స్ధానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డకు, సీఎం జగన్మోహన్ రెడ్డి మధ్య వార్ కొనసాగుతోంది. ఈ ఏడాది మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు అప్పట్లో నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తైంది. పక్షం రోజుల్లో ఎన్నికలు ఉన్నాయనగా కరోనా వైరస్ ప్రభావంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ ఎన్నికలను వాయిదా వేశారు. ప్రభుత్వాన్ని ఏ మాత్రం సంప్రదించకుండా నిమ్మగడ్డ నిర్ణయం తీసుకున్నారని సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. గవర్నర్ కు కూడా ఫిర్యాదు చేశారు.
నిమ్మగడ్డను తొలగించి కనగరాజును నియమించారు. దీంతో నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. తిరిగి నిమ్మగడ్డను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించారు. తాజాగా స్ధానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ హైకోర్టులో దాఖలైన కేసుపై, ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కరోనా కారణంగా ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ఏజీ హైకోర్టుకు విన్నవించారు. ధర్మాసనం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు నోటీసులు జారీ చేసింది. ఎన్నికలు నిర్వహించలేకపోవడానికి కారణం తెలపాలని కోరింది. దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని కోర్టు గుర్తుచేసింది. దీనిపై నిమ్మగడ్డ స్పందించాల్సి ఉంది.
స్ధానిక సంస్థలకు ఈ ఏడాది ఎన్నికలు నిర్వహిస్తారా?
కరోనా కారణంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్ధానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేశారు. రాష్ట్రంలో కరోనా ఉదృతి మొదలు కాకముందే జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు. నేడు రాష్ట్రంలో రోజూ 6 వేల కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి సమయంలో ఎన్నికలు నిర్వహించే సాహసం చేయకపోవచ్చు. ప్రభుత్వం కూడా వచ్చే సంవత్సరం మార్చి వరకూ వాయిదా వేస్తే నిమ్మగడ్డ పదవీకాలం ముగుస్తుందని వేచి చూస్తోంది. ఈ లోపుగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్దానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రయత్నించినా ప్రభుత్వ యంత్రాంగం సహకరిస్తుందా లేదా? అనేది తేలాల్సి ఉంది.
పదవీ విరమణలోపే స్ధానిక సంస్థలకు ఎన్నికలు
వచ్చే ఏడాది మార్చిలో నిమ్మగడ్డ పదవికాలం ముగుస్తుంది. ఈ లోగా స్ధానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భావిస్తున్నారట. ఈ ఏడాది చివర్లో నోటిఫికేషన్ విడుదల చేసి వచ్చే ఏడాది జనవరిలో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తారని తెలుస్తోంది. అయితే ఇందుకు ప్రభుత్వం సిద్దంగా లేదనే చెప్పాలి. నిమ్మగడ్డ కమిషనర్ గా ఉండగా ఎన్నికలు నిర్వహించడం ప్రభుత్వానికి ఇష్టం లేనట్టుగా తెలుస్తోంది. అందుకే హైకోర్టులో కరోనా కారణంగా ఎన్నికలు నిర్వహించలేమని తేల్చి చెప్పారు.
ఏకగ్రీవాలు ఉన్నట్టా? లేనట్టా?
స్ధానిక సంస్థలకు గత ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల ప్రకియ పూర్తైంది. చాలా చోట్ల సింగిల్ నామినేషన్ రావడంతో, ఏకగ్రీవాలుగా ప్రకటించాల్సి ఉంది. అయితే నోటిఫికేషన్ 6 నెలలు మించి ఉనికిలో ఉండదని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరలా తాజాగా నోటిఫికేషన్ వచ్చాక గతంలో ఏకగ్రీవాలకు కూడా ఎన్నికలు ఉంటాయని తెలుస్తోంది. ఈ విషయం ప్రభుత్వానికి మింగుడు పడటం లేదు. ఈ వ్యవహారంలో సీఎం జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ మధ్య వార్ మరికొంత కాలం కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి.











