నవ్యాంధ్ర రాజధాని అమరావతి పనులు చురుగ్గా సాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా అమరావతికి సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు పురపాలక శాఖ మంత్రి నారాయణ. భవిష్యత్తులో అమరావతి, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, విజయవాడలు కలిపి మెగా సిటీగా ఏర్పాటు చేయాలనేది చంద్రబాబు మాస్టర్ ప్లాన్ అన్నారు. మెగాసిటీకి ఓ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అవసరమన్నారు. ఇందుకోసం 5 వేల ఎకరాలు కావాలని, ఆ మేరకు భూమి పరిశీలించాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. రాజధాని నిర్మాణ పనులకు కావాల్సిన గ్రావెల్ కోసం మంగళవారం అమరావతిలోని అనంతవరం గ్రామ కొండలను నారాయణ పరిశీలించారు. రాజధాని అమరావతి కోసం మరోసారి సేకరించే భూమిని భూసేకరణ ద్వారా తీసుకోవాలా? భూసమీకరణ ద్వారా తీసుకోవాలా అనేదానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు.భూ సేకరణ ద్వారా 5 వేల ఎకరాలు తీసుకోవచ్చని, కానీ సేకరణ ద్వారా భూములు తీసుకుంటే రైతులు నష్టపోతారని ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారన్నారు.
భూసేకరణ ద్వారా భూములు తీసుకుంటే రిజిస్ట్రేషన్ ధర కంటే రెండున్నర రెట్లు మాత్రమే ఎక్కువ వస్తుందని. సమీకరణ ద్వారా అయితే రైతులకు ప్రయోజనం ఉంటుందన్నారు. భూసమీకరణలో 5 వేల ఎకరాలు కావాలంటే..సుమారు 30 వేల ఎకరాల్ని తీసుకోవాలి. దీనిలో రోడ్లు, రైతులకు రిటర్నబుల్ ప్లాట్లకు లేఅవుట్లు వేసి, డ్రెయిన్లు కట్టాల్సి ఉంటుందన్నారు. ఇక చంద్రబాబు హైదరాబాద్లో ఎయిర్పోర్టు నిర్మించినప్పుడు కూడా అంత భూమి ఎందుకని చాలా మంది విమర్శించారని, కానీ ఈ రోజు ఉత్తమ ఎయిర్పోర్టులలో శంషాబాద్ ఒకటన్నారు. చంద్రబాబు రాబోయే వందేళ్ల గురించి ఆలోచిస్తారని చెప్పారు. విమానాశ్రయంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో క్రీడానగరాన్ని నిర్మించాలనే ఆలోచనా ఉందన్నారు. దీనిని నిర్మిస్తే..దేశవిదేశాల నుంచి క్రీడాకారులు, అభిమానులు వస్తారని, వారి వసతి కోసం పెద్ద హోటళ్లు ఏర్పాటవుతాయన్నారు నారాయణ. నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.
గ్రావెల్ కోసం 851 ఎకరాలు
అమరావతిలో నిర్మాణాలకు అవసరమైన గ్రావెల్, కంకర సరఫరా చేయటానికి గనులశాఖ 5 జిల్లాల్లో 851 ఎకరాలను CRDAకు కేటాయించిందని చెప్పారు మంత్రి నారాయణ. వీటిలో ఏలూరు జిల్లాలో 355, కృష్ణాలో 428, పల్నాడులో 28, గుంటూరులో 21, ఎన్టీఆర్ జిల్లాలో 18 ఎకరాలు ఉన్నాయని స్పష్టం చేశారు. రాజధాని గ్రామం అనంతవరంలోని కొండ ప్రాంతాన్ని 2014-19లోనే CRDA ఇచ్చారని గుర్తు చేశారు. వాటిలో గ్రౌండ్ లెవల్ కంటే 6 నుంచి 8 మీటర్ల లోతు వరకు భూమిని తవ్వారని…ఆ ప్రాంతాన్ని మొత్తం డ్రోన్లతో సర్వే చేయిస్తామన్నారు. అధికారులతో చర్చించిన అనంతరం గోతులు పూడ్చుతాం. ఆ భూమిని కూడా ఏదో ఒక అవసరాలకు వినియోగించాలనే ఉద్దేశంతోనే అనంతవరం వచ్చానన్నారు.
రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు అపోహపడాల్సిన పనేం లేదన్నారు నారాయణ. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రస్తుతం ఉన్న మాస్టర్ ప్లాన్తో మూడేళ్లలో అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. అధికారుల కోసం నిర్మించిన ప్రభుత్వ భవనాలను ఏడాదిలోపు పూర్తి చేస్తామన్నారు. ఏడాదిన్నరలో అమరావతిలో సుమారు 360 కి.మీ. ట్రంక్ రోడ్లు నిర్మిస్తామని చెప్పారు. రెండున్నరేళ్లలో రైతుల రిటర్నబుల్ ప్లాట్ల లేఅవుట్లలోని రోడ్లు, మూడేళ్లలో ఐకానిక్ టవర్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే అమరావతి పునర్నిర్మాణానికి అవసరమైన 68 పనులకు సంబంధించి రూ.42,360 కోట్ల విలువైన టెండర్లు పూర్తి చేశామన్నారు. రాజధానిలో రూ.64,912 కోట్లతో మొత్తం 92 పనులు చేపడతామని వివరించారు. గత వైసీపీ ప్రభుత్వం రాజధానిని కట్టనప్పుడు 2014-19 వరకు ఇచ్చిన టెండర్లను రద్దు చేసినా బాగుండేదని…వాటికి డబ్బులు చెల్లించకుండా అలాగే ఉంచడంతో న్యాయపరమైన సమస్యలు తలెత్తాయన్నారు. వాటిని పరిష్కరించడానికి 7, 8 నెలలు పట్టిందని..మళ్లీ టెండర్లు పిలిచామన్నారు.