దేశ చరిత్రలో నే ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయని ఘనకార్యానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. న్యాయమూర్తులకు దుర్దేశాలు ఆపాదిస్తూ సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి వరుసగా వ్యతిరేక తీర్పులు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ తీర్పుల వెనుక సుప్రీం కోర్టు జస్టిస్ ఎన్వీ రమణ ఉన్నారంటూ సీజే బాబ్డేకి సీఎం జగన్ లేఖ రాశారు. ఈ లేఖ 8వ తారీఖునే రాసినప్పటికీ 10వ తారీఖున మీడియాకు రిలీజ్ చేశారు. ఆలస్యంగా మీడియాకు విడుదల చేయడం వెనుక ఉద్దేశం ఏమిటని చర్చ జరుగుతోంది. ప్రధాని మోడీని ఇటీవలే కలిసి వచ్చిన తరువాతే జగన్ వాయిస్ లో తీవ్రత పెరిగినట్లు అర్ధమవుతుంది.
వ్యక్తిగత కక్షతోనే వివాదం మొదలయ్యిందా..?
మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ పై జగన్ వ్యక్తిగత కక్ష పెంచుకోవడంంతోనే ఈ వివాదం మొదలయ్యిందని వార్తలు వినబడుతున్నాయి. టీడీపీ ప్రభుత్వాన్ని ఇబ్బందులలలో నెట్టేందుకే జగన్ అమరావతి భూకుంభకోణ విషయాన్ని ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ కేసులోొ దమ్మాలపాటి శ్రీనివాస్ నే కాకుండా జగన్ తన గురిని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పై కూడా పెట్టినట్లు స్పష్టం అవుతుంది. అమరావతిని రాజధానిగా ప్రకటించక ముందే చంద్రబాబు నాయుడు నుంచి సమాచారం పొంది రమణ, దమ్మాలపాటిలు భూములు కొనుగోలు చేసినట్లు జగన్ ప్రభుత్వం వాదనగా ఉంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు గడప తొక్కిన దమ్మాలపాటి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఈ ఆర్డర్ వెనుక కూడా జస్టిస్ ఎన్వీ రమణ ఉన్నారంటూ జగన్ సర్కార్ ఆరోపణలు చేస్తోంది.
ఆధారాలు చూపించరేంటీ సారూ
రమణ సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో తన ఇద్దరు కుమార్తెలు తన మీదే ఆధారపడినట్లు అఫిడవిట్ లో తెలిపారని చెప్పుకొచ్చారు. అయితే.. జస్టిస్ రమణ కుమార్తెలు ఎప్పుడు భూములు కొనుగోలు చేశారు అనే విషయాన్ని ప్రభుత్వం స్పష్టంగా వెల్లడించలేదు. దీనిపై పలు అనుమానాలు వెల్లువుత్తుతున్నాయి. ఒకవేళ ప్రభుత్వం చెబుతున్నట్లు అక్రమ కొనుగోలు అయితే రుజువులతో సహా బయట పెట్టెందుకు ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటంటూ నిపుణులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. సుప్రీం న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్ ను ఆధారంగా చేసుకొని జగన్ ఇప్పుడు ప్రశ్నలు లేవనెత్తడం హాస్యాస్పదంగా ఉందంటూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఎన్వీ రమణ న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసి చాలా కాలం అయ్యింది. ఆ సమయంలో ఆయన ఇద్దరు కుమార్తెలకు వివాహాలు జరగలేదు. కానీ ఇప్పుడు వారిరువురికి పెళ్లిళ్లు అయ్యాయి. పెళ్లిళ్లు అయిన తరువాత కూడా భర్త మీద కాకుండా తండ్రి మీద ఆధారపడతారని సీఎం హోదాలో ఉన్న వ్యక్తి చెప్పడం ఏంటని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
జగన్ ‘సరికొత్త’ ఎత్తుగడ..
అమికస్ క్యూరీ సిఫారసుల మేరకు ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసులను సుప్రీం వేగవంతం చేసింది. ఈ కేసులను విచారణ జరుపుతున్న ఎన్వీ రమణపై ఫిర్యాదు చేయడం ద్వారా ఈ కేసుల విచారణను ఆలస్యం చేయాలని జగన్ ఆలోచనగా ఉన్నట్లు చర్చ జరుగుతోంది. గతంలో న్యాయమూర్తిగా ఉన్న జాస్తి చలమేశ్వర్ చంద్రబాబు నాయుడుకు, జస్టిస్ ఎన్వీ రమణకు మధ్య సత్సంబంధాలు ఉన్నట్లు అప్పటి సీజేకు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా జగన్ సీజేకు రాసిన లేఖలో దాని గురించి ప్రస్తావించారు. అయితే జగన్ ఈ మధ్య కాలంలో చేసిన ఢిల్లీ పర్యటనలో జగన్ వెంట జాస్తి చలమేశ్వర్ కుమారుడు ఉండడం కూడా పలు అనుమానాలకు తావిస్తుంది. ఎన్వీ రమణపై ఉన్న కోపంతోనే జాస్తి చలమేశ్వర్ జగన్ సర్కార్ కు మద్దతు ఇస్తున్నట్లు అర్థమవుతోందని విమర్శలు వస్తున్నాయి.
టార్గెట్ @ 2021
ప్రస్తుతం సీజేగా ఉన్న బాబ్డే పదవీకాలం వచ్చే ఏడాది ఏప్రిల్ 25 వరకు ఉంది. అంతా సవ్యంగా జరిగితే 2021 ఏప్రిల్ 25న జస్టిస్ ఎన్వీ రమణ సీజే కానున్నారు. సీజేగా ఎన్వీ రమణ ఉంటే తమకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో జగన్ ఇప్పటి నుంచే వ్యూహ రచన చేసినట్లు వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. కొలీజియం సిఫారుసుల మేరకు ఎన్వీ రమణ సీజే రేస్ లో ముందంజలో ఉన్నారు. ఒకవేళ ఆయన సీజేగా వస్తే 2022 ఆగష్టు 26 వరకు ఆ పదవిలో ఉండనున్నారు. ఎన్వీ రమణ నియామకానికి అడ్డుకట్ట వేసేందుకు జగన్ ఈ లేఖ రాసినట్లు రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.











