(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కలికితురాయిగా, ఉత్తరాంధ్ర సిగలో మణిహారంగా భావిస్తున్న భోగాపురం విమానాశ్రయానికి పరిస్థితులన్నీ అనుకూలిస్తే త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. ఈ పనులను వీలున్నంత తొందరలో ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ విమానాశ్రయానికి సంబంధించి కీలక నిర్ణయం కూడా తీసుకుంది.
పీపీపీ విధానంలో ..
పీపీపీ విధానంలో విమానాశ్రయ నిర్మాణానికి జీఎంఆర్ సంస్థ ముందు కొచ్చింది. టెండర్ల షరతుల్లో వారికి 2700 ఎకరాలు ఇవ్వాలనుకున్నా దాన్ని 2200 ఎకరాలకు రాష్ట్ర ప్రభుత్వం కుదించింది. 500 ఎకరాలను ప్రభుత్వం తన ఆధీనంలోనే ఉంచుకునేలా నిర్ణయం తీసుకుంది. ఎలాగైనా ఈ ఏడాది ఆఖరుకు ఎయిర్ పోర్టు నిర్మాణ పనులు ప్రారంభించాలని ప్రభుత్వం సన్నద్ధమవుతున్నందున విజయనగరం జిల్లా అధికార యంత్రాంగం ఆ మేరకు కసరత్తులు చేస్తోంది.
నిరంతరం ఉన్నతాధికారుల సమీక్ష
ప్రభుత్వ ఆదేశాల మేరకు విజయనగరం జిల్లాలో విమానాశ్రయ ప్రాజెక్టుకు సంబంధించి ఉన్నతాధికారులు నిరంతరం సమీక్ష జరుపుతున్నారు. ఇప్పటి వరకు సేకరించిన భూముల చదును పనులు చేపడుతున్నారు. మొత్తం 1800 ఎకరాలకు అధికార సిబ్బంది మూడు బృందాలుగా ఏర్పడి ఈ పనులను వేగంగా చేయిస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం అత్యంత ఆధునికంగా ట్రంపెట్ నిర్మాణం జరుగుతోంది. దీన్ని ఇటు విశాఖ, అటు శ్రీకాకుళం నుంచి వచ్చే వారంతా నేరుగా విమానాశ్రయ టెర్మినల్కు చేరుకునేలా అనుసంధానం చేస్తున్నారు. మొత్తం 3.14 కిలోమీటర్ల పొడవున దీన్ని నిర్మిస్తున్నారు. ఇందుకు 16 ఎకరాలను వినియోగిస్తున్నారు. విమానాశ్రయానికి కేటాయించిన 2700 ఎకరాల్లో 1383.40 ఎకరాలు జిరాయితీ కాగా, 822.03 ఎకరాల డీపట్టా, ప్రభుత్వ భూమి 422.89 ఎకరాలు ఉంది. ఇప్పటి వరకు 2365.30 ఎకరాల సేకరణ (93 శాతం) పూర్తవ్వగా,ఇంకా 259 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ప్రస్తుతం 1800 ఎకరాలు సిద్ధంగా ఉంది. 142 ఎకరాలకు సంబంధించి 90 మంది రైతులు వివిధ కారణాలతో ఎయిర్పోర్టుకు భూమిని ఇచ్చేందుకు అంగీకారం తెలపలేదు. వీరు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా తీర్పు రావాల్సి ఉంది. వివిధ కారణాలతో సుమారు 108 ఎకరాలు రైతుల ఆధీనంలోనే ఉంచుకున్నారు. వీటి కోసం అధికారులు రైతులతో మాట్లాడుతున్నారు. ఎలాగైనా త్వరితగతిన భూసేకరణ పూర్తి చేయడానికి రెవెన్యూ, సర్వే విభాగం, ఎయిర్ పోర్టు అభివృద్ధి సంస్థ అధికారులు సంయుక్తంగా కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం వివాదం లేని భూమినంతా జీఎంఆర్కు అప్పగించేందుకు సిద్ధమవుతున్నారు. ఏపీఏడీసీ చేతిలో సుమారు 1800 ఎకరాలు సిద్ధంగా ఉంది. అందులోనే ప్రస్తుతం చెట్ల తొలగింపు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో రూ.330 కోట్ల వరకు జమైనట్లు అధికారులు చెబుతున్నారు.
అప్రోచ్ రోడ్డుకు ..
అప్రోచ్, ట్రంపెట్ నిర్మాణానికి 103 ఎకరాలు అదనంగా అవసరం ఉంది. రైతులకు మంచి ధర ఇచ్చి ఆ భూములను తీసుకోవాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రారంభంలో ఎకరానికి రూ.37 లక్షల వరకు ఇచ్చారు. ప్రస్తుతం ధరలు పెరగడంతో తాము అనుకున్న ధర ఇస్తేనే ఇవ్వడానికి ముందుకొస్తామని రైతులు చెబుతున్నారు. దీనిపై వారితో కలెక్టరు, జేసీ సమావేశాలు ఏర్పాటు చేశారు. గ్రామ కంఠంలోని గృహాలకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, స్థలాలు ఇస్తామని గతంలో అధికారులు ప్రకటించారని, ఆ ప్రకారం న్యాయం చేయాలంటూ ప్రజలు కోరుతున్నారు. రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వం చూస్తోందని, మంచి ప్రాజెక్టు నిర్మాణానికి అందరూ సహకరిస్తే మూడేళ్లలో ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుందని, ఆ దిశగా రైతులు ఆలోచించి ముందుకు రావాలని అధికారులు కోరుతున్నారు.
భోగాపురం పనులు ప్రారంభమై ఆశించిన సమయంలో పూర్తయితే ప్రపంచ పటంలో విజయనగరానికి సముచిత స్థానం లభిస్తుందనేది నిర్వివాదాంశం.