బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ… ఉత్తరాదిపై పట్టు సాధించినా… దక్షిణాదిపై మాత్రం ఆ పార్టీకి ఇంకా పట్టు దక్కలేదు. ఒక్క కర్ణాటక మినహా మిగిలిన ఏ ఒక్క దక్షిణాది రాష్ట్రాల్లోనూ బీజేపీ… ఏదో ఒక ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకోత తప్పని పరిస్థితిొ .అయితేనేం… ఏపీలో టీడీపీ లాంటి బమైన మిత్రపక్షం లభించడంతో ఈ సారి అయినా దక్షిణాదిలో ఒకింత పట్టు బిగిద్దామన్న దిశగా బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు. అందుకు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)కి త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఈ తరహా పావులు కదిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గురువారం చండీఘడ్ లో జరిగిన హర్యానా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏర్పాటైన ఎన్డీఏ పక్షాల భేటీలోనే ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. బీజేపీ కీలక నేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా… టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో ఈ విషయంపై ప్రత్యేకంగా చర్చించారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మీరు కాస్తంత సాయం చేస్తే… అటు బీఆర్ఎస్ తో పాటు ఇటు కాంగ్రెస్ ను కూడా చిత్తు చేసి హైదరాబాద్ మేయర్ పీఠాన్ని చేజిక్కించుకుంటామని అమిత్ షా… చంద్రబాబుతో అన్నారట. ఎలాగూ ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన నేపథ్యంలో బీజేపీ, టీడీపీల మధ్య అప్పటిదాకా కొనసాగిన పొరపొచ్చాలన్నీ దూరమైపోయాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో మరింత సఖ్యతగా మెలిగేందుకు ఇటు అమిత్ షాతో పాటుగా అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అమితాసక్తి కనబరుస్తున్నారు. ఇలాంటి సుహృద్భావ వాతావరణంలో జరిగిన భేటీలో అమిత్ షా…జీహెచ్ఎంసీ ఎన్నికలను ప్రస్తావించడం, ఎన్నికల్లో టీడీపీ మద్దతు కోరడంతో చంద్రబాబు కూడా సానుకూలంగానే స్పందించినట్లు సమాచారం. అంటే… రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి టీడీపీకి మద్దతు ఇవ్వడం ఖాయమనే చెప్పాలి. ఎన్నికల్లో టీడీపీ కూడా పోటీ చేస్తుందా? లేదా? అన్న అంశాన్ని పక్కనపెడితే… గతంలో కంటే రానున్న ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలను సాదించడమైతే ఖాయమేనని చెప్పక తప్పదు.
వాస్తవానికి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో బీజేపీ, జనసేనతో కలిసి టీడీపీ పోటీ చేసింది. వెరసి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో టీడీపీ కూడా భాగస్వామ్య పక్షమే. అంతేకాదండోయ్.. ఎన్డీఏలోని భాగస్వామ్య పక్షాల్లో టీడీపీనే అత్యంత బలమైన పార్టీ కూడా. ఇక టీడీపీకి… ప్రత్యేకించి హైదరాబాద్ లో మంచి పట్టు ఉంది. కూకట్ పల్లి వంటి ప్రాంతాల్లో టీడీపీని ఢీకొట్టడం ఇతర పార్టీలకు దుస్సాధ్యమన్న విషయం ఇప్పటికే పలుమార్లు నిరూపితమైంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో ఇతర ప్రాంతాల పరిస్థితి ఎలా ఉన్నా… హైదరాబాబద్ పరిధిలో మాత్రం టీడీపీ మెజారిటీ ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుని సత్తా చాటింది. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు పూర్తిగా ఏపీపైనే దృష్టి సారించాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు బీజేపీ నుంచి ప్రతిపాదన రావడంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీకి మద్దతు ఇవ్వడంతో చంద్రబాబు అక్కడికక్కడే ఒప్పేసుకున్నట్లుగా సమాచారం.
గడచిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్, బీజేపీల మధ్యే పోటీ జరిగింది. కాంగ్రెస్ అసలు పోటీలో ఉన్నట్లుగానే కనిపించలేదు. మజ్లిస్ పార్టీ లేకపోతే… మేయర్ పీఠం బీజేపీనే వరించేదన్న రీతిలో కమలనాథులు సత్తా చాటారు. ఎన్నికల ఫలితాల్లో విజయానికి అతి సమీపంలోకి వచ్చి అడుగు దూరంలో నిలిచిపోయారు. నాటి ఫలితాల తీరు, మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో బీజేేపీకి వచ్చిన సీట్లు తదితరాలను బేరీజు వేసుకున్న మీదటే చంద్రబాబుతో అమిత్ షా భేటీకి సిద్ధమయ్యారు. అమిత్ షా అనుకుంటున్నట్లుగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి టీడీపీ మద్దతు లభిస్తే… ఈ దఫా భాగ్యనగరి మేయర్ పీఠంపై కమలనాథులు కూర్చోవడం ఖాయమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.