వైఎస్ జగన్ సర్కారు ఏది చేసినా రివర్స్ అవుతుందా.. రివర్స్ టెండరింగ్లోనూ రివర్స్ తప్పదా.. అవుననే అనిపిస్తోంది. ప్రభుత్వ సొమ్ము ఆదా చేసే పేరుతో చేస్తున్న రివర్స్ టెండరింగ్ విధానం అమల్లోకి తెచ్చి..ఇదిగో ఇంత మిగిల్చామని చెప్పింది జగన్ సర్కారు. తరువాత ఆ మిగులు దక్కకపోగా.. రాష్ట్ర ప్రభుత్వంపైనే మరింత భారం పడింది. తాజాగా పోలవరంలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. పోలవరం ప్రాజెక్టు విషయంలో అంచనాల పెంచడమే కాదు..అదనపు పనుల కోసం కూడా ఆగమేఘాల మీద టెండర్లు పిలిచింది సర్కారు. ఈ పరిణామాల నేపథ్యంలో రానున్న కాలంలో కేంద్రం నుంచి ఈ ప్రాజెక్టుకు నిధులు అందే అవకాశం మరింత తగ్గుతుందని చెప్పవచ్చు. వెరసి రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా రూ.16వేల కోట్ల భారం పడనుందనే అంచనాలూ కూడా ఉన్నాయి.

అంచనా పెంచి..
గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అంచనాలు ఎక్కువగా రూపొందించారని చెబుతూ జగన్ సర్కారు రివర్స్ టెండరింగ్ విధానాన్ని తెరపైకి తెచ్చింది. అప్పట్లో చాలా ఆరోపణలూ చేసిన ప్రతిపక్ష వైసీపీ, అధికారంలోకి వచ్చాక కూడా కేంద్రానికి లేఖలు కూడా రాసింది. అయితే ఈ విషయంలో జగన్ సర్కారుకు ఇప్పటికే కేంద్రం షాక్ ఇచ్చింది. మీరు గతంలో చెప్పిన ప్రకారమే అన్నే నిధులు ఇచ్చామనే కోణంలో షాక్ ఇచ్చింది. అదే సమయంలో కేంద్రం అనుమతి లేకుండానే కొన్ని పనుల్లో మార్పులు చేర్పులు చేయడంతో కనీన నిధులు ఇచ్చేందుకు కూడా కేంద్రం సుముఖంగా లేదని తెలుస్తోంది. నిబంధనల్లో మార్పులు రాష్ట్ర ప్రభుత్వానికి నచ్చినట్లు మార్చుకోవడం, కాంట్రాక్టర్ల విషయంలో అనుసరిస్తున్న విధానం, పీపీఏలు తదితర అంశాలు కూడా ఇందుకు కారణంగా కనిపిస్తున్నాయి. ఇక తాజాగా ఏపీ సర్కారు పోలవరం అంచనాలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పోలవరం ప్రధాన డ్యాం విలువతో పాటు ఒప్పందంలో లేని పనులకు ఆమోదం తెలిపింది. ఒక్కరోజులో ఈ పెంపు మొత్తం రూ.2,569.61కోట్లుగా ఉండగా ఒప్పదంలో లేని పనులు రూ.653కోట్లకు కూడా ఆమోదం తెలిపింది. అంతేకాదు.. ఈ నిధులు కూడా గుత్తేదారుకు లబ్ధిచేకూర్చేలా మంజూరు చేశారనే ఆరోపణలూ వచ్చాయి. .
పచ్చి మోసం..ఆపై జాప్యం..
గతంలో పోలవరం ప్రధాన డ్యామ్ పనులను ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ, రష్యా కంపెనీ సంయుక్త సహకారంతో చేపట్టాయి. అయితే ఆ సంస్థ పనుల నుంచి తప్పుకోవడంతో నవయుగ సంస్థ చేపట్టింది. ట్రాన్స్ ట్రాయ్ నుంచి నవయుగ వరకు ఉన్న అంచనాలు రూ. 5784.15 కోట్లు కాగా..ఇప్పుడు ఆ అంచనాలను రూ. 7192కోట్లు పెంచారు. గతంలో రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వం దాదాపు 780కోట్లు ఆదా అయిందని చెప్పినా..తాజాగా అదనపు పనులు, స్పిల్ వే, పైలట్ ఛానెల్, టేల్ రేస్ ఛానెల్, అప్రోచ్ కెనాల్ తో పాటు ఒప్పందం లేని పనులు విలువ కలిపితే దాదాపు 3వేల కోట్లు భారం పడిందని చెప్పవచ్చు. ఇక్కడ పలు ప్రశ్నలు వస్తున్నాయి. గతంలో రివర్స్ టెండరింగ్ లో నిధులు ఆదా చేశామన్న ప్రభుత్వం ఇప్పుడు అంచనాలు ఎందుకు పెంచిందనే సందేహాలు కూడా ఉన్నాయి. ఇక్కడే మరో లాజిక్ కూడా ఉంది. ఈ పెంపు ఉత్తర్వులు అంతా కేంద్ర జలమండలి ఆమోదానికి లోబడి ఉంటాయని చెప్పారు. అంటే ప్రస్తుతానికి కేంద్ర జలమండలి ఆమోదం లేదని స్పష్టం అవుతోంది. ప్రతిపాదనల దశలోనే అనుమతులు తీసుకుంటేనే కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. అయినా ఏపీ సర్కారు ముందు నిధులు కేటాయించేసి తరవాత కేంద్రం ఆమోదం కోసం పంపడం వెనుక లాజిక్ ఏంటనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
పన్నుల చెల్లింపూ ప్రభుత్వానిదే..
కాగా రివర్స్ టెండర్ల ద్వారా కేవలం హెడ్ వర్క్ను నవయుగ నుంచి వెనక్కి తీసుకున్న సర్కారు..మిగిలిన పనులను మేఘా కంపెనీకి ఇచ్చింది. రూ.1,771.44 కోట్లకు రివర్స్ టెండర్ జరపగా మేఘా ఇంజినీరింగ్ రూ.1,548 కోట్లకు పనులు దక్కించుకుంది. అంటే రూ.223.44 కోట్లు మిగిలాయి. అయితే తరువాత మరికొన్ని నిర్ణయాలూ జరిగాయి. ఇసుక పాలసీలో వచ్చిన మార్పులు, పన్నుల చెల్లింపుల్లో భాగంగా మెట్రిక్ టన్నుకు రూ.375 చెల్లించాలని, ఇందుకు జీఎస్టీతోపాటు ఇతర పన్నులు మొత్తం కలిపి మరో రూ.500కోట్లు అవుతుందని సదరు కంపెనీ ప్రభుత్వానికి విన్నవించడం, ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు కూడా తెలుస్తోంది.
మొత్తం మీద రివర్స్ టెండరింగ్లో మిగిలాయని చెబుతున్న రూ.223.44కోట్లకు అదనంగా రూ.276కోట్ల భారం రాష్ట్రంపై పడింది.
రూ.7,192.02 కోట్లకు పెరిగిన అంచనా వ్యయం
ఇక ప్రధాన డ్యామ్తో పాటు ఇతర నిర్మాణాల కోసం రూ.5,535.41 కోట్లుగా ఉన్న అంచనా వ్యయాన్ని రూ.7,192.02 కోట్లకు పెంచడంతో పాటు గోదావరిలో వరద ఉధృతి కారణంగా డయాఫ్రం వాల్ దెబ్బతిందని, ఇందుకు మరమ్మతులకు ఖర్చు అవుతుందని, ఆ మరమ్మతు చేయాలంటే నీటిని పూర్తిగా తోడేయాలని, అందుకు మరో ఎత్తిపోతల ద్వారా కరవు పీడిత ప్రాంతాలకు నీరు ఇచ్చేందుకు రూ.912కోట్లు అవుతుందని తేల్చారు. అంటే మొత్తం మీద అదనపు పనులు, అంచనా వ్యయం పెంపు, మరో ఎత్తిపోతల వెరసి.. రూ.3,222 కోట్ల భారం పడింది. ఈ పనుల విషయంలోనే రివర్స్ టెండర్లో మిగిలిందంటున్న రూ.233.44 కోట్లు కాగా కొత్త అదనపు భారం రూ. 2988కోట్లు. మార్పులు, చేర్పులు, రివర్స్ టెండర్లు పనుల్లో జాప్యం బోనస్ అని చెప్పవచ్చు. ఇక ఈ ప్రాజెక్టుకు నిధులు ఇంకా ఇచ్చేది లేదని కేంద్రం తేల్చేయడం, నిబంధనల్లో మార్పులు చేసే సమయంలో జలశక్తి శాఖ మార్గదర్శకాలు పాటించకపోవడంతో అదనంగా మరో రూ.13వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే మొత్తం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.780 కోట్లు ఆదా కాగా రూ.16వేల కోట్ల భారం ఏపీ నెత్తిన పడింది. మొత్తం మీద రివర్స్ టెండర్ల విషయంలో మొత్తం రివర్స్ అయిందని చెప్పాల్సి ఉంటుంది.











