూస్తున్నారు.











