కడప జిల్లా.. గడిచిన వైసీపీ పాలనలో ఇక్కడ ప్రత్యేక పాలన నడిచింది. అధికారం అండ చూసుకుని వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా చెలరేగిపోయారు. ప్రభుత్వ చట్టాలు, నిబంధనలు వంటివేమీ పట్టలేదు. ఐదేళ్లూ వైసీపీ ముఠా చెప్పిందే ఈ జిల్లాలో వేదం. దీంతో ఆ పార్టీ నేతల అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండాపోయింది. పెద్ద ఎత్తున భూకబ్జాలకు పాల్పడ్డారు. వేల ఎకరాల ప్రభుత్వ, అటవీ, అసైన్డ్ భూములను చెరబట్టారు. అధికారులను మభ్యపెట్టి, భయపెట్టి, ప్రలోభపెట్టి తమ పేరిట రిజిస్ట్రేషన్లు చేయించేసుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో చక్రం తిప్పిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి,ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి లాంటి నేతలు ప్రభుత్వ భూములను ఆక్రమించి ఎస్టేట్లు నిర్మించుకున్నారు. బినామీలను ముందుపెట్టి కబ్జాల పర్వం కొనసాగించారు. కొందరు వైసీపీ నాయకులు చెరువులను, శ్మశానాల్నీ కూడా వదల్లేదు. వైసీపీ అధికారంలో ఉండడంతో అధికారులెవరూ అటువైపు కన్నెత్తి చూడలేదు. ఐతే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఉమ్మడి కడప జిల్లాలో వైకాపా నాయకుల అక్రమాల పుట్టలు ఒక్కొక్కటిగా పగులుతున్నాయి. ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ, అసైన్డ్ భూముల్ని జిల్లా అధికార యంత్రాంగం ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకుంటోంది.
మేడా రఘునాథ రెడ్డి కబ్జాల పర్వం –
వైసీపీ రాజ్యసభ సభ్యుడు, గుత్తేదారు మేడా రఘునాథరెడ్డి అసైన్డ్, ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసి తన పేరు మీదా, కుటుంబసభ్యులు, బినామీల పేర్లు మీదా రాయించుకోవడంలో దిట్ట. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయన ప్రభుత్వ భూముల్ని ఆక్రమించేశారు. ధనవంతులైన తన కుటుంబసభ్యుల్ని పేదలుగా చూపించి వాటికి పట్టాలిప్పించుకున్నారు. ఇలా వందల ఎకరాల భూముల్ని ఆక్రమించుకున్నారని మేడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రఘునాథరెడ్డి అన్నమయ్య జిల్లా నందలూరు మండలం చింతలకుంట గ్రామంలో అసైన్డ్ భూముల్ని సొంతం చేసుకుని వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రీహోల్డ్ విధానంలో యాజమాన్య హక్కులు పొందారు. చింతలకుంట రెవెన్యూ గ్రామంలో సర్వే నంబరు 2-C కింద 2 ఎకరాలు, 2-Aలో 3, 2-B కింద 2.5, 4/5 కింద 0.54 ఎకరాలు ఇలా సొంతం చేసుకున్నారు. వీటిని అక్రమంగా కైవసం చేసుకున్నారని గుర్తించిన రెవెన్యూశాఖ తాజాగా నోటీసులు జారీ చేసింది.
రఘునాథరెడ్డి నందలూరు మండలం లేబాకలో కుటుంబసభ్యుల పేరిట 109 ఎకరాల వరకు కాజేశారన్న అభియోగాలపై రెవెన్యూ శాఖ నోటీసులిచ్చింది. చెన్నయ్యగారిపల్లె, ఈడిగపల్లె, ఎర్రచెరువుపల్లి, చింతలకుంట, టంగుటూరు, నాగిరెడ్డిపల్లె, గట్టుమీదపల్లె, నందలూరు, మదనమోహనపురం, పాచికాలువకుంట, శేషాగారిపల్లె, టీవీ రాచపల్లె, టీవీపురంలో మేడా కుటుంబసభ్యులతో పాటు వైకాపాకు చెందిన ఇతర నేతలు వందలాది ఎకరాలు కబ్జా చేశారన్న ఆరోపణలున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక వీటిపై నందలూరు ప్రజలు ప్రతి సోమవారం కలెక్టరేట్కు వచ్చి ఫిర్యాదులు చేస్తుండటంతో కలెక్టర్ శ్రీధర్ విచారణకు ఆదేశించారు.
అన్నమయ్య జిల్లా వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్న మేడా విజయశేఖర్రెడ్డి..రఘునాథరెడ్డికి సమీప బంధువు. అత్యంత ధనవంతుడు. ఆయన కూడా లేబాకలో సర్వే నంబరు 1242/2లో 2.37 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి, వైసీపీ హయాంలో ఫ్రీహోల్డ్ కింద యాజమాన్య హక్కులు సంపాదించుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయనకూ రెవెన్యూశాఖ నోటీసులిచ్చింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు, మాజీ సీఎం జగన్, ఎంపీ అవినాష్రెడ్డిలకు సన్నిహితుడైన దేవిరెడ్డి శివశంకర్రెడ్డి కుటుంబం పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలం దొండ్లవాగులో 30 ఎకరాల ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసింది. ఇదే ప్రాంతంలో మరో 23.15 ఎకరాల ప్రభుత్వ భూమిని బినామీ పేర్లతో వెబ్ల్యాండ్లోకి ఎక్కించారు. దాన్ని ఆక్రమించిందీ దేవిరెడ్డి మనుషులేనన్న ఆరోపణలున్నాయి.
బ్రహ్మంగారిమఠంలో వైసీపీ నేతల ఆక్రమణలు
మైదుకూరు నియోజకవర్గంలోని బ్రహ్మంగారిమఠం మండలం డి.అగ్రహారంలో 81.69 ఎకరాల భూముల్ని స్థానిక వైసీపీ నాయకులు ఆక్రమించినట్టు అధికారులు గుర్తించారు. ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కొందరు స్థానిక నాయకుల హస్తం కూడా ఇందులో ఉన్నట్టు నిగ్గుతేల్చారు. బ్రహ్మంగారిమఠంలో శ్మశానవాటికనూ వైసీపీ నేతలు వదిలిపెట్టలేదు. సర్వే నంబరు 464లో 10.05 ఎకరాల భూమిలో శ్మశానవాటిక ఉంది. వైసీపీ నేతలు దీనిలో 6 ఎకరాలు కొట్టేసి సాగు చేసుకుంటున్నారు. – బ్రహ్మంగారిమఠం మండలంలోని ఎగువ నెల్లటూరు రెవెన్యూ గ్రామ సర్వే నంబరు 288లోని 2,682 ఎకరాల ప్రభుత్వ భూమికి ఎసరు పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. బ్రహ్మంగారిమఠం మండలంలోని 40 మంది వైసీపీ నేతలు కలిసి రూ.150 కోట్ల విలువైన భూమి కాజేయడానికి ప్రణాళిక వేశారు. విద్యుత్ శాఖ అధికారుల్ని లోబరుచుకున్నారు. ఆక్రమించుకున్న భూముల్ని పట్టా భూములుగా చూపించి, వ్యవసాయ విద్యుత్ సర్వీసులు తీసుకున్నారు. వెంటనే ఆ భూముల్లో 21 బోరు బావులు తవ్వేశారు. వాటిలో ఐదింటికి SPDCL ట్రాన్స్ఫార్మర్లు కూడా ఏర్పాటు చేసింది. మిగతా వాటికి స్తంభాలు, విద్యుత్ లైన్ల పనులు ముమ్మరంగా చేశారు.
అనాథల కోసం రాజారెడ్డి స్థాపించిన డాడీహోంకి జమ్మలమడుగు మండలం మైలవరం వద్ద 20 ఏళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 52 ఎకరాల భూమిపై పులివెందులకు చెందిన వైసీపీ కీలక నేత ఒకరు కన్నేశారు. ప్రస్తుతం ఆ భూమి విలువ సుమారు రూ.50 కోట్లు. డాడీహోం నిర్వాహకుడు రాజారెడ్డిని 2023 ఆగస్టులో ఆయన సోదరుడు, మరదలు హత్య చేశారు. ఈ భూమితో పాటు, ప్రొద్దుటూరులో రాజారెడ్డి స్థాపించిన ఇంటర్నేషనల్ స్కూల్ను కొట్టేయడానికే ఆయనను హత్య చేశారన్న ఆరోపణలున్నాయి. ఆస్తులు కొట్టేసే కుట్రలో పులివెందుల కీలక నేత హస్తం ఉందన్న ఆరోపణలున్నాయి. రాజారెడ్డి స్థాపించిన ట్రస్ట్లో తనకు అనుకూలమైన వ్యక్తిని నియమించుకుని భూములు కాజేసేందుకు ఆ నేత ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో జిల్లా యంత్రాంగం ఆ భూములు స్వాధీనం చేసుకుంది.
కడపలో రూ.200 కోట్ల భూ కబ్జా
కడపకు సమీపంలోని కర్నూలు- చిత్తూరు జాతీయ రహదారి పక్కనే 18.5 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీన్ని ఓ వ్యక్తి ఆక్రమించి లేఅవుట్ వేసి విక్రయించేయడం వైసీపీ హయాంలో జరిగిన భూకబ్జాలకు పరాకాష్ఠ. ఆ భూమి విలువ రూ.200 కోట్లు. ఆ వ్యక్తి జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే, గత ప్రభుత్వ పెద్దల సమీప బంధువుకు బినామీ అన్న ఆరోపణలున్నాయి. కడప నగరంలో మొత్తం 66 సర్వే నంబర్లలోని 319 ఎకరాల్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని, 203 సర్వే నంబర్లలోని 537 ఎకరాల్ని ఆక్రమించి లేఅవుట్లు వేశారని, మరో ఏడు సర్వే నంబర్లలోని 3.86 ఎకరాల్ని ఆక్రమించేశారని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.
ఎస్సీలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు 1985-86లో ఎన్టీఆర్ ప్రభుత్వం పులివెందులలో 12.36 ఎకరాల భూమిని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసింది. కడప నుంచి పులివెందుల పట్టణంలోకి అడుగుపెట్టే ప్రాంతంలో ఉన్న ఆ భూముల్ని కొంత మంది వైసీపీ నేతలు ఆక్రమించుకుని ఇళ్ల నిర్మాణం చేపట్టారు.
సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుటుంబసభ్యులు 53 ఎకరాల అటవీ భూములు, పేదలకు చెందిన పదెకరాల ఎసైన్డ్ భూముల్ని ఆక్రమించేశారు. సీకే దిన్నె మండలం సుగాలిబిడికి వద్ద 146 ఎకరాల ఎస్టేట్లో ఈ 63 ఎకరాల్ని కలిపేసుకున్నారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో కడప ఆర్డీవో జాన్ ఇర్విన్, బద్వేలు సబ్ డీఎఫ్ఓ స్వామి వివేకానంద, సర్వే, ల్యాండ్ రికార్డుల విభాగం ఏడీ మురళీకృష్ణలతో ఏర్పాటైన త్రిసభ్య కమిటీ సర్వే చేసి ఆక్రమణల్ని నిగ్గు తేల్చింది. జిల్లా యంత్రాంగం ఇటీవలే ఆ భూముల్ని స్వాధీనం చేసుకుంది. అయినా సజ్జల కుటుంబసభ్యులు రుబాబు మానలేదు. ఆక్రమించిన భూములు సహా మొత్తం ఎస్టేట్కు ఉన్న గేట్కు తాళం వేసేసి, ఎవరూ లోపలికి రాకుండా అడ్డుకుంటున్నారు.
వైసీపీ ఎమ్మెల్సీ గోవింద్రెడ్డి బావమరిది, బద్వేలు నియోజవర్గ వైసీపీ సమన్వయకర్త ఎన్.విశ్వనాథరెడ్డి, ఆయన అనుచరులు శంఖవరం రెవెన్యూ పరిధిలోని చింతపల్లె గ్రామ సమీపంలో 188.92 ఎకరాల ప్రభుత్వ భూముల్ని ఆక్రమించారు. అందులో విశ్వనాథరెడ్డి ఒక్కరే 114.78 ఎకరాలు ఆక్రమించి ఎస్టేట్ నిర్మించుకున్నట్టు బయటపడింది. ఆ భూముల్లో సాగు చేస్తూ, భారీ పశువులపాక నిర్మించారు. ఆయన నివాసం కూడా అక్కడే.
విశ్వనాథరెడ్డి అనుచరులు జగన్మోహన్రెడ్డి 22.61 ఎకరాలు, ఆంజనేయప్రసాద్ 24.39 ఎకరాలు, వావిళ్ల రమణయ్య 27.14 ఎకరాలు కబ్జా చేశారు. బద్వేలు ఆర్డీవో చంద్రమోహన్ డ్రోన్ సాయంతో సర్వే చేయించగా ఈ బండారం బయటపడింది.
ఆకేపాటి అరాచకాలు అన్నీ ఇన్నీ కాదు!
వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి వందల ఎకరాల ప్రభుత్వ, పేదల భూముల్ని ఆక్రమించినట్టుగా ఆరోపణలున్నాయి. వాటితో సంతృప్తి చెందని ఆయన ఏకంగా ఏడుకొండల వెంకన్నకే శఠగోపం పెట్టారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం ఆకేపాడులో చమర్తి పిచ్చిరాజు, పద్మరాజు చిన్నంరాజులకు సర్వే నంబరు 56/1లో ఉన్న 5 ఎకరాల భూమిని రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల సహకారంతో ఆకేపాటి తన పేరిట రాయించేసుకున్నారు. ఇందులో 1.50 ఎకరాల భూమిని TTD పేరిట 2021 మే 6న రిజిస్ట్రేషన్ చేశారు. తర్వాత దేవస్థానం నిధులతో అందులో కల్యాణ మండపం కట్టించేలా చక్రం తిప్పారు. నిర్మాణం పూర్తి కాగానే మొత్తం ఐదెకరాల భూమిని తన భార్య ఆకేపాటి జ్యోతి పేరిట 2023 మే 6న రిజిస్ట్రేషన్ చేయించారు. దీంతో TTDకి రాసిన 1.5 ఎకరాల భూమితోపాటు అందులోని కల్యాణ మండపం కూడా ఎమ్మెల్యే భార్య ఖాతాలో చేరిపోయింది. తితిదే ఆ స్థలాన్ని మ్యుటేషన్ చేయించుకోవడానికి రాగా రెవెన్యూ శాఖ తిరస్కరించింది. మందపల్లె, శ్రీరంగరాజపురం, శేషమాంబపురం గ్రామాల్లో వందల ఎకరాలు ఆకేపాటి కుటుంబం చేతుల్లో ఉన్నట్టు ఆరోపణలున్నాయి. వాటిలో 39.58 ఎకరాల రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం రద్దు చేసింది.
తాపీ మేస్త్రిగా మొదలై..రూ.100 కోట్లు
బద్వేలు పురపాలక సంఘం వైస్ ఛైర్మన్, వైసీపీ నేత గోపాలస్వామి ఒకప్పుడు తాపీ మేస్త్రి. వైసీపీ హయాంలో అక్రమాలకు పాల్పడి, దళితుల భూములు ఆక్రమించి ఇప్పుడు రూ.100 కోట్లకు పడగలెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయనతో పాటు భార్య లక్ష్మమ్మ, తమ్ముడు కృష్ణయ్య, డ్రైవర్ లక్ష్మీనారాయణ కూడా జైలు పాలయ్యారు. ఎస్సీ, ఎస్టీ కేసుతోపాటు పలు సెక్షన్ల కింద గోపాలస్వామి అరెస్టయ్యారు.
చెన్నంపల్లె రెవెన్యూ గ్రామ సర్వే నంబరు 1755/1లో సుధాకర్ అనే దళితుడికి ఉన్న రూ.5 కోట్లు విలువ చేసే ఎకరా భూమిని నకిలీ పత్రాలతో గోపాలస్వామి సొంతం చేసుకుని ఇతరులకు అమ్మకానికి పెట్టారు. రూ.20 కోట్ల విలువైన మరో భూ ఆక్రమణ కేసు కూడా ఆయనపై ఉంది. బద్వేలులో గోపాలస్వామి సాగించిన భూ కబ్జాల్లో జడ్పీటీసీ సభ్యుడికి కూడా భాగస్వామ్యం ఉన్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది.
150 ఎకరాల చెరువును మింగేసిన వైసీపీ నేతలు
బద్వేలు నియోజకవర్గం కాశినాయన మండలం కొండ్రాజుపల్లె చెరువుకు నీటి సంఘం అధ్యక్షుడిగా టీడీపీకి చెందిన రమణయ్య ఎన్నికవడాన్ని జీర్ణించుకోలేని నలుగురు వైసీపీ నేతలు ఏకంగా 150 ఎకరాల చెరువును ఆక్రమించేసి, పంటల సాగు చేపట్టారు. అసలు చెరువే లేనప్పుడు పదవిని ఎలా అనుభవిస్తావంటూ సవాల్ చేశారు. ఈ వ్యవహారాన్ని రమణయ్య జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాలతో రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టి, ఆక్రమణల్ని తొలగించారు. భవిష్యత్తులో ఆక్రమణలు జరగకుండా చెరువుకు సరిహద్దులు నిర్ణయించి చుట్టూ ట్రెంచ్ తవ్వారు.











