‘రంగు పడుద్ది’ అనే ఏదో సినిమాలో డైలాగ్ మాదిరిగానే సినిమా రంగం పరిస్థతి ఉంది. థియేటర్ లో బొమ్మ పడే విషయంలో అనేక సందేహాలు ఉన్నాయి. దీని మీద ఇప్పటికే సినిమా రంగంలో తర్జన భర్జనలు జరుగుతున్నాయి. కరోనా సంక్షోభం కారణంగా సినిమా రంగంలో 24 క్రాఫ్ట్ ల మీద ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చాలామంది ఉపాధి కోల్పోయారు. నిర్మాతల కష్టాలను వర్ణించడానికి మాటలు చాలవు. అదేంటి అంత డబ్బు ఉండే నిర్మాతలకు అంత పెద్ద కష్టం ఏమొస్తుంది? అని మీకు అనిపించవచ్చు. చేతినిండా డబ్బుండి నిర్మాతలు సినిమాలు తీస్తున్నారనుకోవడం పొరపాటు. సినిమా రంగాన్ని నడిపించేది ప్రధానంగా ఫైనాన్స్ రంగమే. అందులో చిక్కుకుని విలవిలలాడుతున్న నిర్మాతలు చాలమంది ఉన్నారు. నిర్మాత పచ్చగా ఉంటేనే సినిమా పది కాలాల పాటు వర్ధిల్లుతుంది. ఇక బొమ్మ పడుద్దా లేదా అనే విషయానికి వద్దాం.
50 శాతం సీటింగ్..
సినిమా రంగానికి ఈ రెండూ కొత్త పదాలే. సినిమా పుట్టాక 50 శాతం సీటింగ్ అనే మాట వినడం ఇదే తొలిసారి అవుతుంది. ఓ పక్క ఓటీటీ, ఇంకో ఏటీటీ.. ఇలాంటి పదాలతో థియేటర్ల వ్యవస్థ వణికిపోతోంది. సినిమా థియేటర్ నడుపుకోవడం కన్నా దాన్ని కళ్యాణ మండపాలుగా మర్చుకోవడం మేలేమోనన్న ఆలోచన ఒక దశలో ఎగ్జిబిటర్లకు వచ్చింది. అలా మారిన థియేటర్లు కూడా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు దాదాపు మూడు వేల థియేటర్లు ఉండేవి. ఆ సంఖ్య ఇప్పుడు కుదించుకుపోయింది. ఈ సంఖ్య దాదాపు సగానికి పడిపోయింది. వీటిలో మల్టీప్లెక్స్ లు ఓ 500 వరకూ ఉంటాయి. మల్టీప్లెక్స్ లు వచ్చాక సాధారణ థియేటర్లకు వెళ్లే జనాల సంఖ్య కూడా తగ్గిపోయింది. చాలావరకు థియేటర్లన్నీ లీజు ప్రాతిపాదిక మీదే నడుస్తున్నాయి. కార్పొరేట్ సంస్థల తాకిడి కూడా ఇందులో ఎక్కువైంది. చాలావరకు పెద్ద నిర్మాతల చేత్తుల్లో ఈ థియేటర్ల వ్యవస్థ ఉంది.
ఒకప్పుడు ఎగ్జిబిటర్లను, నిర్మాతలను విడమర్చి చూడాల్సి వచ్చేది. ఇప్పుడా పరిస్థితి లేదు. నిర్మాతలంటే ఆ నలుగురే. థియేటర్లను ప్రారంభించినా అసలే ఆర్థిక మాంద్యం పరిస్థితులు, కరోనా కారణంగా జనం ఎలా స్పందిస్తారో తెలియదు. 50 శాతం సీటింగ్ అన్నపుడు ప్రభుత్వ పరంగా ఎగ్జిబిటర్లకు ఎలాంటి రాయితీలు ప్రకటిస్తారన్నది ఇందులో మరో అంశం. ఈ రెండు మూడు రోజుల్లో అలాంటి డిమాండ్లు తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం వినోదపు పన్ను మినహాయింపు లాంటి అంశాలనూ పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. అలాగే విద్యుత్ రాయితీలను కూడా ఎగ్జిబిటర్లు ఆశించే అవకాశం ఉంది. సీటింగ్ తగ్గించినపుడు నిర్వహణ వ్యయం కూడా సగానికి సగం తగ్గడం న్యాయబద్దమైన అంశం. పైగా ప్రతిరోజూ శానిటైజేషన్ చేసుకోక తప్పదు. ఇదో అదనపు భారం.
ఎన్ని సినిమాలుగా రెడీగా ఉన్నాయి?
ఈ నెల 15 నుంచి బొమ్మ పడుతుంది సరే.. విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలెన్ని అనే ప్రశ్నకూడా ఉత్పన్నమవుతోంది. ఇప్పటికే కొన్ని సినిమాలు ఓటీటీలో విడుదలయ్యాయి. చాలా సినిమాల షూటింగులు ఆగిపోయాయి. సినిమాలు కొనడానికి బయ్యర్లు కూడా సిద్ధంగా లేరు. నిర్మాత రిస్క్ చేసుకుని సినిమా విడుదల చేసుకోవలసిందే. ఓటీటీలో ఇప్పటికే విడుదలైన సినిమాలను మళ్లీ థియేటర్లో విడుదల చేస్తే ఎలాంటి స్పందన ఉంటుందన్నది పెద్ద సందేహం. చూసిన సినిమా కోసం మళ్లీ థియేటర్ కు వస్తారా అనేది పెద్ద సందేహం.
ఇక రికార్డుల గురించి అసలే ఆలోచించ కూడదు. ఇప్పటికిప్పుడు రిలీజ్ చేయడానికి పెద్ద హీరోల సినిమాలు కూడా కనిపించడం లేదు. ఈ హీరోల షూటింగులు ఆగిపోయాయి. పైగా ఇవి ఎప్పటికి ప్రారంభమవుతాయో తెలియదు. ఇప్పటికిప్పుడు సినిమాలను థియేటర్లలో విడుదలచేయడానికి కొందరు నిర్మాతలు, పెద్ద హీరోలు అంగీకరించడం లేదన్న సమాచారం కూడా ఉంది. ఈ విషయంలో అందరూ సమావేశమై చర్చించుకుంటున్నారు. రెండు మూడు రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుంది.
20 శాతం పారితోషికాల్లో కోత
పారితోషికాల్లో కోత విధించాని తీసుకున్న నిర్ణయం పట్ల కూడా సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. అయితే దీని నియమ నిబంధనల్లో సడలింపులను కొందరు ఆశిస్తున్నారు. అయితే దీని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందరికీ ఒకే నిష్పత్తిలో తగ్గింపు సరికాదని అంటున్నారు. అవసరమైన పెద్ద హీరోలు నటులకు 50 శాతం కోత విధించినా తప్పులేదని, చిన్న నటుల విషయంలో 20 శాతం కోత సరిపోతుందనేది చాలామంది అభిప్రాయం. ఉన్న 24 క్రాఫ్ట్ లలో కొన్ని క్రాఫ్ట్ లకు ఇలా తగ్గించడం భావ్యం కాదంటున్నారు. ఇంకా ఈ తగ్గింపు అంశంపై కసరత్తు చేస్తే మంచిదనే అభిప్రయా వ్యక్తమవుతోంది. పారితోషికాల తగ్గింపు అంశంతోపాటు ఇతర భాషల నుంచి టెక్నిషియన్లను తెచ్చుకోవడం మీద వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇలాంటి తరుణంలోనైనా అది మనుకుంటే మంచిదంటున్నారు. పారితోషికాల విషయంలో పెద్ద హీరోలు గొంతువిప్పాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది.
నిండాముంచేస్తున్న వడ్డీ వ్యాపారులు
అప్పు తీసుకురాకుండా సినిమా తీయడం అనేది దాదాపు అసాధ్యం. ప్రస్తుత సంక్షోభానికి కూడా ఈ అప్పులే ప్రధాన కారణం. ఎప్పుడో రిలీజ్ కావలసిన సినిమా ఇప్పుడు రిలీజైతే పెద్ద మొత్తంలో అప్పులు తెచ్చిన నిర్మాతలు ఏంకావాలి. ఈ వడ్డీల భారం తట్టుకోలేక ఏదో ఒక విధంగా సినిమాను విడుదల చేసుకోవాలన్న ఆరాటం అందరిలోనూ కనిపిస్తోంది. దీనికి ఓటీటీలు, ఏటీటీలు నిర్మాతలతో బేరసారాలకు దిగుతున్నాయి. పరిస్థితులను ఆసరాగా తీసుకుని తక్కువ రేటుకే సినిమాలు తీసుకోవాలని చూస్తున్నాయి. చాలామంది రాజకీయ నాయకులు తమ బినామీల ద్వారా సినిమా రంగంలో తమ డబ్బును వడ్డీలకు తిప్పుతుంటారు. అప్పుల ఊబిలో కూరుకుపోయి దెబ్బతిన్న పెద్ద నిర్మాతలు చాలామందే ఉన్నారు. తాజాగా ఓ సినిమా ఫైనాన్స్ వివాదం పోలీస్ స్టేషన్ దాకా వెళ్లింది. ఒకే సినిమాని రెండు పేర్లతో విడుదల చేయడానికి ఈ నిర్మాతలు సిద్ధపడి కొట్లాడుకుంటున్నారు. ఈ పరిణామాలన్నిటీని బట్టి చూస్తుంటే ఈ నెల 15 నుంచైనా థియేటర్లలో బొమ్మ పడుతుందా లేదా? అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీని మీద ఇంకా ఎవరికీ సరైన అవగాహన ఏర్పడలేదన్నది మాత్రం సుస్పష్టం.











