ఏపీ ఆర్థిక రాజధాని విశాఖకు మరో ఐటీ కంపెనీ రానుంది. సాఫ్ట్వేర్ దిగ్గజం కాగ్నిజెంట్ విశాఖలో క్యాంపస్ పెట్టేందుకు అంతా సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా విశాఖలో రూ. 1,583 కోట్ల పెట్టుబడి పెట్టనుంది కాగ్నిజెంట్ . 8 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఇప్పటికే కాగ్నిజెంట్కు కాపులుప్పాడలో 21.31 ఎకరాల స్థలం కేటాయించారు. విశాఖను ఐటీ హబ్ గా మార్చాలన్న లక్ష్యంతో ఇప్పటికే గూగుల్ , టీసీఎస్ వంటి సంస్థలను తమ క్యాంపస్లను పెట్టడానికి అంగీకరించేలా చేశారు.
కాగ్నిజెంట్ను ఏపీకి తీసుకు రావడానికి నారా లోకేష్ గట్టి ప్రయత్నాలు చేశారు. జనవరి 2025లో దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో నారా లోకేష్, కాగ్నిజెంట్ సీఈఓ ఎస్.రవి కుమార్ మధ్య జరిగిన చర్చలు జరిగాయి. ఆ చర్చల తర్వాత అధికారులు కూడా ఫోలోఅప్ చేశారు. చివరకు కాగ్నిజెంట్ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయింది.
భారత ఐటీ దిగ్గజం టీసీఎస్ ఇప్పటికే విశాఖలో భారీ క్యాంపస్ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించింది. ముందుగానే కార్యాలయం ప్రారంభించేందుకు మిలీనియం టవర్స్ లో ఏర్పాట్లు చేసుకుంటోంది. గూగుల్ కూడా ఇప్పటికే ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఎలాంటి క్యాంపస్ పెట్టబోతున్నారన్నది త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
కూటమి ప్రభుత్వం ఏపీకి పెట్టుబడుల కోసం తీవ్రంగా కృషి చేస్తోంది. ప్రధానంగా విశాఖను ఆంధ్ర ఐటీ రాజధానిగా తీర్చిదిద్దేందుకు స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది. కంపెనీలకు రెడ్ కార్పెట్ వేస్తోంది. ఏ చిన్న అవకాశం దొరికినా ఏపీలో పెట్టుబడి అవకాశాలు, స్థానిక యువతకు ఉన్న టాలెంట్ను వివరిస్తోంది. మొత్తంగా దిగ్గజ కంపెనీలను ఏపీకి తీసుకురావడమే లక్ష్యంగా లోకేష్ టీం వేట కొనసాగిస్తోంది.