ఉరుము లేని పిడుగులా కరోనా వచ్చి పడింది గానీ… జగన్ సర్కారు స్పీడును చూస్తుంటే… ఏపీ పాలన సాంతంగా ఎప్పుడో విశాఖకు తరలిపోయేదే. కరోనా తొలి వేవ్… దాని నేంచి తేరుకునేలోగా సెకండ్ వేవ్ వచ్చి పడిన నేపథ్యంలో రాజధాని తరలింపు అలా పక్కన పెట్టేశారు. ఇప్పుడు సెకండ్ వేవ్ తగ్గిపోతున్న నేపథ్యంలో మళ్లీ రాజధాని తరలింపులో వేగం పుంజుకుంది. వరుసగా మంత్రుల నోట నుంచి వస్తున్న ప్రకటనలే ఇందుకు నిదర్శనం. ఓ వైపు మూడు రాజధానుల వ్యవహారం హైకోర్టులో పెండింగ్ లో ఉండగానే… అబ్బే కోర్టు కేసులతో ఇబ్బందేమీ లేదని, కోర్టులో సమస్యల్లేకుండానే పరిపాలనా రాజధానిని విశాఖకు తరలిస్తామని జగన్ సర్కారు చెబుతోంది. ఇలాంటి సమయంలో జగన్ సర్కారుపై అసహనం వ్యక్తం చేస్తూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు మూడు రాజధానుల స్పీడుకు సడెన్ బ్రేకులేసిందనే చెప్పాలి.
జగన్ సర్కారుపై హైకోర్టు అసహనం
అయినా ఇప్పుడు మూడు రాజధానుల ఏర్పాటును నిలుపుదల చేయాలంటూ దాఖలైన పిషిషన్ పై ఎలాంటి విచారణ జరగలేదు కదా.. మరి ఈ అంశం ప్రస్తావన హైకోర్టులో ఎలా వచ్చిందన్న విషయం మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. వాస్తవానికి మూడు రాజధానుల అంశంపై విచారణేమీ జరగలేదు. వేరే అంశానికి చెందిన విచారణ సందర్భంగా జగన్ సర్కారు వినిపించిన వాదన విన్నంతనే హైకోర్టు ధర్మాసనానికి చిర్రెత్తుకొచ్చిందట. అంతే పొంతన లేని వాదనలు ఎలా వినిపిస్తారంటూ జగన్ సర్కారును కడిగిపారేసిందట. అంతేకాకుండా ఇరత్రా ఖర్చులు, పెండింగ్ బిల్లులకే డబ్బల్లేకపోతే… ఇక మూడు రాజధానులను ఎలా కడతారంటూ నిలదీసిందట. దీంతో జగన్ సర్కారు తరఫు న్యాయవాదులు నీళ్లు నమిలారట.
మూడు రాజధానులను కట్టేందుకు ఎవరొస్తారు?
ఈ ఘటన పూర్తి వివరాల్లోకెళితే… ఏపీలో రెండేళ్ల క్రితం పూర్తి చేసిన పనులకు కూడా బిల్లులు మంజూరు చేయడం లేదంటూ పలువురు కాంట్రాక్టర్లు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై సోమవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా రెండేళ్ల క్రితం పూర్తి చేసిన పనులకు ఇంకా బిల్లులు చెల్లించని మాట వాస్తవమేనని జగన్ సర్కారు ఒప్పుకుంది. దీనికి గల కారణమేమిటంటూ హైకోర్టు ప్రశ్నిస్తే… సర్కారీ ఖజానాలో నిధులు లేవు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉందని ప్రభుత్వ ప్లీడర్లు చెప్పారట. అంతే… ఒక్కసారిగా ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు… రెండేళ్ల బిల్లులనే చెల్లించలేని పరిస్థితి ఉంటే… ఇక మూడు రాజధానులను ఎలా కడతారంటూ నిలదీసిందట. రెండేళ్ల క్రితం పూర్తి అయిన పనులకే బిల్లులు పెండింగ్ లో ఉంటే.. కొత్తగా మూడు రాజధానులను కట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకొస్తారా? అని కూడా హైకోర్టు మరింత సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా రాష్ట్ర పరిస్థితి అంత దయనీయంగా ఉందా? అంటూ హైకోర్టు ప్రశ్నించిందట.
ఆ శాఖల అధికారులు విచారణకు రావాల్సిందే
రెండేళ్ల క్రితం నాడే చేసిన పనులకు బిల్లులు చెల్లించకుండా రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిని సాకుగా ఎలా చూపిస్తారంటూ హైకోర్టు జగన్ సర్కారుపై అసహనం వ్యక్తం చేసిందట. అక్కడితో ఆగని హైకోర్టు ఈ తరహా పొంతన లేని వాదనలకు బాధ్యుల్ని చేస్తూ ఆర్ధికశాఖ, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శుల్ని ఈ నెల 28న స్వయంగా తమ ముందు హాజరుకావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ఆర్ధిక పరిస్దితిపై సమగ్ర నివేదికతో రావాలని వీరిద్దరినీ హైకోర్టు సూచించింది. అలాగే పిటిషనర్లు అయిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఎందుకు చెల్లించలేదో కూడా తెలియజేస్తూ మరో అఫిడవిట్ కూడా దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. మొత్తంగా మూడు రాజధానులపై దూకుడు ప్రదర్శిద్దామని ఉవ్విళ్లూరుతున్న జగన్ సర్కారుపై హైకోర్టు అసహనం నీళ్లు చల్లినట్టైందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- అమరావతిపై ఎందుకు అంత ద్వేషం.. పదివేల కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా?