గన్నవరం రాజకీయాలే కాదు, గన్నవరం విమానాశ్రయ భూముల వ్యవహారం కూడా రచ్చకెక్కింది.
(విజయవాడ నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
నాలుగేళ్ల కిందట గన్నవరం విమానాశ్రయం విస్తరణ కోసం 800 ఎకరాల భూములు సేకరించారు. సేకరించిన భూముల్లో సినీనటుడు కృష్ణరాజుకు చెందిన 31 ఎకరాల తోట కూడా ఉంది. నిర్మాత అశ్వనీదత్ కు చెందిన 39 ఎకరాలు కూడా ఉన్నాయి. గన్నవరం విమానాశ్రయానికి భూములు ఇచ్చిన రైతులకు అమరావతి రాజధాని ప్యాకేజీ ల్యాండ్ పూలింగ్ తరహాలో పరిహారం చెల్లిస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ ప్రకారం.. అమరావతిలో రాజధాని నగరాన్ని అభివృద్ధి చేసిన తర్వాత.. గన్నవరంలో భూములిచ్చిన ఒక్కొక్కరికి ఎకరాకు 25 సెంట్ల వంతున నేల ఇవ్వాలి.
దీంతో గన్నవరం సమీప గ్రామాల రైతులు 800 ఎకరాల భూమిని విమానాశ్రయం విస్తరణకు ఇచ్చారు. అమరావతి రాజధానిని మూడు ముక్కలు చేయడం, అసలు అక్కడ కనీసం లెజిస్లేటివ్ రాజధాని కూడా ఉంటుందన్న నమ్మకం లేకపోవడంతో గన్నవరం విమానాశ్రయానికి భూములిచ్చిన వారు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు.
అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడం వల్లే తమ భూములు ఇచ్చామని, ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే అక్కడ నుంచి రాజధానిని తరలించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సినీనటుడు కృష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన ధర్మాసనం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.
అసలేం జరిగింది?
గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలని టీడీపీ ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా గన్నవరం మండలంలోని బుద్దవరం, కేసనపల్లిలో 800 ఎకరాల భూమి అవసరం అవుతుందని అంచనా వేశారు. అక్కడ ఎకరా రూ.5 కోట్లు పలుకుతోంది. అంత డబ్బు పెట్టి కొనుగోలు చేయడం సాధ్యం కాదని ప్రభుత్వం భావించింది. కేవలం భూ సేకరణకే రూ.4000 కోట్లు అవసరం కావడంతో, ప్రత్యామ్నాయాలను ఆలోచించారు.
అమరావతి రైతులకు ఇచ్చిన తరహాలో అంటే ఎకరాకు 25 సెంట్లు భూమిని రాజధాని ప్రాంతంలో ఇస్తామని రైతులను ఒప్పించారు. రైతులు కూడా అమరావతిలో నాలుగోవంతు భూములు ఇస్తే తమ భూములు విమానాశ్రయ అభివృద్ధికి ఇస్తామని అంగీకరించారు. అలా రైతుల వద్ద నుంచి విమానాశ్రయాల అభివృద్ధి అథారిటీ భూములను స్వాధీనం చేసుకుంది.
అమరావతి రాజధాని తరలిస్తే భూములు ఇవ్వం
సినీ నటుడు కృష్టంరాజు, సినీ నిర్మాత అశ్వనీదత్ లతో పాటు వందలాది రైతులు హైకోర్టును ఆశ్రయించారు. అమరావతి రాజధానిలో అభివృద్ధి చేసిన స్థలాలను పరిహారంగా ఇస్తామని గత ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చిన తరవాతే తమ భూములు అప్పగించామని, నేడు అమరావతి రాజధాని అభివృద్ధి నిలిచిపోయిందని, రాజధానిని తరలించే యోచనలో ప్రభుత్వం ఉందని, గత ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చలేదని రైతులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన హైకోర్టు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.
ఎకరాకు రూ.5 కోట్లు చెల్లించి భూములు తీసుకోండి
గన్నవరం విమానాశ్రయం ప్రాంతంలో ఎకరా భూమి మార్కెట్ విలువ రూ.5 కోట్లపైనే పలుకుతోంది. అయినా రైతులు ఎవ్వరూ భూములు అమ్మేందుకు సిద్దంగా లేరు. పరిహారం విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా తమ భూముల్లో పనులు జరగనీయమని రైతులు అడ్డుకుంటున్నారు. తమకు 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.











