వరంగల్-ఖమ్మం-నల్గొండ, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్ట భద్రుల నియోజకవర్గాల ఎన్నికల జోష్ మొదలైంది. ఈ ఎన్నిక ప్రచార కార్యక్రమంలో మిగతా పార్టీల కంటే అధికార పార్టీ కాస్త ముందుంది. పట్టభద్రుల ఎన్నికల నేపథ్యంలో సన్నాహక సదస్సులు, ఆత్మీయ సమావేశాలతో కారు జెట్ స్పీడుతో దూసుకుపోతోంది. ఈ రెండూ నియోజకవర్గాల్లో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశాల్లో పాల్గొని, గులాబీ శ్రేణులకు వారు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో పర్యటనలు కూడా మొదలుపెట్టేశారు. ప్రభుత్వం చేపట్టిన అభవృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అందరికీ వివరించేలా పార్టీ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నది. అలాగే పట్టభద్రుల ఓటు నమోదును కూడా ఆయా గ్రామాల నాయకులు బాధ్యతలు తీసుకొని దగ్గరుండి ఓటు నమోదు చేసే కార్యక్రమాలను చేపట్టాలని సూచిస్తున్నారు. గతంలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్, మున్సిపల్ ఎన్నికల్లో లాగే ఎమ్మెల్సీ ఎన్నికల పోరులోనూ విజయానికి అందరూ పాటుపడాలని జిల్లా నాయకులు మంత్రులు, ఎమ్మెల్యేలు సూచిస్తున్నారు.
క్యాడర్ కు మంత్రులు దిశానిర్ధేశం…
పట్టభద్రుల ఎన్నికల బాధ్యతలను ఆయా జిల్లాల మంత్రులకు గులాబీ బాస్ అప్పగించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయా జిల్లాల మంత్రులు ఎన్నికల సన్నాహాక సమావేశాలు, సదస్సల్లో పాల్గొని క్యాడర్ కు దిశానిర్ధేశం చేస్తున్నారు. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఆదివారం తమ తమ జిల్లాల్లో మంత్రులు విస్తృత పర్యటనలు సాగించారు. ఖమ్మం రూరల్ నాయుడుపేట మండలంలో ఎంఎల్సి బాలసాని లక్ష్మీనారాయణ, నియోజకవర్గ నాయకులతో ఏర్పాటు చేసిన సన్నాహాక సమావవేశానికి మంత్రి అజయ్ కుమార్ హాజరయ్యారు. అలాగే ఇల్లందులో కూడా పర్యటించి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నిక్లల్లో టిఆర్ఎస్ విజయం సాధించేందుకు కృషి చేయాలని పార్టీ నాయకులకు సూచించారు. మంత్రి జగదీశ్ రెడ్డి కూడా తుంగతుర్తి నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గాదరి కిషోర్ నివాసంలో ముఖ్యమైన నాయకులతో కలిసి సన్నాహక సమావేశం ఏర్పుటు చేశారు. టిఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తమ నియోజక వర్గంలోని ఓట్లన్నీ టిఆర్ఎస్ కే పడేలా పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని మంత్రులు సూచించారు.
అలాగే మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఆధ్వర్యంలో మిర్యాలగూడలో నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో రాబోవు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేసే ప్రక్రియను టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉధృతంగా చేపట్టాలని పార్టీ ముఖ్య కార్యకర్తలకు దిశానిర్ధేశం చేయడం జరిగింది. అలాగే వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లోనూ నేతలు సమావేశాలను నిర్వహించి క్యాడర్ ను ఎన్నికలకు సమాయత్తం చేసే పనిలో పడ్డారు.