(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
ఆంధ్రా అయోధ్యగా, ఉత్తరాంధ్ర భద్రాద్రిగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన విజయనగరం జిల్లా రామతీర్థంలో కోదండరాముని శిరస్సును ఖండించడాన్ని స్థానికులు, హిందూ వాదులు, విపక్షాలు తీవ్రంగా ఖండిస్తుంటే .. బాధ్యులను గుర్తించి, చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోంది.. అంతేకాకుండా అధికార పార్టీ నాయకులు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తుండటం పట్ల స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబు పర్యటన దృష్ట్యా ముందస్తు అరెస్టులు
రామతీర్థం ఘటనను పరిశీలించేందుకు మరికొన్ని గంటల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విజయనగరం వస్తున్న దరిమిలా ఆ పార్టీ స్థానిక నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. రామతీర్ధం గ్రామానికి చెందిన వార్డు మెంబర్లు సూరిబాబు, రాంబాబును, మరో నలుగురు కార్యకర్తలను శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా నేరం అంగీకరించమని తమ వారిని హింసిస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తుండటంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. జిల్లా కేంద్రమైన విజయనగరంలోనూ పలువురు టీడీపీ నాయకులను ముందస్తు అరెస్టులు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నోటీసులు చూపించాలని నాయకులు డిమాండ్ చేస్తుండటంతో .. వారి ఇంటి వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. ఇంటి నుండి బయటకు వస్తే అరెస్టు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
విజయసాయిరెడ్డి రాక
చంద్రబాబు పర్యటన దృష్ట్యా ముందస్తుగా వైసీపీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి శనివారం ఉదయం 11గంటలకు రామతీర్థం రానున్నారు. అక్కడ సంఘటన స్థలాన్ని పరిశీలించనున్నారు. ఒకేరోజు చంద్రబాబు నాయుడు, విజయసాయిరెడ్డి గంటల వ్యవధిలో రామతీర్థం చేరుకోనున్నందున జిల్లాలో పరిస్థితి ఉత్కంఠతకు దారితీస్తోంది.