ఏపీలో వైసీపీ మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. కుల, మత, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందేందుకు వైసీపీ అధ్యక్షుడు జగన్ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ నేతలు 3 మతాలను వాడుకుంటున్నారని, తిరుపతిలోని గోశాలలో గోవులు చనిపోయాయంటూ టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డితో దుష్ప్రచారం చేయించి హిందువులను రెచ్చగొట్టాలని చూస్తున్నారన్నారు చంద్రబాబు. వక్ఫ్ బిల్లుపైనా వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందన్నారు. ఇక పాస్టర్ ప్రవీణ్ మృతిపై వైసీపీ వివాదం చేయాలని చూసిందన్నారు. ఇదంతా కుట్రలో భాగమేనన్నారు. ఇలాంటి కుట్రలను సమర్థంగా తిప్పికొట్టడంతో పాటు, ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు.
తెలుగుదేశం పార్టీ అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుందన్నారు చంద్రబాబు. జగన్ క్రిస్టియానిటీ తీసుకున్నారని..అది ఆయన ఇష్టం అన్నారు. కానీ, జగన్ తిరుమల వెళ్లినప్పుడు అక్కడి ఆచారాలను పాటించాల్సిందేనన్నారు చంద్రబాబు. డిక్లరేషన్ ఇవ్వను, సంతకం చేయను అంటే భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు చంద్రబాబు. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల వెళ్లి అక్కడి ఆచారాన్ని గౌరవిస్తూ డిక్లరేషన్ ఇచ్చారని గుర్తు చేశారు. తల నీలాలూ సమర్పించారని..అన్న ప్రసాదానికి విరాళమిచ్చారన్నారు. అన్ని మత విశ్వాసాల్నీ గౌరవించడం అంటే ఇదేనని ప్రశంసలు కురిపించారు. జగన్ మతాన్ని దాచుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు చంద్రబాబు. భార్యతో కలిసి ఆలయానికి వెళ్లకపోవడం ఏ ధర్మమో అంటూ దుయ్యబట్టారు.
అధికారుల అవినీతిపై సీరియస్
మంత్రులకు శాఖలపై పూర్తి పట్టుండాలన్నారు చంద్రబాబు. అధికారులెవరైనా అవినీతికి పాల్పడుతుంటే నియంత్రించాల్సిన బాధ్యత వారిదేనని స్పష్టంచేశారు. ఇటీవల కొందరు అధికారుల అవినీతి వ్యవహారాలు తరచూ చర్చనీయాంశమవుతున్నాయని. ఇది ఎంతమాత్రం ఉపేక్షించతగ్గది కాదన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మంత్రులు సీరియస్గా వ్యవహరించాలన్నారు. అలాగని ముందూ వెనుకా చూడకుండా దూకుడుగా వెళ్లమని తాను చెప్పడం లేదన్నారు. దేనికైనా ఒక పద్ధతి ఉంటుందని..మీ పరిధిలోని అధికారులెవరైనా తప్పు చేస్తుంటే పద్ధతి మార్చుకోవాలని అప్రమత్తం చేయాలని సూచించారు. అప్పటికీ వినకపోతే చర్యలు తీసుకుందామన్నారు.
రెవెన్యూశాఖ ప్రక్షాళన
ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, అర్జీల్లో ఎక్కువ రెవెన్యూశాఖవే ఉంటున్నాయన్నారు చంద్రబాబు. దాన్ని ఎలా ప్రక్షాళించాలో అర్థంకావడం లేదని, ఎంత ప్రయత్నించినా మైలేజి రావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. రెవెన్యూ సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. రెవెన్యూ వివాదాల్లో, భూసమస్యల్లో పోలీసుల జోక్యంపైనా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. అలా జరగకుండా చూడాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో పోలీసుల్ని ప్రయోగించి కొన్ని రెవెన్యూ వివాదాల్ని సెటిల్ చేయించేందుకు ప్రయత్నించారని. వాటిపై ఇప్పుడు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు చంద్రబాబు.
నిర్మాణాలపై మంత్రులతో కమిటీ
రాజధాని అమరావతిలో శాసనసభ, హైకోర్టు, సచివాలయం టవర్ల నిర్మాణం, మౌలిక వసతుల అభివృద్ధి మూడేళ్లలో పూర్తి చేయాల్సిందేనని సీఎం స్పష్టంచేశారు. ఇవన్నీ పూర్తి చేసిన తర్వాతే ఎన్నికలకు వెళతామన్నారు. కొత్తగా నిర్మించే అసెంబ్లీ భవనంలో ఇంటర్నల్ లేఅవుట్, వసతులు ఎలా ఉండాలి? అందరికీ ఆమోదయోగ్యంగా, సౌకర్యంగా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై సలహాలు, సూచనలు ఇచ్చేందుకు శాసనసభాపతి అయ్యన్నపాత్రుడి ఆధ్వర్యంలో మంత్రులు పి.నారాయణ, కేశవ్, లోకేశ్, నాదెండ్ల మనోహర్లతో కమిటీని వేస్తున్నట్టు ప్రకటించారు.