ప్రపంచంలోనే అత్యధిక సంపన్నుల జాబితాలో అన్న ముకేశ్ అంబానీ దూసుకుపోతుంటే తమ్ముడు అనిల్ అంబానీ మాత్రం రోజు రోజుకు పతనమవుతున్నారు. తమ సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడంతో అనిల్ అంబానీ $700 మిలియన్ డాలర్స్ రుణాన్ని తీసుకున్నారు. ఈ రుణాన్ని చైనాకు చెందిన మూడు బ్యాంకుల నుంచి పొందారు. ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో ఆయన చాలా రోజులుగా బ్యాంకులకు ఈఎంఐలు కట్టలేకపోయారు. దీంతో అనిల్ అంబానీని ‘డీఫాల్టర్’గా ప్రకటించిన ఆ కంపెనీలు లండన్ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఈ కేసును పలుమార్లు విచారించిన కోర్టు తాజాగా మరోమారు విచారణ జరిపింది. ఈ విచారణలో న్యాయమూర్తి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
బ్యాంకులకు అప్పు ఎగ్గొట్టి ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నట్టున్నారు అంటూ న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు అనిల్ అంబానీ ఆసక్తికరమైన సమాధానాన్ని ఇచ్చారు. తాను నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతున్నానని కోర్టుకు తెలిపారు. న్యాయవాదులకు ఫీజులు చెల్లించేందుకు కూడా తన దగ్గర డబ్బులు లేవని..ఇంట్లో ఉన్న నగలను అమ్మడం ద్వారా వచ్చిన 9.9 కోట్లతో ఫీజులు చెల్లిస్తున్నాని తెలిపారు. తన అన్నయ్య ముకేశ్ కు చెందిన ఇంట్లో ఉండటం ద్వారా ఇంటి రెంట్ కట్టే పరిస్థితి నుంచి తప్పించుకున్నానని విచారాన్ని వ్యక్తం చేశారు. తాను విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నానని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.
రోల్స్ రాయిస్ కారు తన వద్ద లేదని కేవలం ఓ సామాన్య కారులో తిరుగుతున్నానని తెలిపారు. తన కోరికలు మాములుగానే ఉంటాయని చెప్పిన ఆయన తాను మారథాన్ రన్నరని, చెడు వ్యసనాల జోలికి వెళ్లనని చెప్పారు. క్రమశిక్షణతో జీవితాన్ని గడుపుతానని వెల్లడించారు. భూత-వర్తమాన-భవిష్యత్తులలో కూడా ఆడంబరమైన జీవితాన్ని గడపలేదని..గడపబోనని పేర్కొన్నారు. ఒకవేళ అలా ఎవరైనా ఊహిస్తే అది ఒక భ్రమే అవుతుందని చెప్పారు. అనిల్ అంబానీ గతంలో తన నికర ఆస్తి విలువ సున్నా అని ప్రకటించి సంచలనం సృష్టించారు. ఆ నేపథ్యంలోనే బ్యాంకులు కోర్టులో ఫిర్యాదులు చేశారు. గతంలో విచారణ సందర్భంగా న్యాయమూర్తి హాలీవుడ్ చిత్ర నిర్మాణంలో పెట్టుబడులు పెట్టేందుకు డబ్బులు ఉన్నాయి గాని రుణాలను కట్టేందుకు డబ్బులు లేవా? అంటూ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. తదుపరి విచారణను వాయిదా వేసింది.











