(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
విజయనగరం జిల్లాలోని రామతీర్థం పుణ్యక్షేత్రాన్ని సందర్శించడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం పట్ల భారతీయ జనతా పార్టీ, జనసేన నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అడుగడుగునా తమను అడ్డుకోవడం, గృహ నిర్బంధం చేయడం, ఛలో రామతీర్థం ప్రదర్శనను భగ్నం చేస్తోండటం పట్ల మండిపడుతున్నారు. జగన్ ప్రభుత్వం, పోలీసుల వైఖరి పట్ల నిప్పులు చెరుగుతున్నారు. రామతీర్థాన్ని సందర్శించడానికి వెళ్లిన పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజును అరెస్ట్ చేయడాన్ని తప్పు పడుతున్నారు. జనసేనతో కలిసి బీజేపీ నిర్వహించ తలపెట్టిన రామతీర్థం ధర్మయాత్రను అడ్డుకోవడం జగన్ సర్కార్ ద్వంద్వనీతికి నిదర్శనమని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. తమ పార్టీ నేతలు రాములవారిని సందర్శించడానికి వెంటనే అనుమతి ఇవ్వాలని, పోలీసుల బందోబస్తును ఉపసంహరించుకోవాలని బీజేపీ రాష్ట్రశాఖ ప్రధాన కార్యదర్శి సోమగుంట విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.
తదనంతర పరిణామాలకు సర్కారుదే బాధ్యత
రామతీర్థం సందర్శించడానికి తమకు వెంటనే అనుమతి ఇవ్వాలని, లేదంటే రాష్ట్రం తగులబడిపోతుందని ఆయన హెచ్చరించారు. తదనంతరం చోటు చేసుకోబోయే పరిణామాలకు జగన్ ప్రభుత్వమే నైతిక బాధ్యతను వహించాల్సి ఉంటుందని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. రామతీర్థాన్ని సందర్శించడానికి తమ సొంత పార్టీ, తెలుగుదేశం నేతలకు అనుమతి ఇచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. బీజేపీ,జనసేనలకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నించారు. జగన్ సర్కార్ ద్వంద్వనీతికి ఇది నిదర్శనమని ఆరోపించారు. రాష్ట్రంలో తాము వైసీపీ, టీడీపీలకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నామని, అందుకే తమను చూసి ఆ రెండు పార్టీలు భయపడుతున్నాయని ఆరోపించారు.నిరంకుశంగా వీర్రాజు అరెస్టు
60 సంవత్సరాల వయస్సు ఉన్న తమ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజును నిరంకుశంగా అరెస్ట్ చేశారని విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. ఆయనను వెంటనే విడిచి పెట్టాలని డిమాండ్ చేశారు. జగన్ సర్కార్ చర్యలను ప్రతి హిందువు తప్పుపడుతున్నారని చెప్పారు. ఇప్పటికైనా అధికార పార్టీ తన తప్పును తెలుసుకోవాలని సూచించారు. వచ్చే తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీని ఓడించడం ఖాయమని జోస్యం చెప్పారు. మంగళవారం చేపట్టిన ‘చలో రామతీర్థం’ దృష్ట్యా విజయనగరంలో ముందస్తుగా అరెస్టు చేసిన బీజేపీ , జనసేన నాయకులను పోలీసులు విడుదల చేశారు.