జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై వివిధ పార్టీల నేతలతో చర్చించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన సమావేశాన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీతో పాటు, జనసేన, బీజేపీ కూడా బహిష్కరించాయి. ఎన్నికల షెడ్యూల్ ఇవ్వక ముందే అన్ని పార్టీలతో చర్చించాలని, షెడ్యూల్ ప్రకటించాక సమావేశం ఏర్పాటు చేయడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఇక తాజాగా షెడ్యూల్ విడుదల చేయాలంటూ జనసేన ఇప్పటికే హైకోర్టులో కేసు వేసింది. దీనిపై రేపు విచారణ జరగనుంది. ఇంతలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంపై ఆ పార్టీ కూడా సీరియస్గా ఉంది. ఎస్ఈసీ సమావేశానికి హాజరు కావడం లేదని జనసేన ప్రకటించింది.
ఎన్నికలు కూడా బహిష్కరిద్దామా..
తాజా షెడ్యూల్ ఇవ్వకుండా, ఎక్కడ ఆగిపోయాయో అక్కడ నుంచే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించడంతో అసలు ఎన్నికల్లో పాల్గొనాలా, బహిష్కరించాలా అనే విషయంపై చర్చించేందుకు టీడీపీ పొలిట్ బ్యూరోలో చర్చిస్తున్నారు. కొత్త నోటిఫికేషన్ ఇవ్వకుండా పాత నోటిఫికేషన్ ద్వారా ఎన్నికలకు ముందుకు వెళితే మాత్రం ఎన్నికలు బహిష్కరించే అవకాశం కనిపిస్తోంది. దీనిపై టీడీపీ పొలిట్ బ్యూరో ఇవాళ ఓ నిర్ణయం తీసుకోనుంది.