వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరుపై మండిపడ్డారు సీఎం చంద్రబాబు. జగన్పై సెటైర్లతో విరుచుకుపడ్డారు. వెధవ పనులు చేసిన కారణంగానే వైసీపీ 11 సీట్లకే పరిమితమైందని ఓ సంచలన కామెంట్ చేశారు. ఏపీ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసిన వైసీపీ ఆ మరుసటి ఎన్నికల్లోనేఅతి తక్కువ సీట్లకు పడిపోయిందని బాబు అన్నారు.
ఏపీలో ఇప్పుడు జగన్ చేస్తున్న ఓదార్పు, పరామర్శ యాత్రలపై బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలు తెలుసుకోవాలంటే 40 వేల మంది కార్యకర్తలను వెంటేసుకుని వెళతారా? అంటూ ఆయన ఆగ్రహించారు. అలా వెళ్లిన 40 వేల మంది కారణంగా మిర్చీ టిక్కీలు, పొగాకు బేళ్లు ఏ మేర నష్టపోయాయో జగన్ కు తెలుసా? అని ఆయన ప్రశ్నించారు. అయినా రౌడీ షీటర్లను పరామర్శించేందుకు వెళ్లే రాజకీయ నేతను ఏమంటారని బాబు ప్రశ్నించారు. నేర స్వభావం ఉన్న వారే ఈ పనులు చేస్తారని బాబు ఓ రూలింగ్ ఇచ్చారు.
ఈ సందర్భంగా అభివృద్ధి గురించి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ అభివృద్ధికి తాను పునాది రాయి వేస్తే…ఆ తర్వాత సీఎంగా పదవి చేపట్టిన వైఎస్ రాజశేఖరరెడ్డి కొనసాగించారని తెలిపారు. ప్రజల పట్ల మమకారం, అభివృద్ధి పట్ల ఆసక్తి, ఎన్నికల్లో ఓట్లు కోల్పోతామన్న భయం…ఇలా అన్నీ అంచనా వేసుకున్న తర్వాతే లౌక్యంగా వ్యవహరించి హైదరాబాద్ అభివృద్ధిని కొనసాగించారన్నారు. ఈ కారణంగానే వైఎస్ వరుసగా రెండో సారి కూడా విజయం సాధించారని ఆయన తెలిపారు. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా హైదరాబాద్ అభివృద్దిని నిర్లక్ష్యం చేయలేదని చంద్రబాబు గుర్తు చేశారు.
వైఎస్ కుమారుడిని అని చెప్పుకునే జగన్ లో తండ్రి లక్షణాలే లేవని చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారం చేతికి వచ్చేదాకా ఒక మాట మాట్లాడిన జగన్… అధికారం చేతికి అందగానే మాట మార్చేశారని, అమరావతితో పాటు పోలవరం పనులను ఎక్కడికక్కడ నిలిపివేశారని ఆరోపించారు. అంతేకాకుండా రాష్ట్రానికి వచ్చిన పారిశ్రామికవేత్తలను భయపెట్టి మరీ పారిపోయేలా చేశారని ధ్వజమెత్తారు. నేరస్వభావం ఉన్న జగన్ ను ఐదేళ్ల పాటు ఎలాగోలా భరించిన జనం..తమకు అవకాశం రాగానే జగన్ కు తగిన రీతిలో గట్టిగా బుద్ధి చెప్పారన్నారు. ఇకనైనా జగన్ పరిణతి కలిగిన రాజకీయనేతగా వ్యవహరించాలని, అలాకాకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తానంటే మాత్రం తాట తీస్తానని హెచ్చరించారు.